TS Inter Results: తెలంగాణలో ఇంటర్ ఫలితాలు వెల్లడయ్యే టైమొచ్చింది..!

ABN , First Publish Date - 2023-05-08T16:26:47+05:30 IST

తెలంగాణ ఇంటర్ ఫలితాలను మంగళవారం విడుదల చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలను విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు.

TS Inter Results: తెలంగాణలో ఇంటర్ ఫలితాలు వెల్లడయ్యే టైమొచ్చింది..!

హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ ఫలితాలను (Inter Results) మంగళవారం విడుదల చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలను విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి (Education Minister Sabitha Indra Reddy) విడుదల చేయనున్నారు. ఇంటర్ ఫస్ట్, సెకండియర్ (Inter First, Second Year) కలిపి 9.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి 15 నుంచి 29 మధ్య ఇంటర్‌ పరీక్షలు నిర్వహించారు. స్పాట్‌ వాల్యూయేషన్‌ (Spot Valuation) ప్రక్రియ 20 రోజుల క్రితమే పూర్తయింది. పరీక్షలు ముగిసి సుమారు 40 రోజులు గడుస్తున్నప్పటికీ ఇంకా ఫలితాలు ప్రకటించకపోవడంపై విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమైంది.

ఫలితాల కోసం విద్యార్థుల ఎదురుచూపు

సాధారణంగా పరీక్షలు పూర్తయిన నెల రోజుల్లోనే ఫలితాల ప్రకటనకు అవకాశం ఉంటుంది. కానీ ఈ ఏడాది ఫలితాలు విడదల చేయడం ఆలస్యమైంది. జాప్యం జరిగే కొద్దీ దాని ప్రభావం అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలపై పడనుంది. కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిలైన విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతారు. ఇందులో ఉత్తీర్ణులైతే విద్యా సంవత్సరం వృధా కాకుండా పై చదువులకు వెళ్లవచ్చు. ఈ నెలలో ఎంసెట్‌తో పాటు వివిధ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీటి ఫలితాలను మే చివర్లో లేదా జూన్‌ మొదట్లో ప్రకటించనున్నారు. అనంతరం ఇంజనీరింగ్‌, ఇతర కోర్సుల అడ్మిషన్ల ప్రక్రియ మొదలవుతుంది. అయితే ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించి, వాటి ఫలితాలను త్వరగా వెల్లడిస్తేనే విద్యార్థులు ఇంజనీరింగ్‌, ఇతర కోర్సుల్లో చేరడానికి అవకాశం ఉంటుంది. తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు ఇంప్రూవ్‌మెంట్‌ కోసం కూడా మళ్లీ పరీక్షలు రాస్తారు. దీంతో ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

టెన్త్‌ ఫలితాలు సిద్ధం!

పదో తరగతి ఫలితాలను ప్రకటించడానికి వీలుగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంటర్‌ ఫలితాలు వెల్లడించిన ఒకటి రెండు రోజుల తర్వాత టెన్త్‌ ఫలితాలు ప్రకటించాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఏప్రిల్‌ 3 నుంచి 11వ తేదీ మధ్య టెన్త్‌ పరీక్షలు నిర్వహించారు. ఈ ఏడాది 6 పేపర్లే కావడంతో వాల్యుయేషన్‌ త్వరగా పూర్తి చేశారు.

Updated Date - 2023-05-08T16:40:40+05:30 IST