Telangana New CS: తెలంగాణ కొత్త సీఎస్‌గా శాంతికుమారి.. ఇంతకీ ఈవిడ ఎవరంటే..

ABN , First Publish Date - 2023-01-11T15:14:14+05:30 IST

తెలంగాణ ప్రభుత్వ కొత్త సీఎస్‌గా(Chief Secretary) శాంతికుమారికి (Shanti Kumari IAS) అవకాశం దక్కింది. కాసేపట్లో తెలంగాణ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేయనుంది. శాంతి కుమారి ప్రస్తుతం అటవీ శాఖ బాధ్యతల్లో..

Telangana New CS: తెలంగాణ కొత్త సీఎస్‌గా శాంతికుమారి.. ఇంతకీ ఈవిడ ఎవరంటే..

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ కొత్త సీఎస్‌గా(Chief Secretary) శాంతికుమారికి (Shanti Kumari IAS) అవకాశం దక్కింది. తెలంగాణ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేయడం, ఆవిడ బాధ్యతలు స్వీకరించడం చకచకా జరిగిపోయాయి. శాంతి కుమారి అటవీ శాఖ స్పెషల్ సెక్రటరీగా బాధ్యతల్లో ఉన్నారు. శాంతికుమారి 2025 ఏప్రిల్ వరకూ పదవిలో ఉండేందుకు అవకాశం ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం ఆమె వైపే మొగ్గు చూపింది. గతంలో.. శాంతి కుమారి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కూడా పనిచేశారు. శాంతికుమారి 1989 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. 2025 ఏప్రిల్ వరకూ కొత్త సీఎస్‌గా శాంతికుమారి కొనసాగే అవకాశం ఉంది.

IAS-Shanti-Kumari.jpg

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌కు హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. ఆయన ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌కు వెళ్లాల్సిందేనని మంగళవారం హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఉమ్మడి రాష్ట్రంలోని సివిల్‌ సర్వెంట్ల విభజన వివాదానికి ఈ తీర్పు ద్వారా ముగింపు పలికింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌ విభజన సందర్భంగా తన సీనియారిటీ ప్రకారం తాను ఆప్షన్‌ ఇచ్చిన తెలంగాణకు కాకుండా ఏపీకి కేటాయించడాన్ని సవాల్‌ చేస్తూ సోమేశ్‌ కుమార్‌ 2014లో సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌(క్యాట్‌)ను ఆశ్రయించారు.

aaa.jpg

సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ తెలంగాణలోనే కొనసాగేలా క్యాట్‌ 2016లో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ(డీవోపీటీ) 2017లో హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌, జస్టిస్‌ సూరేపల్లి నందాలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ సుదీర్ఘంగా విచారించింది. పిటిషనర్‌ అయిన కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ టి.సూర్యకరణ్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఐఏఎస్‌ క్యాడర్‌ రూల్స్‌కు విరుద్ధంగా క్యాట్‌ వ్యవహరించిందని, కేంద్ర ప్రభుత్వం చట్ట ప్రకారం నియమించిన ప్రత్యూష్‌ సిన్హా కమిటీ మార్గదర్శకాలకు విరుద్ధంగా సోమేశ్‌ కుమార్‌ను తెలంగాణకు కేటాయించడం చెల్లదని సొలిసిటర్‌ జనరల్‌ అన్నారు.

Telangana-New-CS.jpg

ఇదిలా ఉండగా.. హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే కేంద్ర ప్రభుత్వం శరవేగంగా స్పందించింది. విధుల నుంచి వెంటనే రిలీవ్‌ కావాలంటూ సోమేశ్‌ కుమార్‌ను ఆదేశిస్తూ కేంద్ర శిక్షణ, సిబ్బంది వ్యవహారాల శాఖ(డీఓపీటీ) మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఈ నెల 12 లోపు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని సోమేశ్‌ను ఆదేశించింది

Updated Date - 2023-01-11T16:31:50+05:30 IST