Kadiam Srihari: కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-01-13T18:34:50+05:30 IST

మాజీమంత్రి కడియం శ్రీహరి (Kadiam Srihari) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Kadiam Srihari: కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు

జనగామ: మాజీమంత్రి కడియం శ్రీహరి (Kadiam Srihari) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తప్పు చేసేది లేదని.. ఒకరి ఎదుట తలవంచి బతికేది లేదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. శుక్రవారం జనగామ జిల్లా లింగాలఘణపురం మండల కేంద్రంలో జరిగిన కురుమ సంఘం పాలకవర్గం పదవీ ప్రమాణ స్వీకారోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ మనిషి ఎలాంటి పరిస్థితుల్లో కూడా తప్పు చేయొద్దని ఆ తర్వాత అయ్యా.. అయ్యా అంటూ తలవంచి పాదాభివందనం చేయకూడదని అన్నారు. తన ఇన్నాళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడైనా తప్పు చేసి తల వంచింది ఎవరైనా చూశారా అని సభికులను ప్రశ్నించారు. ప్రతీ ఒక్కరు ఆత్మగౌరవంతోనే బతకాలని సూచించారు. విద్యతో సామాజిక చైతన్యం వస్తుందని తద్వారా అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రతీ ఒక్కరు తన మాదిరిగా నిటారుగా బతకడం నేర్చుకోవాలని కడియం శ్రీహరి సూచించారు.

ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య (Tadikonda Rajaiah)తో కడియంకు వైరం నేపథ్యంలో వ్యాఖ్యలకు ప్రాధాన్యత చోటుచేసుకుంది. గతంలో ఈటల కూడా ఆత్మగౌరవం పేరుతోనే కేసీఆర్తో విభేదించిన విషయాన్ని అందరూ గుర్తుచేసుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా కడియం శ్రీహరి, రాజయ్య మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇద్దరూ మాజీ ఉప ముఖ్యమంత్రులు తమ హోదాను మరిచి ఒకరిపై మరొకరు మాటల యుద్ధాన్ని దిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. వీరిద్దరి మధ్య పోరు తారాస్థాయికి చేరడంతో కేడర్ కూడా రెండు వర్గాలుగా విడిపోయింది. ఒకే పార్టీకి చెందిన ఇరువురు కీలక నేతలు ఇలా కొట్టుకుంటుంటే.. ‘పిట్ట పిట్ట పోరు పిల్లి తీర్చింది’ అన్న సామెత ఇక్కడ అమలవుతుంది. స్టేషన్‌ఘన్‌పూర్‌ (Station Ghanpur)లో రెండు గ్రూపులుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న రాజయ్య, శ్రీహరిలు.. ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకోవడం, ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం పరిపాటిగా మారింది. రోజుకో మారు ఒకరిపై ఒకరు వాగ్భానాలు వదలుకోవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2023-01-13T18:47:46+05:30 IST