Delhi: తెలంగాణ భవన్లో సర్దార్ పాపన్న జయంతి వేడుకలు
ABN , First Publish Date - 2023-08-18T11:03:34+05:30 IST
ఢిల్లీ తెలంగాణ భవన్లో సర్దార్ సర్వాయి పాపన్న 373వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

న్యూఢిల్లీ: ఢిల్లీ తెలంగాణ భవన్లో సర్దార్ సర్వాయి పాపన్న (Sardar Sarvai Papanna) 373వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సర్దార్ పాపన్న చిత్రపటానికి మాజీ మంత్రి పొన్నాల లక్షయ్య (Ponnala Laxmaiah), మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పొన్నాల మాట్లాడుతూ... రాచరికాన్ని ఎదిరించి స్వేచ్చ కోసం 7 గంటల పాటు గోల్కొండను ఆక్రమించి ఉద్యమించిన వ్యక్తి సర్ధార్ సర్వాయి పాపన్న అని అన్నారు. ప్రజలకు స్వేచ్ఛ కోసం, బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన వ్యక్తి పాపన్న అని చెప్పుకొచ్చారు. సర్ధార్ సర్వాయి పాపన్న పుట్టిన గ్రామంలోనే పుట్టానని.. సర్ధార్ సర్వాయి పాపన్న జీవితం తనకు స్ఫూర్తిదాయకమన్నారు. లండన్లో ఉన్న చిత్రపటం ఆధారంగా మొదటి విగ్రహం చేయించినట్లు పొన్నాల లక్ష్మయ్య వెల్లడించారు.
పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. అన్ని కులాల వారిని కలుపుకుని గోల్కొండ కోటను ఆక్రమించిన వ్యక్తి సర్వాయి పాపన్న అని అన్నారు. సర్వాయి పాపన్న ఇచ్చిన దైర్యం స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను కలుపుకును ముందుకువెళ్తుందని.. అందరికి ప్రాధాన్యత కల్పిస్తుందని చెప్పారు. బలహీన వర్గాలకు అసంతృప్తి రాకుండా చూసుకోవాలన్నారు. పార్టీ అధిష్టానం, రాష్ట్ర నాయకత్వం అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలని, తీసుకుంటుందని చెప్పుకొచ్చారు. బడుగు బలహీన వర్గాలకు పార్టీ రక్షణ కల్పిస్తుందన్నారు. కాంగ్రెస్తోనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. ఉదయ్ పూర్ డిక్లరేషన్కు అనుగుణంగా బడుగు బలహీన పార్టీ పదవుల్లో ప్రాధాన్యత ఉంటుందని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.