Minister KTR : దమ్ముంటే లోక్‌సభను రద్దు చేయండి

ABN , First Publish Date - 2023-01-29T02:44:20+05:30 IST

దమ్ముంటే లోక్‌సభను రద్దు చేయాలని మంత్రి కేటీఆర్‌ బీజేపీకి సవాలు చేశారు. లోక్‌సభను రద్దు చేసి వస్తే ముందస్తు ఎన్నికలకు తామూ సిద్ధమేనని ప్రకటించారు. తమకు ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర బీజేపీ నేతలు ఇష్టారీతి..

 Minister KTR : దమ్ముంటే లోక్‌సభను రద్దు చేయండి

ఈ ప్రశ్నకు బదులివ్వండి అదానీ గ్రూపులో ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ పెట్టుబడుల వెనుక ఎవరు?

హిండెన్‌బర్గ్‌ నివేదికపై కేంద్రానికి మంత్రి కేటీఆర్‌ ప్రశ్నలు

ఎన్డీయే కాదు.. ఎన్‌పీఏ ప్రభుత్వమంటూ చురకలు

ముందస్తు ఎన్నికలకు మేం సిద్ధమే

బీజేపీకి మంత్రి కేటీఆర్‌ సవాల్‌

తెలంగాణపై మోదీ సర్కారుకు కక్ష!

ఇప్పటికి ఒక్క రూపాయి ఇవ్వలేదు

బీజేపీ నేతలు ఇష్టారీతిన మాట్లాడితే

ఊరుకోం.. బదులిస్తే భరించలేరు

రాష్ట్రాభివృద్ధి కోసమే అప్పులు: కేటీఆర్‌

నిజామాబాద్‌, జనవరి 28 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): దమ్ముంటే లోక్‌సభను రద్దు చేయాలని మంత్రి కేటీఆర్‌ బీజేపీకి సవాలు చేశారు. లోక్‌సభను రద్దు చేసి వస్తే ముందస్తు ఎన్నికలకు తామూ సిద్ధమేనని ప్రకటించారు. తమకు ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర బీజేపీ నేతలు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని.. తామూ అలాగే మాట్లాడితే తాతలు, తండ్రులు గుర్తుకు వస్తారని హెచ్చరించారు. శనివారం నిజామాబాద్‌లో రూ.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న కళాభారతికి ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే కమాన్‌ వద్ద రోడ్డు అండర్‌ బ్రిడ్జిని ప్రారంభించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్రం పార్లమెంటును రద్దు చేసి వస్తే ముందస్తుకు తామూ సిద్ధమేనన్నారు. ఎన్డీయే సర్కారు దివాలాకోరు ప్రభుత్వమని, తెలంగాణపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని అన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత మోదీ సర్కారు ఒక్క రూపాయి కూడా రాష్ట్రానికి ఇవ్వలేదని.. కొత్తగా జాతీయస్థాయి సంస్థలనూ మంజూరు చేయలేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని ఏ ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఇవ్వలేదన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదని విమర్శించారు. ఎనిమిదేళ్లలో రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో కేంద్రానికి రూ.3.68 లక్షల కోట్లను ఇస్త్తే.. రాష్ట్రానికి కేవలం రూ.1.68 లక్షల కోట్లు మాత్రమే వచ్చాయని చెప్పారు. రాష్ట్రం నుంచి వసూలైన పన్నుల్లో రూ.2 లక్షల కోట్లను ఇతర రాష్ట్రాలకు వాడేశారని దుయ్యబట్టారు. కేంద్రం తీరు ‘సొమ్మొకడిది.. సోకొకడిది’లాగా ఉందన్నారు. ఇందులో ఏ ఒక్కటి అబద్ధమైనా తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని బీజేపీ నాయకులకు కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. దేశంలో అభివృద్ధి జరిగిన 20 గ్రామాలను ఎంపిక చేస్తే.. అందులో 19 తెలంగాణ గ్రామాలే ఉన్నాయన్నారు. ఢిల్లీలో రాష్ట్రానికి అవార్డులు ఇస్తే గల్లీలోని బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్ర అభివృద్ధి కోసమే అప్పులు

సీఎం కేసీఆర్‌ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని విమర్శలు చేస్తున్నారని.. రాష్ట్ర అభివృద్ధి కోసమే ఆ నిధులు ఖర్చు చేశామని కేటీఆర్‌ స్పష్టం చేశారు. అప్పులు తెచ్చిన నిధులతోనే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించామన్నారు. మహారాష్ట్ర వల్ల ఎండిపోతున్న ఎస్సారెస్పీకి పునరుజ్జీవం కల్పించామన్నారు. మిషన్‌ భగీరథకు నిదులు వెచ్చించి ఇంటింటికీ తాగునీటి సౌకర్యం కల్పించామని చెప్పారు. ఈ 8 ఏళ్ల పాలనలో ప్రధాని మోదీ వంద లక్షల కోట్ల అప్పు చేశారని కేటీఆర్‌ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చిన అప్పు ప్రజల బంగారు భవిష్యత్‌ కోసమే పెట్టుబడి పెట్టామని స్పష్టం చేశారు. మోదీ మాత్రం కార్పొరేట్‌ శక్తులకు మాత్రమే ఉపయోగపడే విధంగా పనిచేస్తున్నారని ఆరోపించారు.

ప్రధాని మోదీ ఎవరికి దేవుడు!?

ప్రధాని మోదీ దేవుడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌ సహా ఆ పార్టీ నేతలు అంటున్నారని, మోదీ ఎవరికి దేవుడని కేటీఆర్‌ ప్రశ్నించారు. పెట్రోల్‌, గ్యాస్‌ ధరలు పెంచినందుకా? చేనేతపై జీఎస్టీ వేసినందుకా? రైతులను దెబ్బతిసే నల్లచట్టాలను తెచ్చినందుకు మోదీ దేవుడా? అని కేటీఆర్‌ నిలదీశారు. బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి ఇప్పటివరకు ఏవైనా నిధులను తీసుకొచ్చారా? అని ప్రశ్నించారు. కేంద్రం ఏ ఒక్క పని చేయడం లేదని.. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనులకూ సహకరించడం లేదని ఆరోపించారు. ఇతర రాష్ట్రాలకు ఐఐఎంలు, ట్రిపుల్‌ఐటీలు, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌, ఇతర జాతీయస్థాయి విద్యాసంస్థలను మంజూరు చేసినా.. రాష్ట్రానికి ఒక్కటీ ఇవ్వలేదని చెప్పారు. రాష్ట్రానికి ఏం ఇవ్వడం లేదంటే.. కొంతమంది బీజేపీ నేతలు నేషనల్‌ హైవేలను ఇస్తున్నట్లు చెబుతున్నారని, ప్రజల డబ్బుతోనే వాటిని నిర్మిస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని మంత్రి అన్నారు.

ఇకపై ఊరుకునేది లేదు..

కేంద్రం ఇచ్చే నిధుల, పథకాల పేర్లు మార్చి, రాష్ట్ర ప్రభుత్వం సొంత పథకాల్లాగా అమలు చేస్తున్నారంటూ బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారని.. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే ఇకపై ఊరుకునేది లేదని కేటీఆర్‌ హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉన్నాయా!? అని ప్రశ్నించారు. దేశమంతా రైతులకు ఉచిత విద్యుత్‌ ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ డిమాండ్‌ చేస్తుంటే.. ఉచితాలు వద్దని మోదీ అంటున్నారని విమర్శించారు. దేశం మొత్తం రైతులకు ఉచిత కరెంటు ఇస్తే ఏడాదికి రూ.1.45 లక్షల కోట్లు ఖర్చు ఖర్చు అవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలకు ఇచ్చిన దాంతో పోలిస్తే ఇది చాలా తక్కువని చెప్పారు. రాష్ట్రంలో ఇస్తున్న రైతుబంధు మాదిరిగానే దేశమంతా రైతులకు ఎకరాకు రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. నిజామాబాద్‌ జిల్లాకు పసుపు బోర్డు ఇవ్వాలన్నారు. నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ పరిధికి మించి వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్నారన్నారు. ఆయన తండ్రి డీఎస్‌ అంటే తమకు గౌరవమని, పెద్దాయన కొడుకు అనే ఆగుతున్నామని చెప్పారు. ఎంపీకి దమ్ముంటే ప్రత్యేకంగా నిధులు తెచ్చి నిజామాబాద్‌ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. రైతుల జీవితాల్లో కేసీఆర్‌ ప్రభుత్వం వెలుగులు నింపుతోందని.. కొత్త తరం కూడా వ్యవసాయ రంగంలోకి రావాలని మంత్రి పిలుపునిచ్చారు. కాకతీయ శాండ్‌బాక్స్‌ ఆధ్వర్యంలో నిజామాబాద్‌ శివారులో నిర్వహించిన రైతులతో ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. కరోనా సమయంలో దేశంలోని ప్రజలంతా తల్లడిల్లుతుంటే.. రైతులకు ఇబ్బంది కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం ఊరూరా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. రైతుల కోసం 5 వేల క్లస్టర్లను ఏర్పాటు చేశామని.. వీటి ద్వారా రైతులకు అధునాతన పంటలపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.

Updated Date - 2023-01-29T02:44:21+05:30 IST