KTR: ఎలక్షన్‌ టూరిస్టులను నమ్మొద్దు.. మేం ఎవరికీ ‘బీ’ టీమ్‌ కాదు..

ABN , First Publish Date - 2023-10-07T14:47:24+05:30 IST

పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందంగా కాంగ్రెస్‌ నాయకులు వస్తున్నారని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి

KTR: ఎలక్షన్‌ టూరిస్టులను నమ్మొద్దు.. మేం ఎవరికీ ‘బీ’ టీమ్‌ కాదు..

- 60 ఏండ్ల పాలనలో కాంగ్రెస్‌ చేసినవన్ని మోసాలే...

- బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌

వరంగల్‌ సిటీ: పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందంగా కాంగ్రెస్‌ నాయకులు వస్తున్నారని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (Minister Kalvakuntla Taraka Rama Rao) ఎద్దేవా చేశారు. వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ ఆధ్వర్యంలో ఖిలావరంగల్‌ వాకింగ్‌ గ్రౌండ్‌లో శుక్రవారం సంక్షేమ సమావేశ బహిరంగ సభ జరిగింది. ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన కేటీఆర్‌ మాట్లాడుతూ... 60 ఏళ్ల అవకాశమిస్తే ఏమి చేయని వారు, ఇప్పుడు మేం అది చేస్తాం... ఇది చేస్తామని మరోసారి మోసానికి తెరలేపుతున్నారని విమర్శించారు. 60ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌ ప్రజలను మోసం చేసిందని, కాంగ్రెస్‌ మాయ మాటలు నమ్మకుండా.. మోసం చేసిన కాంగ్రెస్‏ను మోసం చేసి ఓడించాలన్నారు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని నమ్మి మోసపోవద్దన్నారు. 50 ఏళ్ల పాలనలో రైతులకు కాంగ్రెస్‌ ఏం చేసిందో చెప్పాలన్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పాలనలో 70 లక్షల మందికి రూ.73వేల కోట్ల రైతుబంధు వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. వానాకాలం, ఎండాకాలం సాగుకాలం ఆరంభంలో ప్రతీ రైలు సెల్‌ఫోన్‌లో టింగ్‌ టింగుమంటూ రైతు బంధు వారి ఖాతాల్లో జమవుతోందన్నారు. రూ.43వేల కోట్లతో ఇంటింటికి తాగునీరందంచిన కేసీఆర్‌నే ప్రజలు నమ్మాలని కోరారు. బీఆర్‌ఎస్‌ ఎవ్వరికీ ‘బీ’ కాదని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల ‘ఏ’ టీంగా అభివర్ణించారు. ఎన్నికల సమయంలో అనేక మంది వచ్చి పోతుంటారని ఎవ్వరిని నమ్మవద్దని కేటీఆర్‌ ప్రజలను కోరారు. ఇప్పటి వరకు తమకు అన్ని ఇచ్చింది కేసీఆరే అని ఇంకా ఇచ్చేది కేసీఆరే అని చెప్పండని ప్రజలను ఆయన కోరారు. పదేళ్లలో కేసీఆర్‌ అన్నీ ఇచ్చారని, ఇంకా ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారన్నారు. రాష్ట్రంలోని ప్రజలు మరికొద్ది రోజుల్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ నోట శుభవార్త వింటారని వెల్లడించారు. అల్లాటప్పా నాయకులు వచ్చి అన్నీ చేస్తామని మరోసారి మోసం చేసే ప్రమాదముందని, ప్రజలు వారిని నమ్మి మోసపోవద్దని ప్రజలను కేటీఆర్‌ కోరారు. వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బరిలో నిలిచేది.. మరోసారి గెలిచేది నన్నపునేని నరేందరేనని ఎలక్షన్‌ టూరిస్టులు వస్తుంటారని, నరేందర్‌ నిత్యం స్థానికంగా ఉంటూ ప్రజా సంక్షేమం కోసమే పాటుపడుతాడని, మరోసారి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.

ktr1.jpg

లబ్ధిదారుల నిరాశ

కేటీఆర్‌ చేతుల మీదుగా సంక్షేమ పథకాలు అందుకుంటామని భారీగా లబ్ధిదారులు బహిరంగ సభకు చేరుకున్నారు. అయితే 20 నిమిషాల కేటీఆర్‌ ప్రసంగం అనంతరం బహిరంగ సభ ముగిసింది. ఎవరికీ పథకాలు అందించకుండానే కేటీఆర్‌ వెళ్లిపోయారు. కనీసం స్థానిక మంత్రులు, ఎమ్మెల్యే చేతుల మీదుగానైనా అందిస్తారేమోనని లబ్ధిదారులు ఎదురు చూశారు. మంత్రులు, నాయకులందరూ సభా స్థలి నుంచి వెళ్లిపోవడంతో లబ్ధిదారులు ఉసూరుమంటూ నిరాశతో వెనుదిరిగి వెళ్లారు.

Updated Date - 2023-10-07T14:48:45+05:30 IST