RamaNavami: సీతమ్మను మనువాడిన రామయ్య.. భద్రాద్రిలో వైభవంగా కళ్యాణోత్సవ వేడుక

ABN , First Publish Date - 2023-03-30T12:32:26+05:30 IST

భద్రాచలంలో శ్రీసీతారాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణం జరిగింది.

RamaNavami: సీతమ్మను మనువాడిన రామయ్య.. భద్రాద్రిలో వైభవంగా కళ్యాణోత్సవ వేడుక

భద్రాచలం: భద్రాచలంలో శ్రీసీతారాముల కళ్యాణోత్సవం (Sri Sritaramula Kalyanotsavam) అంగరంగ వైభవంగా జరిగింది. అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణం జరిగింది. మిథులా స్టేడియం (Mithula Stadium)లోని మండపంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈరోజు ఉదయం శ్రీసీతారాములు కళ్యాణమండపానికి ఊరేగింపుగా చేరుకున్నారు. ఉదయం 10:30 గంటలకు కళ్యాణోత్సవం ప్రారంభం అవగా.. అభిజిత్ లగ్నంలో సీతారామయ్యలకు రుత్వికులు జీలకర్ర బెల్లం పెట్టారు. ఆపై సీతమ్మ మెడలో రామయ్య మాంగళ్యధారణ చేశారు. తరువాత తలంబ్రాల కార్యక్రమం జరిగింది. అనంతరం జరిగే కార్యక్రమాలను అర్చకులు సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. ఈ వేడుకల్లో భాగంగా స్వామిఅమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి (Minister Indrakarreddy) పట్టువస్త్రాలను సమర్పించారు. సీతారాముల కళ్యాణోత్సవం ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో సాగింది. ప్రతీ ఏడాది కంటే ఈసారి భిన్నంగా శ్రీరామ నవమి వేడుకలు జరిగాయి. మిథులా స్టేడియానికి సువర్ణ ద్వాదశ వాహనాలపై స్వామిఅమ్మవార్లు ఊరేగింపుగా వచ్చారు. కళ్యాణాన్ని కనులారా వీక్షించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రామనామస్మరణతో మిథులా స్టేడియం మారుమ్రోగుతోంది.

bhadrachalam-kalyanam-1.jpg

కళ్యాణోత్సవం సందర్భంగా మిథులా స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఈ వేడుక కోసం ఆలయాన్ని అందంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణం మొత్తం విద్యుత్ దీపాలతో కళకళలాడుతోంది. ఈ కళ్యాణోత్సవానికి చినజీయర్ స్వామి ఎంపీలు రవిచంద్ర, కవిత, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం తదితరులు హాజరయ్యారు.

bhadrachalam-kalyanam-2.jpg

కాగా.. భ్రదాచలం ఆలయంలో బుధవారం రాత్రి ఎదుర్కోలు ఉత్సవం సంప్రదాయబద్ధంగా సాగింది. కల్యాణ వేడుక సందర్భంగా భక్తుల సౌకర్యం కోసం మిథిలా స్టేడియంలో 2.40 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో పందిళ్లు ఏర్పాటు చేశారు. 35 ఎల్‌ఈడీలు, 70 కూలర్లు, 250 ఫ్యాన్లు, 50 టన్నుల ఏసీ సౌకర్యం, 32సీసీ కెమెరాలు, లడ్డూ కౌంటర్లు 19, తలంబ్రాల పంపిణీ కోసం 70 కేంద్రాలను ఏర్పాటు చేశారు. భక్తుల కోసం రెండు లక్షల లడ్డూలను దేవస్థానం అధికారులు సిద్ధం చేశారు. శుక్రవారం నిర్వహించనున్న శ్రీరామ సామ్రాజ్య పుష్కర పట్టాభిషేకానికి గవర్నర్‌ తమిళిసై హాజరుకానున్నట్లు సమాచారం. అలాగే అహోబిల జీయర్‌స్వామి, దేవనాద జీయర్‌స్వామి కూడా పట్టాభిషేకానికి హాజరుకానున్నారు.

Updated Date - 2023-03-30T12:51:27+05:30 IST