Ponguleti: నిరుద్యోగ భృతి హామీ ఎందుకు అమలు చేయడం లేదు?..
ABN , First Publish Date - 2023-02-06T16:25:39+05:30 IST
భద్రాద్రి కొత్తగూడెం: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy), కేసీఅర్ ప్రభుత్వం (KCR Govt.)పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
భద్రాద్రి కొత్తగూడెం: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy), కేసీఅర్ ప్రభుత్వం (KCR Govt.)పై తీవ్ర విమర్శలు గుప్పించారు. సోమవారం అశ్వరావుపేట నియోజకవర్గం ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణ (Bangaru Telangana)లో పోడు రైతులకు పట్టాలు పంపిణీ ఎప్పుడు జరుగుతాయని ప్రశ్నించారు. తెలంగాణలో బతుకులు బాగు పడతాయని నాడు ఉద్యమంలో పాల్గొన్న వారి ఆకాంక్షలు ఇంతవరకు నేరవేరలేదని విమర్శించారు. డబుల్ బెడ్ రూం (Double Bedroom) ఇళ్ళు కలగానే మారాయన్నారు. నిరుద్యోగ భృతి హామీ ఇంతవరకు ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. పంచాయితీలకు పెండింగ్ బిల్లులే మంజూరు చేయలేదు గానీ.. ప్రతి పంచాయితీకి రూ. 10 లక్షలు మంజూరు చేస్తామన్న సీఎం కేసీఅర్ (CM KCR) హామీ హాస్యాస్పదంగా ఉందని పొంగులేటి అన్నారు.
కాగా తన రాజకీయ భవిష్యత్పై ఈరోజు క్లారిటీ ఇస్తానని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. అయితే పార్టీ మారే నిర్ణయంపై నాన్చివేత ధోరణి ప్రదర్శించారు. ఈ ఆత్మీయ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంటారని అన్నారు... కానీ ప్రకటన చేయలేదు. ప్రజాభిప్రాయం ప్రకారమే పార్టీ మారే నిర్ణయం తీసుకుంటామన్నారు. అశ్వరావుపేట అభ్యర్థిగా జారే ఆదినారాయణ (Adinarayana)ను పొంగులేటి ప్రకటించారు. తాను ఏ పార్టీలో ఉన్నా తన వర్గీయులకు టికెట్ ఇచ్చే దమ్ముంది కాబట్టే అభ్యర్థులను ప్రకటిస్తున్నానన్నారు. ముఖ్యమంత్రులు అంటే ఎన్టీఆర్ (NTR), వైఎస్ఆర్ (YSR) మాదిరి ప్రజల గుండెల్లో ఉండాలంటూ పరోక్షంగా సీఎం కేసీఅర్పై పొంగులేటి శ్రీనివాసరెడ్డి సెటైర్లు (Satyrs) వేశారు.