KCR: తెలంగాణ భవన్‌లో సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-05-01T22:14:33+05:30 IST

మహారాష్ట్రలో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని కేసీఆర్ స్పష్టం చేశారు.

KCR: తెలంగాణ భవన్‌లో సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు
KCR

హైదరాబాద్: మహారాష్ట్రకు (Maharashtra) చెందిన పలువురు ముఖ్యనేతలతో బీఆర్ఎస్ (BRS) అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(KCR) తెలంగాణ భవన్‌లో సమావేశమయ్యారు. బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచి అన్నా హజారే దాకా గొప్ప చైతన్యాన్ని ఈ దేశానికి అందించిన మహారాష్ట్ర నుంచి తాను చాలా నేర్చుకున్నానని, కానీ నేడు మహారాష్ట్రకు తానే నేర్పుతున్నానని చెప్పారు. నాడు తలఎత్తుకుని చూసిన మహారాష్ట్రను ఇటువంటి పరిస్థితుల్లో చూడాల్సి రావడానికి ఇన్నాళ్లుగా అక్కడి ప్రభుత్వాలు అనుసరించిన బాద్యతారాహిత్య నిర్లక్ష్యపూరిత ధోరణులే కారణమని సీఎం అన్నారు. మహారాష్ట్రలో పార్టీ నిర్మాణం, బలోపేతంపై నేతలతో కేసీఆర్ చర్చించారు. పార్టీకి అనుబంధంగా పలు కమిటీల నిర్మాణంతో పాటు 288 నియోజకవర్గాల పరిథిలోని గ్రామాలు, రాష్ట్రవ్యాప్తంగా తాలూకాలు జిల్లాల వారీగా బీఆర్ఎస్ శాఖలను ఏర్పాటు చేసి పార్టీని నిర్మాణాత్మకంగా మరాఠా ప్రజల్లోకి తీసుకుపోయే దిశగా కార్యాచరణపై మహారాష్ట్ర నుంచి వచ్చిన ముఖ్యనేతలతో అధినేత సీఎం కేసీఆర్ చర్చించారు. ఇప్పటికే.. మహారాష్ట్రలో బిఆర్ఎస్ పార్టీ అక్కడి ప్రజల ఆదరాభిమానాలను రోజు రోజుకూ చూరగొంటోందని, తెలంగాణ ప్రగతి మోడల్ వారిని అమితంగా ఆకట్టుకుంటున్నదన్నారు. నాడు తెలంగాణ ఉద్యమ సమయం మాదిరి నేడు మహారాష్ట్రలో ప్రజా స్పందన స్పష్టంగా కనిపిస్తున్నదని చెప్పారు. ఇప్పుడు.. మహారాష్ట్రలో బీఆర్ఎస్ గాలి వీస్తున్నదన్నారు.

మహారాష్ట్రలో మొదటి దశలో నాలుగు ముఖ్యపట్టణాలైన నాగపూర్, ఔరంగాబాద్, పూనే, ముంబైలో పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. మహారాష్ట్రలో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మహారాష్ట్రకు చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి అధినేత పార్టీలోకి ఆహ్వానించారు.

కేసీఆర్ ఇంకా ఏం మాట్లాడారంటే!

* మహారాష్ట్రలో బీఆర్ఎస్‌కు విశేష ఆదరణ వస్తుంది. మహారాష్ట్ర నలుమూలల నుంచి ఎంతోమంది బీఆర్ఎస్ విధానాలకు ఆకర్షితులు అవుతున్నారు.

* తెలంగాణ కంటే మహారాష్ట్ర వైశాల్యంలో, జనసంఖ్యలో ఆర్థిక వనరులు ఇలా అన్ని రంగాల్లో అనేక రెట్లు పెద్దది. కానీ మహారాష్ట్ర ఎందుకు అన్ని రంగాల్లో వెనుకబడిందో ఆలోచించాలి.

* విశ్వమానవుడైన బీఆర్ అంబేద్కర్ మనకు స్ఫూర్తిదాత. 125 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని తెలంగాణలో ఏర్పాటు చేసుకున్నాం. దీని వెనుక మహత్తర సత్యం దాగి ఉన్నది. అంబేద్కర్ ఆశించిన సమాజాన్ని నెలకొల్పటమే బీఆర్ఎస్ లక్ష్యమని ఊరూరా చెప్పండి.

* బాబాసాహెబ్ 125 అడుగుల విగ్రహాన్ని పెట్టి షో చేయాలని మేము చేయలేదు. ఆ సమతామూర్తి సిద్ధాంతాన్ని ఆచరించటమే కర్తవ్యంగా లక్ష్యాన్ని ఏర్పరుచుకున్నాం. అందుకోసం నిరంతరం పనిచేస్తున్నాం. అంబేద్కర్ కలలను సాకారం చేయటమే బీఆర్ఎస్ లక్ష్యమని అందరూ గుర్తుంచుకోవాలి.

* ప్రపంచంలో ఏదేశానికి లేని మానవ వనరుల సంపద భారతదేశానికి ఉన్నది. ఈ సంపత్తిని వినిగించుకునే జ్ఞానం పాలకులకు లేకుండా పోయింది. అదే అసలైన దురదృష్టకరం.

* కుటుంబ నియంత్రణ విధానాలు, అశాస్త్రీయ ఆలోచనలు అమలు చేయటం వల్ల చైనాలో ఇవ్వాళ 60 శాతం మంది వృద్ధులుగా మారిపోయారు. అలాగే జపాన్ జనాభా తగ్గిపోయింది. ఆయా దేశాల్లో జనాభావృద్ధి కోసం లక్షలాది రూపాయల నజరానాను ప్రకటిస్తున్నారు. కానీ, భారత్ అలా కాదు. అద్భుతమైన మానవ సంపద ఉన్నది. దాన్ని సరియైన పద్ధతిలో వినియోగించుకుంటే దేశం అమెరికా, యూరప్ దేశాలను మించిపోతుంది.

* దేశంలో 20 శాతం ఉన్న దళితులను, సమాజంలో 50 శాతం ఉన్న స్త్రీలను అభివృద్ధిలో భాగస్వామ్యం చేయనంత వరకు ఈ దేశం ముందుకు సాగదు. దురదృష్టవశాత్తు 70 శాతం మంది ఇవ్వాళ అభివృద్ధికి దూరంగా ఉన్నారు. అందువల్లే దేశం ఇవ్వాళ ఈ దుస్థితిలో ఉన్నది.

* దళితులు అత్యంత పేదరికంలో మగ్గుతున్నారు. 20 శాతం మంది దళితుల్లో వజ్రాల్లాంటివారున్నారు. వారిని ఉపయోగిస్తే దేశంలో అద్భుతాలు సృష్టిస్తారు. వారిని ఉపయోగించటంలేదు. అలాగే స్త్రీలను వంటింకే పరిమితం చేశాం. ఇది సరైన విధానం కాదు. స్త్రీలకు అవకాశం కల్పిస్తే సమాజం తన గతిని మార్చుకుంటుంది. రష్యాలో 95 శాతం మంది పైలట్లు మహిళలే ఉన్నారు. ప్రపంచంలో 70శాతం దేశాలు మహిళలను అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తున్నాయి. దురదృష్టవశాత్తు మనం మాత్రం స్త్రీలను వంటింటికే పరిమితం చేస్తున్నాం.

* దళితులు, స్త్రీలు అభివృద్ధిలో భాగస్వామ్యం కానంతర వరకు దేశం ముందుకు సాగదు.

* నేను ఎంపీగా ఉన్న సమయంలో అమెరికా అధ్యక్షుడిగా బరాక్ భారతపార్లమెంట్లో ప్రసంగించారు. ‘మహాత్మాగాంధీ, బీఆర్ అంబేద్కర్’ లేకపోతే బరాక్ ఒబామా అనే వ్యక్తి అమెరికా దేశానికి అధ్యక్షుడిని అయ్యేవాడిని కాదు అని తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. అదీ భారత్ తాకత్. కానీ, మన పాలకులు వారిని విస్మరించారు.

* దేశంలో పాలకుల నిర్లక్ష్యం, చిత్తశుద్ధిలేమి, అవగాహనా రాహిత్యం వల్ల ఉత్పాదక రంగాన్ని.. అనుత్పాదక రంగంగా మార్చుకోవాల్సి వచ్చింది. ఈ దురవస్థ నుంచి దేశాన్ని బాగుచేసుకోవాలి.

* 1987లో నేను ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత అన్నాహజారే ఆలోచనలు, ఆచరణ తెలుసుకునేందుకు రాలేగాంసిద్దికి వెళ్లిన. నీటి నిల్వ, నీటి వనరుల వినియోగం వంటి అనేక అంశాలను తెలుసుకున్నా. మహిళా చైతన్యం, అభివృద్ధిలో భాగస్వామ్యం చూసి ఎంతో నేర్చుకున్న. తెలియంది తెలుసుకోవటం తప్పుకాదు. అవకావాలుండీ తెలసుకోకపోవడమే అజ్ఞానం. మహారాష్ట్రలో ‘మొహందారి-వన్ధరి’లో అప్పుడే నేను వైకుంఠదామాలను చూసిన. ‘ఒకప్పుడు మహారాష్ట్ర నుంచి నేర్చుకున్న నేను అదే మహారాష్ట్రకు చెప్పాల్సి వస్తున్నది.

* అంకాపూర్ (ఆర్మూర్ నియోజకర్గంలో) దేశానికి మాడల్గా నిలిచింది. వీడీసీ (విలేజ్ డెవలప్మెంట్ కమిటీలు) అన్నిటికన్నా పవర్ఫుల్. సర్పంచ్ అయినా.. ఎమ్మెల్యే అయినా ఎవరైనా సరే వీడీసీ చెప్పినట్టే వినాలి.

* రాజకీయాల కోసమే బీఆర్ఎస్ పుట్టలేదు. దేశ ప్రజల జీవన స్థితిగతులు మార్చటమే బీఆర్ఎస్ లక్ష్యం.

* నాయకులుగా ఎవరూ పుట్టరు. తయారు చేయబడతారు. ఇప్పుడు మహారాష్ట్ర రాతను మార్చేందుకు కొత్తరక్తం రాజకీయాల్లోకి వస్తుంది. వారిని ఆహ్వానిద్దాం.

* రాజకీయాల్లో కొత్తపార్టీ పుట్టినప్పుడు అందరూ వింతగానే చూస్తారు. కానీ, ఆ పార్టీ సిద్ధాంతం, చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధిని చూశాక మెల్లమెల్లగా ప్రజలు ఆ పార్టీ పట్ల ఆసక్తిని పెంచుకుంటారు. అభిమానంతో ఆదరిస్తారు. మహారాష్ట్రలోనూ ఇప్పుడు అదే జరుగుతున్నది. లేదంటే మనం పెట్టిన సభలకు వేలు, లక్షలుగా ప్రజలు రారు.

* మనలో మనకు నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం నిజాయితీతో కూడినదై ఉండాలి. అప్పుడే ప్రజలు విశ్వసిస్తారు.

* మహారాష్ట్ర దుస్థితిని మార్చేందుకు యువశక్తి, నవరక్తం రాజకీయాల్లో వచ్చేందుకు ఉత్సాహం చూపుతున్నారు.

* తెలంగాణ మాడల్ను మహారాష్ట్రలో నూటికి నూరుపాళ్లు అమలు చేసి తీరుతాం. అందులో ఎవరికీ అనుమానం అక్కరలేదు.

* మహారాష్ట్రలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రైతుబంధు, దళితబంధు సహా తెలంగాణలో అమలు అవుతున్న పథకాలు అమలు చేస్తాం.

* తెలంగాణలో సాధ్యమైనప్పుడు మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కాదు?

* తలసరి ఆదాయంలో, తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలో తెలంగాణ నెంబర్ 1.

* రాష్ట్రాన్ని సాధించిన అతి తక్కువ కాలంలోనే తెలంగాణ దేశానికి దిక్సూచీగా నిలిచింది.

* దేశంలో ఏ ప్రధానమంత్రిహయాంలో చేయని అప్పులు మోదీ హయాంలో అయ్యాయి. 13 మంది ప్రధానులు రూ. 56లక్షల కోట్లు అప్పు చేస్తే ఒక్కమోదీ మాత్రమే లక్ష కోట్ల అప్పు చేశారు.

* నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువుల ధరలు, గ్యాస్ ధర ఇలా అన్ని రంగాల్లో దేశం దివాళా తీసింది.

* మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మే 5 నుంచి జూన్ 5 వరకు పార్టీ విస్తరణకు కార్యచరణ చేపట్టాలి.

* గ్రామ గ్రామాన పార్టీ కమిటీలు వేయాలి. వీటితోపాటు రైతు, విద్యార్థి, యువజన, మహిళా, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఇలా 9 కమిటీలు వేయాలి.

* ఈ కమిటీల ద్వారా తెలంగాణ మోడల్‌ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి.

* రోజుకు కనీసం 5 గ్రామాల చొప్పున తిరగాలి. ఈ సమయంలో రైతుబంధు, రైతుబీమా, దళితబంధు పథకాలను కచ్చితంగా అమలు చేస్తామని వివరించారు.

* పార్టీ ప్రచార సామాగ్రి సిద్ధం అవుతుంది. మరాఠీ భాషలో పాటలు సిద్ధం అయ్యాయి.

* బీఆర్ఎస్ మహారాష్ట్రలో ప్రభజంనం సృష్టించబోతున్నది. అందులో ఎవరికీ అనుమానం అక్కరలేదు.

* మహారాష్ట్రలో అతినీతి రహిత, నీతివంతమైన పాలన అందించటమే బీఆర్ఎస్ లక్ష్యం.

* ఈ దేశంలో ప్రజాప్రతినిధులకు నియోజకవర్గాల్లో ప్రభుత్వ నిధులతో ఆఫీసులు కట్టించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది.

Updated Date - 2023-05-01T22:16:10+05:30 IST