CM KCR: గిరిపుత్రులకు కూడా దళిత బంధులాగానే..!
ABN , First Publish Date - 2023-02-10T11:57:35+05:30 IST
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ..‘‘పోడు భూములపై
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ..‘‘పోడు భూములపై మాకు స్పష్టత ఉంది. సాగు చేసుకునేందుకు భూములను గిరిజనులకు ఇస్తాం. అడవులను నరికివేయడం సరైనదేనా?..పోడు భూముల వివాదానికి ముగింపు పలకాలా? వద్దా? మన కళ్ల ముందే అడవులు నాశనమైపోతున్నాయి. రాష్ట్రంలో అటవీ సంపద ఉండాలా? వద్దా? అనేదే ఇప్పుడు సమస్య’’గా మారిందని కేసీఆర్ అన్నారు.
అయితే..’’పోడు, అటవీ భూముల విషయంలో ఇప్పుడు లెక్కలు తేలాలి. మొక్కలు నాటడానికి ఎంతో కష్టపడ్డాం. అందుకు ఇప్పుడు ఇది జఠిలమైన సమస్యగా మారింది. గిరిజనుల హక్కులను కచ్చితంగా కాపాడాల్సిందే. సర్వే కూడా పూర్తి చేసి అంతా సిద్ధం చేసి పెట్టాం. పోడు భూముల పంపిణీ తర్వాత ఎవరికైనా భూములు రాకపోతే..వారికి గిరిజన బంధు ఇస్తాం. పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులకు.. వాటిని ఇవ్వడానికి మాకేం అభ్యంతరం’’ లేదన్నారు.
కాగా,..‘‘66 లక్షల ఎకరాల అటవీ భూముల్లో..11.5 లక్షల ఎకరాల పోడు భూములు ఉన్నాయి. ఇకపై అడవులు నరికివేత ఉండదని అంతా ఒప్పుకున్నాకే..11.5 ఎకరాల పోడు భూములు పంపిణీ ఉంటుంది. పోడు భూములకు కరెంట్, రైతుబంధు ఇస్తాం. ఈ నెలాఖరులో పోడు భూముల పంపిణీ ప్రారంభిస్తాం. అడవులను కాపాడే బాధ్యత గిరిజన బిడ్డలే తీసుకోవాలి. ఎవరైనా మన బిడ్డలే.. అందరికీ న్యాయం చేస్తాం. పోడు భూముల సమస్యపై అఖిలపక్షం ఏర్పాటు చేస్తాం. ఫిబ్రవరి నుంచి పోడు భూముల పట్టాలు పంపిణీ’’ ఉంటుందని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తెలిపారు.