TS News: నడిరోడ్డుపై కారు ఆపిన డ్రైవర్.. ఒక్కసారిగా డోర్ తెరవడంతో రెండేళ్ల చిన్నారి...
ABN , First Publish Date - 2023-06-02T13:35:05+05:30 IST
నగరంలోని ఎల్బీనగర్లో విషాదం చోటు చేసుకుంది. కారు డ్రైవర్ల నిర్లక్ష్యానికి రెండు సంవత్సరాల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్లో విషాదం చోటు చేసుకుంది. కారు డ్రైవర్ల నిర్లక్ష్యానికి రెండు సంవత్సరాల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఎల్బీనగర్లో ఓ కారు డ్రైవర్ నడిరోడ్డుపై కారును ఆపాడు. అంతేకాకుండా ముందు వెనకా చూసుకోకుండా నిర్లక్ష్యంగా కారు డోర్ను తెరిచాడు. అయితే ఇదే సమయంలో వెనుక నుంచి దంపతులు తమ చిన్నారితో కలిసి బైక్పై వస్తున్నారు. ఒక్కసారిగా కార్ డోర్ తెరుచుకోవడంతో వెనక నుంచి వస్తున్న బైక్కు తగిలి దంపతులు, చిన్నారి కిందపడిపోయారు. దీంతో రోడ్డుపై ఉన్న రాయి బలంగా తగలడంతో చిన్నారి ధనలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా.. తల్లి శశిరేఖ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరు మన్సురాబాద్ నుంచి ఎల్బీనగర్ వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిన్నారి మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.