TS News: గవర్నర్‌ తమిళిసైతో కేసీఆర్ ప్రత్యేక భేటీ.. ఏం చర్చించారంటే..!

ABN , First Publish Date - 2023-08-24T17:08:46+05:30 IST

చాలా రోజుల తర్వాత తెలంగాణ రాజ్‌భవన్‌ మంత్రులు, అధికారులతో కళకళలాడింది. ఇందుకు పట్నం మహేందర్‌రెడ్డి ప్రమాణస్వీకార కార్యక్రమం వేదికైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

TS News: గవర్నర్‌ తమిళిసైతో కేసీఆర్ ప్రత్యేక భేటీ.. ఏం చర్చించారంటే..!

హైదరాబాద్: చాలా రోజుల తర్వాత తెలంగాణ రాజ్‌భవన్‌ (Telangana Raj Bhavan) మంత్రులు, అధికారులతో కళకళలాడింది. ఇందుకు పట్నం మహేందర్‌రెడ్డి ప్రమాణస్వీకార కార్యక్రమం వేదికైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు. దీంతో రాజ్‌భవన్‌లో సందడి వాతావరణం నెలకొంది. చాలా రోజులుగా గవర్నర్ తమిళిసైతో (Governor Tamilisai Soundararajan) ప్రభుత్వ పెద్దలకు సత్సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్రభుత్వం పంపించిన బిల్లులను గవర్నర్‌ పెండింగ్‌లో పెట్టారు. దీంతో ప్రభుత్వ పెద్దలు.. గవర్నర్‌ మీద గుర్రుగా ఉన్నారు. ఇటీవల ఆగస్టు 15న రాజ్‌భవన్‌లో జరిగిన ‘‘ఎట్ హోం’’ కార్యక్రమానికి కూడా ప్రభుత్వం నుంచి ఎవరూ హాజరుకాలేదు. దీంతో గవర్నర్‌తో ప్రభుత్వానికి సరైన సంబంధాలు లేవని పొలిటికల్‌గా చర్చ నడిచింది. కానీ పట్నం మహేందర్‌రెడ్డి ప్రమాణస్వీకార కార్యక్రమానికి మాత్రం ప్రభుత్వం నుంచి అందరూ హాజరుకావడంతో ఈ పరిణామం ఆసక్తి రేపింది.

ఇదిలా ఉంటే పట్నం మహేందర్‌రెడ్డి.. మంత్రిగా ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిశాక... ముఖ్యమంత్రి కేసీఆర్ (CM Kcr).. రాజ్‌‌భవన్‌లో గవర్నర్ తమిళిసైతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా ఇటీవల గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలగా ఇద్దరి పేర్లను కేబినెట్ ప్రతిపాదించి రాజ్‌‌‌భవన్‌కు పంపించారు. కానీ గవ్నరర్ మాత్రం వాటిని ఆమోదించలేదు. దీంతో ఈ అంశం ప్రధానంగా ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే పెండింగ్‌లో మరికొన్ని బిల్లులపై కూడా గవర్నర్‌తో కేసీఆర్ చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశం దాదాపుగా 20 నిమిషాల పాటు సాగింది. అనంతరం మంత్రులందరితో కలిసి గవర్నర్ గ్రూప్ ఫొటో దిగారు.

Updated Date - 2023-08-24T17:08:46+05:30 IST