CM KCR: సీఎం కేసీఆర్ తొలి సంతకం దానిపైనే...

ABN , First Publish Date - 2023-04-30T07:59:25+05:30 IST

తెలంగాణ కొత్త సచివాలయ భవనం ఆదివారం ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 1:58 గంటల నుంచి 2:4 గంటల వ్యవధిలో ఒకేసారి సీఎం కేసీఆర్, మంత్రులు, అధికారులు సచివాలయంలో కొలువుదీరనున్నారు.

CM KCR: సీఎం కేసీఆర్ తొలి సంతకం దానిపైనే...

హైదరాబాద్: తెలంగాణ కొత్త సచివాలయ భవనం ఆదివారం ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 1:58 గంటల నుంచి 2:4 గంటల వ్యవధిలో ఒకేసారి సీఎం కేసీఆర్, మంత్రులు, అధికారులు సచివాలయంలో కొలువుదీరనున్నారు. కొత్త సచివాలయంలో ముఖ్యమంత్రి పోడు పట్టాల మార్గదర్శకాల ఫైల్‌పై తొలి సంతకం చేయనున్నారు. నూతన సచివాలయంలో ఆరో అంతస్తులో సీఎం కార్యాలయం, మూడో అంతస్తులో మంత్రి కేటీఆర్ కార్యాలయం, రెండో అంతస్తులో మంత్రి హరీశ్‌రావు కార్యాలయం ఉంది. రూ.1,200 కోట్ల వ్యయంతో తెలంగాణ నూతన సచివాలయం నిర్మాణం జరిగింది. కాగా మధ్యాహ్నం 2:15 గంటల నుంచి 2:45 గంటల వరకు సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ నూతన సచివాలయం ఆదివారం ప్రారంభం కానుంది. ముందుగా తెల్లవారు జామున 6:30 గంటల పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. సచివాలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రేకుల షెడ్డులో సుదర్శన యాగం నిర్వహించనున్నారు. ఈ యాగం మధ్యాహ్నం ఒంటి గంటకు మొదలై 1:20 గంటలకు పూర్తవుతుంది. ఆ తరువాత అర్చకులు నిర్ణయించిన పుష్కర అంశలో సీఎం కేసీఆర్‌ నూతన సచివాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ఆయన నేరుగా ఆరో అంతస్తులోని తన కార్యాలయానికి చేరుకుంటారు. ఆ తరువాత మంత్రులు, అధికారులు కూడా వారి చాంబర్లకు వెళతారు. మధ్యాహ్నం 1:58 నుంచి 2:04 గంటల మధ్య 6నిమిషాల వ్యవధిలో సీఎం సహా మంత్రులు, అధికారులు అందరూ ఏదో ఒక ఫైలుపై సంతకం చేసి పాలనను ప్రారంభిస్తారు. దీని తరువాత మధ్యాహ్నం 2:15 గంటలకు సచివాలయ ఉద్యోగులతో ముఖ్యమంత్రి అక్కడే సమావేశమై.. మంత్రులు, అధికారులతో మాట్లాడతారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతోపాటు ఇతర ప్రజాప్రతినిధులు కలిపి 2,500 మంది హాజరు కానున్నారు.

Updated Date - 2023-04-30T07:59:25+05:30 IST