TS News: చిన్నారికి పోలియో వ్యాక్సిన్ ఇప్పించిన కొన్ని గంటల్లోనే...
ABN , First Publish Date - 2023-04-13T15:54:56+05:30 IST
పోలియో వ్యాధి నివారణకు వాడే వ్యాక్సిన్ ఓ చిన్నారి ప్రాణాన్ని బలితీసుకుంది.
హైదరాబాద్: పోలియో వ్యాధి నివారణకు వాడే వ్యాక్సిన్ (Polio Vaccine) ఓ చిన్నారి ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ ఘటన హైదరాబాద్లోని సైదాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఐఎస్ సదన్ డివిజన్ సుబ్రమణ్యంనగర్ బస్తీ దవాఖానాలో దేవరకొండకు చెందిన దంపతులు తమ 52 రోజులు చిన్నారికి నిన్న (బుధవారం) పోలియో చుక్కలు వేయించారు. అయితే ఇంటికి వెళ్లిన తర్వాత చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు.
దేవరకొండలోని బాలునాయక్ తండాకు చెందిన లచ్చిరాం, మౌనికలకు ఏడాది క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక బాబు ఉన్నాడు. జీవనోపాధి కోసం భ్యాగనానికి వచ్చిన ఈ దంపతులు సైదాబాద్ ఖాజాబాగ్ గుడిసెలో నివాసం ఉంటున్నారు. లచ్చిరాం ఓ ప్రైవేట్ కళాశాలలో స్వీపర్గా పనిచేస్తు జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో నిన్న బాబుకు స్థానిక ఐఎస్ సదన్ డివిజన్ సుబ్రమణ్యంనగర్ బస్తీ దవాఖానాలో పోలియో చుక్కలు వేయగా.. అది వికటించి బాబు మృత్యువాత పడ్డాడు. దీంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన బాబు మృతికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, తమను న్యాయం చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. చిన్నారుల్లో వచ్చే పోలియో వ్యాధిని నివారించాల్సిన వ్యాక్సిన్ చిన్నారి ప్రాణాన్ని బలిగొనడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా ప్రాంతాల్లోని అంగన్ వాడీ కేంద్రాల్లో ఏఎన్ఎంలు ఈ పోలియో వ్యాక్సిన్ను చిన్నారులకు ఇస్తుంటారు.