Share News

KCR vs Gajwel: గజ్వేల్‌ పోరు గరంగరం.. నియోజకవర్గంలో పరిస్థితులు ఇవీ...

ABN , First Publish Date - 2023-10-23T05:36:51+05:30 IST

క్యాబినెట్‌ నుంచి అత్యంత అవమానకర రీతిలో తనను బర్తరఫ్‌ చేశారన్న కసితో, హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో తనను ఓడించడానికి అధికార బలాన్ని, ధనబలాన్ని ప్రయోగించారన్న ఆగ్రహంతో రగిలిపోతూ..

KCR vs Gajwel: గజ్వేల్‌ పోరు గరంగరం.. నియోజకవర్గంలో పరిస్థితులు ఇవీ...

నియోజకవర్గంతో ఈటలకు 30 ఏళ్ల బంధం

1994 నుంచి అక్కడ పౌలీ్ట్ర వ్యాపారం

స్థానిక ప్రజలతో సత్సంబంధాలు

ఆసక్తికరంగా కేసీఆర్‌ ఈటల పోరు

గజ్వేల్‌, అక్టోబరు 22: క్యాబినెట్‌ నుంచి అత్యంత అవమానకర రీతిలో తనను బర్తరఫ్‌ చేశారన్న కసితో, హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో తనను ఓడించడానికి అధికార బలాన్ని, ధనబలాన్ని ప్రయోగించారన్న ఆగ్రహంతో రగిలిపోతూ.. కేసీఆర్‌పై పోటీ చేస్తానని చెబుతూ వస్తున్న రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ నిజమయ్యాయి! ఈటల మాటలకు విలువనిస్తూ భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం ఆయనకు హుజురాబాద్‌తో పాటు గజ్వేల్‌ అభ్యర్థిత్వాన్ని కూడా ఖరారు చేసింది. దీంతో.. గజ్వేల్‌ పోరు గరంగరంగా మారింది. ఎందుకంటే గజ్వేల్‌ నియోజకవర్గంతో ఈటల రాజేందర్‌కు 30 ఏళ్ల అనుబంధం ఉంది. 1994 నుంచి గజ్వేల్‌ నియోజకవర్గంలోని వర్గల్‌ మండలం శాఖారం, మల్లారెడ్డిపల్లి గ్రామాల్లో పౌలీ్ట్ర వ్యాపారం చేస్తూ అక్కడి ప్రజలతో సత్సంబంధాలు ఏర్పర్చుకున్నారాయన. గజ్వేల్‌, వర్గల్‌, ములుగు మండలాలకు చెందిన పలువురు బడా నాయకులతోనూ ఆయన సంబంధాలు ఉన్నాయి. 2002లో సిద్దిపేట జిల్లా గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మునిసిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌ శ్రీ పార్థివేశ్వరాలయంలోనే ఆయన బీఆర్‌ఎస్‌ సభ్యత్వం తీసుకుని పార్టీలో చేరారు. ఈ క్రమంలోనే ఆయనకు కేసీఆర్‌తో సాన్నిహిత్యం ఏర్పడింది. తెలంగాణ ఉద్యమంలో ఇద్దరూ కలిసి పనిచేశారు. కానీ, ఇప్పుడు వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండడంతో..


కేసీఆర్‌ను ఓడించాలని ఈటల సంకల్పించారు. ఇందుకు అనుగుణంగా ఇటీవల పలు దఫాలుగా గజ్వేల్‌కు చెందిన తన సన్నిహితులతో ఆయన చర్చించినట్లు తెలుస్తున్నది. గజ్వేల్‌ నుంచి పోటీచేస్తే విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని తన వ్యక్తిగత సర్వేలో తేలడంతోనే ఈటల ఆ నియోజకవర్గంపై ఫోకస్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన పదిరోజుల క్రితం ఒకసారి, వారం రోజుల క్రితం మరోసారి.. కేసీఆర్‌పై తాను పోటీ చేయడం తథ్యమని తేల్చిచెప్పారు. సీఎం కేసీఆర్‌పై పోటీచేసి ఓడిస్తే.. రాష్ట్ర రాజకీయాల్లో తనకు తిరుగుండదని ఈటల భావిస్తున్నట్టు సమాచారం. అంతేకాక.. గజ్వేల్‌లో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడుతుందన్న సెంటిమెంట్‌ కూడా ఈటల పోటీకి కారణంగా తెలుస్తోంది. గజ్వేల్‌లో గత రెండుసార్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పోటీచేసిన వంటేరు ప్రతా్‌పరెడ్డి బీఆర్‌ఎ్‌సలో చేరిపోవడం.. కాంగ్రెస్‌ పార్టీ ఈసారి తన అభ్యర్థిగా తూంకుంట నర్సారెడ్డిని ప్రకటించడంతో ఈ దఫా ఎన్నికల్లో కేసీఆర్‌ విజయం నల్లేరు మీద నడకే బీఆర్‌ఎస్‌ నాయకులు భావించారు.

సీఎం కేసీఆర్‌, నర్సారెడ్డి మధ్య పోటీ నామమాత్రమేనని భావించారు. కానీ, ఈటల రంగప్రవేశంతో గజ్వేల్‌ నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా హాట్‌టాపిక్‌గా మారిందని చెప్పవచ్చు. ఇటీవల బీఆర్‌ఎ్‌సకు చెందిన పలువురు నాయకులు అసంతృప్త రాగం అందుకుని ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయడం, యువత బీజేపీ వైపు ఆసక్తిగా చూస్తుండడంతో.. సీఎం కేసీఆర్‌కు ఈటల రాజేందర్‌ గట్టి పోటీని ఇవ్వడం ఖాయంగా కనిపిస్తున్నది.

ఒకప్పుడు కాంగ్రెస్‌ కంచుకోట!

గజ్వేల్‌ నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్‌ కంచుకోటగా ఉండేది. 1957లో ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి జేబీ ముత్యాలరావు గెలుపొందగా, 1967, 1972, 1978, 1989, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులే విజయం సాధించారు. 2014లో కేసీఆర్‌ గజ్వేల్‌ బరిలో నిలవగా, కాంగ్రెస్‌ అభ్యర్థి నర్సారెడ్డి మూడోస్థానంలో నిలిచారు. 2018లో కాంగ్రెస్‌ తరఫున బరిలో నిలిచిన వంటేరు ప్రతా్‌పరెడ్డి సీఎం కేసీఆర్‌కు గట్టి పోటీని ఇచ్చినా ఓడిపోయారు.

Updated Date - 2023-10-23T07:54:20+05:30 IST