TS NEWS: విద్యుత్ సౌధలో CMDలతో ఉద్యోగ సంఘాల చర్చలు సఫలం.. సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటన
ABN , First Publish Date - 2023-04-15T22:52:18+05:30 IST
7 శాతం పీఆర్సీకి విద్యుత్ ఉద్యోగుల అంగీకారం తెలిపారు.
హైదరాబాద్: 7 శాతం పీఆర్సీకి విద్యుత్ ఉద్యోగుల అంగీకారం తెలిపారు. విద్యుత్ సౌధలో CMDలతో ఉద్యోగ సంఘాల చర్చలు ఫలప్రదమయ్యాయి. ఎల్లుండి (17 సోమవారం) నుంచి తలపెట్టిన సమ్మె విరమించుకున్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు.
కాగా.. తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు ఈ నెల 17 నుంచి సమ్మెలోకి వెళుతున్నట్లు జేఏసీ జిల్లా చైర్మెన్ భాస్కర్, కన్వీనర్ నాయిని అంజయ్య తెలిపారు. తమ న్యాయమైన కోర్కెలైన వేతన సవరణ, ఈపీఎస్ టు జీపీఎఫ్, ఆర్టిజన్ అంశాన్ని పరిష్కరించాలని సంవత్సర కాలంగా విద్యుత్ సంస్థల యాజమాన్యాలకు విజ్ఞప్తి చేశారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి హరీష్రావుకు వినతిపత్రం అందజేశామని తెలిపారు. తాము రైతులకు, వినియోగదారులకు, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, తమ న్యాయమైన కోర్కెల సాధన కోసంతోపాటు విద్యుత్తు సంస్థల మనుగడ కోసం పోరాడుతున్నామన్నారు.
యాజమాన్యాల నిర్లక్ష్య వైఖరితో విద్యుత్ సంస్థలు సుమారు 50 వేల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయాయని విమర్శించారు. తెలంగాణ ఏర్పడక ముందు విద్యుత్ సంస్థలు ఎలాంటి నష్టాలు లేకుండా కొనసాగాయని, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిందన్నారు. తమ న్యాయమైన పోరాటానికి రైతులు, వినియోగదారులు మద్దతు కోరారు.