Share News

Bank: ఈ బ్యాంకు ఉద్యోగులు మామూలు వాళ్లు కాదు.. ఖాతాదారులకు కుచ్చుటోపీ.. రూ.కోటిన్నరకు పైగా స్వాహా

ABN , Publish Date - Dec 23 , 2023 | 01:20 PM

ఓ ప్రైవేట్‌ బ్యాంకులోని ఇద్దరు ఉద్యోగులు తమ చేతివాటం ప్రదర్శించి.. ప్రజల ఖాతాల నుంచి పెద్దమొత్తంలో నగదును నొక్కేశారు. ఆలస్యంగా ఈ విషయం తెలుసుకున్న ఖాతాదారులు బ్యాంకు వద్దకు చేరుకుని లబోదిబోమన్నారు.

Bank: ఈ బ్యాంకు ఉద్యోగులు మామూలు వాళ్లు కాదు.. ఖాతాదారులకు కుచ్చుటోపీ.. రూ.కోటిన్నరకు పైగా స్వాహా

సత్తుపల్లి(ఖమ్మం): ఓ ప్రైవేట్‌ బ్యాంకులోని ఇద్దరు ఉద్యోగులు తమ చేతివాటం ప్రదర్శించి.. ప్రజల ఖాతాల నుంచి పెద్దమొత్తంలో నగదును నొక్కేశారు. ఆలస్యంగా ఈ విషయం తెలుసుకున్న ఖాతాదారులు బ్యాంకు వద్దకు చేరుకుని లబోదిబోమన్నారు. సత్తుపల్లి(Sattupalli) పట్టణంలోని ఒక ప్రముఖ ప్రైవేట్‌ బ్యాంకులో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు.. ఖాతాదారులు తమ లావాదేవీల కోసం ఇచ్చిన చెక్కులు, ఫిక్సిడ్‌ డిపాజిట్‌ కోసం ఇచ్చిన పత్రాల్లోని విత్‌డ్రాయల్‌ ఫారాలను చేజిక్కించుకున్నారు. వారి ఖాతా నుంచి.. తమతో పాటు అదే బ్యాంకులో పనిచేస్తున్న ఇతర ఉద్యోగుల కుటుంబీకుల ఖాతాలకు నగదును ట్రాన్ఫర్‌ చేశారు. స్వల్పకాలిక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసుకున్న ఖాతాదారుల సమయం ముగియడంతో ఎఫ్‌డీ విత్‌డ్రా కోసం వచ్చిన సమయంలో అసలు విషయం తెలిసింది. తమ పేరున అసలు ఎఫ్‌డీ కాలేదని, డబ్బు వేరే ఖాతాలకు బదిలీ అయిందని తెలుసుకుని లబోదిబోమన్నారు. ఇలా పలు లావాదేవీలలో వచ్చిన విత్‌డ్రా ఫారాలను తమకు అనుకూలంగా మార్చుకున్న ఆ ఇద్దరు ఉద్యోగులు సుమారు రూ.కోటిన్నరకు పైగా నగదును మళ్లించుకున్నట్టు తెలుస్తోంది. అయితే విత్‌డ్రా కోసం బ్యాంకుకు వచ్చి తమ ఖాతాల్లో నగదు లేదని తెలుసుకున్న ఖాతాదారులు తాము మోసపోయామని గ్రహించి బ్యాంకు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.

ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్‌..!

ఖాతాదారుల సొమ్మును సుమారు రూ.కోటిన్నర వరకు తమ ఉద్యోగులు స్వాహా చేసిన విషయంపై సీరియస్‌గా తీసుకున్న బాం్యకు యాజమాన్యం ఆ ఇద్దరు ఉద్యోగు లను సస్పెండ్‌ చేసినట్టు తెలిసింది. యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయకుండా గుట్టుచప్పుడు కాకుండా విచారణ జరిపి బ్యాంకు లీగల్‌ డిపార్టుమెంట్‌ కు అప్పగించినట్టు ప్రచారం జరుగుతోంది. సొమ్ము పోయినవారిలో ప్రముఖులు కూడా ఉండగా.. వారు కూడా ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. దీంతో సదరు ఇద్దరు ఉద్యోగులు కొందరితో రాయబారం జరిపి ప్రైవేట్‌గా సెటిల్‌మెంట్‌ చేసుకున్నారని, రూ.45లక్షల మేర తిరిగి వారికి చెల్లించగా మిగిలిన ఖాతాదారులకు ఇంకా రూ.కోటిపైన ఇవ్వాల్సి ఉంది. ఖాతాదారులు బ్యాంకు చుట్టూ తిరుగుతున్న క్రమంలో బ్యాంకు యాజమాన్యం రంగంలోకి దిగి ఖాతాదారులకు సంబంధించిన నగదుకు ఎలాంటి ఇబ్బంది లేదని, ఎఫ్‌డీ, చెక్కులు సంబంధించి ఆధారాలున్నవారి అందరికీ చెల్లింపులు జరిపేందుకు బ్యాంకు బాధ్యత తీసుకుంటుందని హామీ ఇచ్చారు. దీంతో ఖాతాదారులు న్యాయ, క్రిమినల్‌ చర్యలకు వెళ్లకుండా ఓపికగా మిన్నకుండిపోయారు. విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు, బ్యాంకు ప్రతిష్ట కాపాడుకునేందుకు యాజమాన్యం రంగంలోకి దిగి ఖాతాదారులకు హామీ ఇవ్వడంతో ఖాతాదారులు శాంతించారు. మొత్తంగా ఖాతాదారులను నమ్మించి పెద్ద మొత్తంలో డబ్బులు స్వాహా చేసిన సంఘటన పట్టణంలో సంచలనం రేపగా.. ఈ సంఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్థానిక పోలీసులు తెలిపారు. ఇక బ్యాంక్‌ సిబ్బంది కూడా ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారు.

Updated Date - Dec 23 , 2023 | 01:20 PM