Jio 5G: తెలుగు రాష్ట్రాల్లో జియో 5జీ సర్వీసుల విస్తరణ..
ABN , First Publish Date - 2023-03-08T20:29:34+05:30 IST
ప్రముఖ టెలి కమ్యూనికేషన్ సంస్థ రిలయన్స్ జియో తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు జియో 5జీ సర్వీసులను మరింత విస్తరించింది.
హైదరాబాద్: ప్రముఖ టెలి కమ్యూనికేషన్ సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio) తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు జియో 5జీ (Jio 5G) సర్వీసులను మరింత విస్తరించింది. ఇందులో భాగంగా ఈ రోజు మరో 27 నగరాల్లో జియో 5జీ సర్వీసులను విస్తరించినట్లు రిలయన్స్ జియో ప్రకటించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 331 నగరాల్లో జియో 5జీ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చామని సంస్థ వెల్లడించింది. కొత్తగా మరికొన్ని నగరాల్లో 5జీ సేవలు విస్తరించిన నేపథ్యంలో వినియోగదారులను ఈ రోజు నుంచి జియో వెల్కమ్ ఆఫర్కు ఆహ్వానిస్తున్నామని సంస్థ తెలిపింది. జియో 5జీ సేవలను 1జీబీపీఎస్ వరకు అధిక స్పీడుతో డేటాను అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జియో 5జీ సర్వీసులను మరింత విస్తరించినట్లు సంస్థ వెల్లడించింది. ఛత్తీస్గఢ్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంతోపాటు మొత్తం 27 నగరాల్లో జియో 5జీ సర్వీసులను విస్తరించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయనగరం, విజయవాడ, తిరుపతి, తిరుమల, తెనాలి, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, ప్రొద్దుటూరు, ఒంగోలు, నెల్లూరు, నరసరావుపేట, నంద్యాల, మదనపల్లి, కర్నూలు, కాకినాడ, కడప, హిందూపూర్, గుంటూరు, గుంతకల్, ఏలూరు, చిత్తూరు, చీరాల, భీమవరం, అనంతపురం, మచిలీపట్నం, అనకాపల్లి, విశాఖపట్నం సిటీలో జియో 5జీ సేవలను విస్తరించినట్లు రిలయన్స్ జియో పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలో జహీరాబాద్, తాండూరు, సిద్దిపేట, సంగారెడ్డి, నిర్మల్, కొత్తగూడెం, కోదాడ, జగిత్యాల, వరంగల్, రామగుండం, నిజామాబాద్, నల్గొండ, మంచిర్యాల, మహబూబ్ నగర్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, హైదరాబాద్లో జియో 5జీ సేవలను విస్తరించామని రిలయన్స్ జియో పేర్కొంది.