Nagpur Test: టీమిండియా ఆలౌట్.. తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం..!

ABN , First Publish Date - 2023-02-11T11:53:50+05:30 IST

ఆస్ట్రేలియా(Australia)తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య భారత్ 400 పరుగులకు ఆలౌట్ అయింది.

Nagpur Test: టీమిండియా ఆలౌట్.. తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం..!

నాగ్‌పూర్: ఆస్ట్రేలియా(Australia)తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య భారత్ 400 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవర్ నైట్ స్కోరు 321/7తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత జట్టు మరో 79 పరుగులు జోడించి మిగతా మూడు వికెట్లు పారేసుకుంది. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 177 పరుగులు చేసిన విషయం తెలిసిందే. దీంతో టీమిండియాకు (Team India) తొలి ఇన్నింగ్స్‌లో 233 పరుగుల ఆధిక్యం లభించింది. భారత ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ (120) శతకంతో మెరవగా.. ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా(70), అక్షర్ పటేల్ (84) రాణించారు. చివరలో మహ్మద్ షమీ 37 పరుగులతో బ్యాట్ ఝులిపించాడు. ఆసీస్ బౌలర్లలో టాడ్ మర్ఫీ 7 వికెట్లు తీస్తే.. సారథి ప్యాట్ కమిన్స్ 2, నాథన్ లియోన్ ఒక వికెట్ పడగొట్టారు.

భారత ఆల్‌రౌండర్ల అద్భుత ప్రదర్శన.. చివరలో షమీ మెరుపులు..

భారత ఆల్‌రౌండర్లు జడ్డూ-అక్షర్‌ జోడి అద్భుత ప్రదర్శనతో ఆటకట్టుకుంది. వీరిద్దరూ 88 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యం అందించడంతో భారత్ భారీ ఆధిక్యం సాధించింది. ఈ ద్వయం ఆసీస్‌ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ దీటుగా బ్యాటింగ్‌ చేశారు. చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ ఇద్దరూ అర్ధ శతకాలు నమోదు చేశారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి జడేజా (66 బ్యాటింగ్‌) అక్షర్‌ పటేల్‌ (52 బ్యాటింగ్‌) నాటౌట్‌గా ఉన్నారు. అయితే, మూడోరోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే జడేజా మరో నాలుగు పరుగులు చేసి పెవిలియన్ చేరారు. దీంతో ఈ జోడి 88 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కాగా, జడేజా బౌలింగ్‌లో కూడా 5వికెట్లతో రాణించిన విషయం తెలిసిందే. ఇక జడేజా వెనుదిరిగిన తర్వాత క్రీజులోకి వచ్చిన షమీ విజృంభించాడు. ఆసీస్ బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డాడు. మూడు సిక్సర్లు, రెండు ఫోర్లతో 37 పరుగులు చేసి ఔటయ్యాడు. అక్షర్‌తో కలిసి పదో వికెట్‌కు 52 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

అరంగేట్రంలో అదరగొట్టిన ఆసీస్ యువ స్పిన్నర్ మర్ఫీ..

టాడ్‌ మర్ఫీ..22 ఏళ్ల ఈ ఆస్ట్రేలియా స్పిన్నర్‌ అరంగేట్ర టెస్ట్‌లోనే 7 వికెట్లతో అదరగొట్టాడు. భారత బ్యాటర్లను పూర్తి స్థాయిలో నిలువరించిన మర్ఫీ.. తొలి టెస్ట్‌ మొదటి రోజు ఆటలో రాహుల్‌ను అవుట్‌ చేసిన అతడు మొదటి అంతర్జాతీయ వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక రెండోరోజు కీలకమైన కోహ్లీతో పాటు నైట్‌ వాచ్‌మన్‌ అశ్విన్‌, పుజార, భరత్‌లను పెవిలియన్‌ చేర్చాడు. ఈక్రమంలో అరంగేట్ర టెస్ట్‌‌లో ఐదు వికెట్లు తీసిన పిన్నవయస్సు ఆసీస్‌ బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా, షమీలను పెవిలియన్ చేర్చాడు. ఇలా అరంగేట్రంలోనే టీమిండియాపై ఏడు వికెట్లు పడగొట్టి అద్భుతంగా రాణించాడు.

Updated Date - 2023-02-11T12:18:24+05:30 IST