Test championship 2023: మన కూర్పు ఎలా ?

ABN , First Publish Date - 2023-06-04T11:58:35+05:30 IST

మెగా ఈవెంట్‌ కోసం 15 మంది సభ్యుల భారత జట్టును ఎంపిక చేయడంలో సెలెక్టర్లకు కఠిన పరీక్షే ఎదురైంది. కీలక ఆటగాళ్లు గాయపడడం టీమిండియాకు ప్రధాన సమస్యగా మారింది....

Test championship 2023: మన కూర్పు ఎలా ?

మెగా ఈవెంట్‌ కోసం 15 మంది సభ్యుల భారత జట్టును ఎంపిక చేయడంలో సెలెక్టర్లకు కఠిన పరీక్షే ఎదురైంది. కీలక ఆటగాళ్లు గాయపడడం టీమిండియాకు ప్రధాన సమస్యగా మారింది. ఎన్నో ఆశలు పెట్టుకొన్న స్పీడ్‌ గన్‌ బుమ్రా కీలక టెస్ట్‌కు అందుబాటులో లేకపోవడం లోటుకాగా.. కేఎల్‌ రాహుల్‌ కూడా దూరం కావడం జట్టు సమతుల్యతపై సందేహాలు రేకెత్తిస్తోంది. దీంతో రాహుల్‌ స్థానంలో ఒక్క టెస్ట్‌ కూడా ఆడని ఇషాన్‌ కిషన్‌ను ఎంపిక చేశారు. అయితే, ప్రధాన వికెట్‌ కీపర్‌ కేఎస్‌ భరత్‌కు బ్యాకప్‌గానే కిషన్‌ను పరిగణించే అవకాశం ఉంది. మరో పేసర్‌ జయ్‌దేవ్‌ ఉనాద్కట్‌ ఫిట్‌నెస్‌పై అనుమానాలున్నాయి.

తుది జట్టులో అశ్విన్‌, జడేజా..!

పేస్‌, స్వింగ్‌కు సహకరించే ఓవల్‌ వికెట్‌పై టీమిండియా బౌలింగ్‌ కూర్పు ఎలా ఉండనుందనేది ఆసక్తిగా మారింది. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో సిరీస్‌ నెగ్గడంలో అశ్విన్‌, జడేజా, అక్షర్‌ పటేల్‌ ముగ్గురూ కీలకపాత్ర పోషించారు. అశ్విన్‌, జడేజాకు తుది జట్టులో చోటుదక్కే అవకాశాలు చాలా ఎక్కువగా ఉండగా.. బ్యాటింగ్‌ బలం అక్షర్‌కు ప్లస్‌ కానుంది. ఓవరాల్‌గా స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌గా అశ్విన్‌, బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌గా జడేజాకు టీమ్‌లో చోటు ఖాయమని అంచనాలు వేస్తున్నారు.

లెఫ్టామ్‌ పేసర్‌ లేని లోటు..

పేస్‌ బౌలింగ్‌ విభాగంలో బుమ్రా లేకపోవడం నిజంగా లోటే. షమి, సిరాజ్‌, ఉమేష్‌ యాదవ్‌లు ప్రధాన పేసర్లుగా జట్టులో స్థానం దక్కించుకొనే అవకాశం ఉంది. శార్దూల్‌కు కూడా ఓవల్‌ పిచ్‌పై ఆడిన అనుభవం ఉండడంతో అతణ్ణి కూడా విస్మరించే పరిస్థితులు లేవు. వయసు రీత్యా షమి, ఉమేష్‌ వేగంపై అనుమానాలున్న నేపథ్యంలో యువకులు సిరాజ్‌, శార్దూల్‌వైపు మేనేజ్‌మెంట్‌ మొగ్గుచూపే అవకాశాలు లేకపోలేదు. 2021లో న్యూజిలాండ్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడిన అనుభవం షమికి ఉంది. అయితే, షమి, సిరాజ్‌, ఉమేష్‌లు కుడి చేతి వాటం బౌలర్లు. లెఫ్టామ్‌ పేసర్‌ ఉనాద్కట్‌ను తీసుకొన్నా అతడి ఫిట్‌నెస్‌పై అనుమానాలున్నాయి. మొత్తంగా ఎడమ చేతివాటం బౌలర్‌ లేకపోతే బౌలింగ్‌లో వైవిధ్యం లోపించే అవకాశం ఉంది.

సూర్య విఫలం..

టీ20 క్రికెట్‌లో వెలిగిపోతున్న సూర్య.. టెస్టులు, వన్డేలకు వచ్చే సరికి విఫలమ వుతున్నాడు. కేవలం ఒక్క టెస్ట్‌ మాత్రమే ఆడగా.. ఆస్ట్రేలియాతో ఈ ఏడాది సొంతగడ్డపై జరిగిన వన్డే సిరీస్‌లో హ్యాట్రిక్‌ డక్‌లు నమోదు చేశాడు. కానీ, ఐపీఎల్‌లో మళ్లీ టచ్‌లోకి రావడంతో సూర్యపై అంచనాలు పెరిగాయి. అయితే, సూర్య స్టాండ్‌బై ఆటగాడిగానే ఉండనున్నాడు.

రహానెకు క్లియర్‌..

ఓపెనర్లుగా రోహిత్‌, శుభ్‌మన్‌ గిల్‌ ఫిక్స్‌. దీంతో ఏడాదిపైగా విరామం తర్వాత మళ్లీ టెస్ట్‌ టీమ్‌లోకి వచ్చిన రహానెకు తుది జట్టులో చోటు కష్టమే అని అనిపించింది. కానీ, రాహుల్‌ టీమ్‌ నుంచి అవుట్‌ కావడంతో నెం:5లో రహానెకు చాన్స్‌ దక్కొచ్చు. కాగా, రోహిత్‌ ఫామ్‌ జట్టును ఆందోళనకు గురి చేస్తుండగా.. గిల్‌ జోరు మీదున్నాడు.

భారత జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, చటేశ్వర్‌ పుజార, విరాట్‌ కోహ్లీ, అజింక్యా రహానె, కేఎస్‌ భరత్‌, ఇషాన్‌ కిషన్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, మహ్మద్‌ షమి, మహ్మద్‌ సిరాజ్‌, ఉమేష్‌ యాదవ్‌, శార్దూల్‌ ఠాకూర్‌, జైదేవ్‌ ఉనాద్కట్‌.

స్టాండ్‌ బైలు: రుతురాజ్‌ గైక్వాడ్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, ముకేష్‌ కుమార్‌

- శ్రీనివాస్‌

Updated Date - 2023-06-04T12:20:16+05:30 IST