PV Sindhu: విడిపోయిన సింధు.. పార్క్ తే సంగ్

ABN , First Publish Date - 2023-02-24T19:12:57+05:30 IST

ఈ విషయాన్ని పార్క్ స్వయంగా వెల్లడించాడు. 2019 నుంచి పార్క్-సింధు

PV Sindhu: విడిపోయిన సింధు.. పార్క్ తే సంగ్

హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు(PV Sindhu)-కోచ్ పార్క్ తే సంగ్(Park Tae Sang) మధ్య విభేదాలు పొడసూపినట్టు తెలుస్తోంది. దీంతో ఇద్దరూ తెగదెంపులు చేసుకున్నారు. ఈ విషయాన్ని పార్క్ స్వయంగా వెల్లడించాడు. 2019 నుంచి పార్క్-సింధు కలిసి పనిచేస్తున్నారు. పార్క్ హయాంలో సింధు మూడు బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిళ్లు, సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్, స్విస్ ఓపెన్, సింగపూర్ ఓపెన్‌లను గెలుచుకుంది. అలాగే, 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించింది.

ఆ బాధ్యత నాదే..

పీవీ సింధు ఆటతీరు గతకొంతకాలంగా మరీ నిరాశాజనకంగా మారింది. ఫామ్ కోల్పోయి తంటాలు పడుతోంది. ఇటీవలి మ్యాచుల్లో ఆమె ప్రదర్శన తీసికట్టుగా మారడంతో ఆ బాధ్యతను పార్క్ తే సంగ్ తనపై వేసుకున్నాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ పోస్టు పెట్టాడు. ఈ ఏడాది ఆరంభం నుంచి సింధు ప్రదర్శన ఏమంతా బాగోలేదు. వరుస వైఫల్యాలు సింధును వేధించాయి. ఆమె ఆటతీరు నిరాశాజనకంగా ఉండడంతోనే పార్క్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

సింధు ప్రదర్శనకు పూర్తి బాధ్యత తనదేనని పార్క్ ఆ పోస్టులో వెల్లడించాడు. మార్పు కోసం ఎదురుచూస్తున్న సింధు కొత్త కోచ్ వేటలో ఉందని, అందుకనే తాను గౌరవంగా తప్పుకుంటున్నట్టు పేర్కొన్నాడు. వచ్చే ఒలింపిక్స్ వరకు తాను ఆమెతో ఉండలేకపోతున్నందుకు క్షమించాలని, తాను దూరంగా ఉన్నా ఆమెకు మద్దతు కొనసాగుతుందన్నాడు. ఆమెతో కలిసి పనిచేసిన ప్రతి క్షణాన్ని గుర్తుంచుకుంటానని, తమకు మద్దతిచ్చి, ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు చెప్పాడు.

Updated Date - 2023-03-20T10:58:38+05:30 IST