new financial rules: మే నెల 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్.. ఏవిధంగా ప్రభావం చూపిస్తాయంటే..

ABN , First Publish Date - 2023-04-30T19:09:29+05:30 IST

రోజువారీ జీవితంలో ఫైనాన్షియల్ వ్యవహారాలు ప్రతి ఒక్కరికీ ఎంతో ముఖ్యమైనవి. కాబట్టి తాజా సమాచారాన్ని తెలుసుకోవడం ఉత్తమం. 1 మే 2023 నుంచి కూడా కీలకమైన ఆర్థిక వ్యవహారాల్లో పలు మార్పులు చోటుచేసుకోబోతున్నాయి.

new financial rules: మే నెల 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్.. ఏవిధంగా ప్రభావం చూపిస్తాయంటే..

ర్థిక సంబంధ వ్యవహారాలు అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. సంబంధిత నియంత్రణ సంస్థలు లేదా ప్రభుత్వాలు చేపట్టే సవరణలను బట్టి నిబంధనలు మారుతుంటాయి. తదనుగుణంగానే కొత్త రూల్స్ అమలు అవుతుంటాయి. రోజువారీ జీవితంలో ఫైనాన్షియల్ వ్యవహారాలు ప్రతి ఒక్కరికీ ఎంతో ముఖ్యమైనవి. కాబట్టి తాజా సమాచారాన్ని తెలుసుకోవడం ఉత్తమం. 1 మే 2023 నుంచి కూడా కీలకమైన ఆర్థిక వ్యవహారాల్లో పలు మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. జీఎస్టీ నుంచి ఏటీఎం వరకు కొన్ని నిబంధనలు కొత్తగా ఆచరణలోకి రాబోతున్నాయి. అవేంటో ఒక లుక్కేద్దాం...

కొత్త జీఎస్టీ రూల్...

మే 1 నుంచి ఆచరణలోకి రాబోయే ముఖ్యమైన మార్పుల్లో జీఎస్టీ రూల్ ప్రధానమైనది. కొత్త నిబంధనల ప్రకారం.. రూ.100 కోట్లకుపైగా టర్నోవర్ కలిగిన కంపెనీలు తమ లావాదేవీల రశీదులను ఐఆర్‌పీపై (ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్) అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. 7 రోజుల వ్యవధిలోనే ఈ ప్రక్రియ ముగించేయాలి. సకాలంలో పన్ను దాఖలకు వీలుగా ఈ కేటగిరికి చెందిన చెల్లింపుదారులను 7 రోజుల తర్వాతి ఇన్వాయిస్ రిపోర్టింగ్‌కు అనుమతించబోమని జీఎస్టీఎన్ (GSTN) తెలిపింది. ఈ కొత్త విధానాన్ని మే 1, 2023 నుంచి అమల్లోకి తీసుకొస్తున్నట్టు వెల్లడించింది. ఇన్వాయిస్‌లకు మాత్రమే ఈ కొత్త రూల్ వర్తిస్తుందని తెలిపింది. రిపోర్టింగ్ డెబిట్/క్రెడిట్ నోట్స్‌పై ఎలాంటి ఆంక్షలు ఉండబోవని వెల్లడించింది. కాగా ప్రస్తుతం ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్లకు ఎలాంటి పరిమితులు లేవు.

కేవైసీ ఉన్న ఈ-వాలెట్స్ ద్వారా మాత్రమే ఎంఎఫ్ పెట్టుబడులు..

కేవైసీ ఉన్న ఈ-వాలెట్స్ ద్వారా మాత్రమే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు అవకాశం ఇవ్వాలని మ్యూచువల్ ఫండ్ కంపెనీలను మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) కోరింది. దీంతో ఈ నిబంధన మే 1 నుంచి అమల్లోకి వస్తుంది. దీంతో ఇకపై కైవైసీ ఉన్న ఈ-వాలెట్స్ ద్వారా మాత్రమే మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులకు అవకాశం ఉంటుంది. అంటే మీ వాలెట్ కేవైసీ కాకుంటే ఇన్వెస్ట్ చేయడం కుదరదు.

గ్యాస్ ధరలు పెరుగుతాయో.. తగ్గుతాయో..

ఇక ప్రతి నెల మాదిరిగానే ఎల్‌పీజీ, సీఎన్‌జీ-పీఎన్‌జీల నూతన ధరలను కేంద్రం విడుదల చేయనుంది. అయితే ధరలు పెరుగుతాయా?.. తగ్గుతాయా అనేది మాత్రం చెప్పలేము. గత నెల్లో 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.91.50 మేర తగ్గింది. ఈ తగ్గింపు తర్వాత ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ ధర రూ.2028కి దిగొచ్చింది. అయితే గత నెలలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు జరగలేదు. కాబట్టి మే 1 తేదీన ఏమైనా తగ్గొచ్చు లేదా పెరగొచ్చు.

-పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కస్టమర్లకు సంబంధించిన ఓ రూల్ మారబోతోంది. ఖాతాలో డబ్బు లేని కారణంగా ఏటీఎంల వద్ద ట్రాన్సాక్షన్ ఫెయిలైతే రూ.10 ప్లస్ జీఎస్టీ చార్జీ బ్యాంక్ విధించనుంది.

Updated Date - 2023-04-30T19:09:54+05:30 IST