Ooty: రెండ్రోజుల్లో లక్ష మంది.. కిటకిటలాడుతున్న ఊటీ
ABN , First Publish Date - 2023-05-16T11:30:30+05:30 IST
పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు తమిళనాడు సహా వివిధ రాష్ట్రాల పర్యాటకులు పెద్దసంఖ్యలో
ప్యారీస్(చెన్నై): పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు తమిళనాడు సహా వివిధ రాష్ట్రాల పర్యాటకులు పెద్దసంఖ్యలో నీలగిరి జిల్లాలో వేసవి విడిది కేంద్రం ఊటీకి తరలివెళ్తున్నారు. సెలవు రోజులైన శని, ఆదివారాల్లో సుమారు లక్ష మందికి పైగా పర్యాటకులు ఊటీ చేరుకొని అక్కడి చల్లటి వాతావరణాన్ని ఆస్వాదించారు. పర్వతాలు, సెలయేళ్లు, లక్షల సంఖ్యలో చెట్లు, కాఫీ, తేయాకు తోటలు, పచ్చటి పొలాలు అధికంగా ఉన్న ఊటీలో వేసవి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. పర్యాటకులను ఆకట్టుకొనేలా రాష్ట్ర పర్యాటక అభివృద్ధి శాఖ, ఉద్యానవన శాఖలు సంయుక్తంగా కూరగాయలు, సుగంధద్రవ్యాలు, గులాబీల ప్రదర్శన ఏర్పాటు చేశాయి. ఊటీలో ప్రపంచ ప్రసిద్ధిచెందిన రోజ్ గార్డెన్లో ప్రదర్శనకు కొలువుదీర్చిన గులాబీల అందాలను వీక్షించేందుకు పర్యాటకులు పెద్దసంఖ్యలో తరలివెళ్తున్నారు. ఇక్కడున్న బొటానికల్ గార్డెన్, కున్నూర్ సిమ్స్ పార్క్, తొట్టబెట్టా, బోట్ హౌస్, లేమ్స్ రాక్, వ్యూ పాయంట్ తదితర ప్రాంతాల్లో పర్యాటకుల రద్దీ నెలకొంది.
19 నుంచి పుష్ప ప్రదర్శన...
ఊటీ బొటానికల్ గార్డెన్లో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో 125వ పుష్ప ప్రదర్శన ఈ నెల ప్రారంభమై ఐదు రోజులు కొనసాగనుంది. పుష్ప ప్రదర్శనకు సంబంధించిన పనుల్లో ఉద్యానవన శాఖ సిబ్బంది, అధికారులు చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రదర్శన జరిగే రోజుల్లో పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నందున మెరుగైన సదుపాయాలు సమకూర్చుతున్నారు. ఊటీలో కనిష్ఠంగా 16 డిగ్రీల సెల్సియస్, గరిష్ఠంగా 21 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఆదివారం నమోదైనట్లు ప్రాంతీయ వాతావరణ శాఖ తెలిపింది.
