Fight for Daughter: మోదీ గారూ.. ప్లీజ్ హెల్ప్.. మా మూడేళ్ల కూతుర్ని జర్మన్ సర్కారు ఇవ్వడం లేదు..

ABN , First Publish Date - 2023-03-10T20:33:04+05:30 IST

జర్మనీలోని కఠిన చట్టాలు ఓ బిడ్డను తల్లిదండ్రులకు దూరం చేశాయి. ఏడాదిన్నరగా పాపకు దూరంగా ఉంటున్న ఆ తల్లిదండ్రులు చివరకు భారత్ ప్రభుత్వాన్ని ఆశ్రయించారు.

Fight for Daughter: మోదీ గారూ.. ప్లీజ్ హెల్ప్.. మా మూడేళ్ల కూతుర్ని జర్మన్ సర్కారు ఇవ్వడం లేదు..

ఎన్నారై డెస్క్: జర్మనీలోని(Germany) కఠిన చట్టాలు(Child custody laws) ఓ బిడ్డను తల్లిదండ్రులకు(Indian couple) దూరం చేశాయి. ఏడాదిన్నరగా పాపకు దూరంగా ఉంటున్న ఆ తల్లిదండ్రులు చివరకు భారత్ ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. మోదీగారూ.. ప్లీజ్ హెల్ప్ అంటూ ప్రధాని మోదీ(PM modi) సాయం కోరారు. విదేశాల్లో్ చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో చెప్పే ఉదాహరణ ఇది.

జర్మనీలో నివసించే ఆ ఎన్నారై దంపతుల కూతురి వయసు ప్రస్తుతం మూడేళ్లు. అయితే.. ఆమెకు దాదాపు ఏడాదిన్నర వయసున్నప్పుడు అంటే 2021లో జరిగిన ఓ ఘటనతో ఆ దంపతులు బిడ్డకు దూరమయ్యింది. అప్పట్లో ఆ పాప నాన్నమ్మ చేసిన పొరపాటు కారణంగా చిన్నారి మర్మాంగంపై చిన్న గాయమైంది. తల్లిదండ్రులు పాపను వైద్యుల వద్దకు తీసుకెళ్తే వారు చికిత్స చేసి పంపించారు. ఆ తరువార వారం రోజులకు రీచెకప్‌కు వెళ్లిన సందర్భంలో వైద్యులు బిడ్డ గాయం గురించి ప్రభుత్వానికి సమాచారం అందించారు. బిడ్డపై లైంగిక దాడి జరిగుండొచ్చన్న అనుమానం వ్యక్తం చేశారు. దీంతో.. ప్రభుత్వం ఆ చిన్నారి బాధ్యతను తీసుకుంది. ఆ తరువాత ఆసుపత్రి వైద్యులు బిడ్డకు ఎటువంటి హానీ జరగలేదని ప్రకటించడంతో కేసును మూసేసినట్టు తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా తాము డీఎన్ఏ టెస్టుకు కూడా అంగీకరించామని వారు పేర్కొన్నారు. ఇంత చేసినా ప్రభుత్వం తమ బిడ్డను తమకు ఇంకా అప్పగించలేదని వాపోయారు. ఈ క్రమంలో బిడ్డపై తల్లిదండ్రుల హక్కును రద్దు చేయాలంటూ జర్మనీ బాలల హక్కుల సంరక్షణ శాఖ మరో కేసు వేసిందని వారు మీడియాకు తెలిపారు. బాలిక గత ఏడాదిన్నరగా ప్రభుత్వ సంరక్షణలోనే ఉంటోంది.

తమ సంతానాన్ని తిరిగి తెచ్చుకునేందుకు ఆ దంపతులు చేయని ప్రయత్నం లేదు. కానీ బిడ్డను పెంచేందుకు తల్లిదండ్రులుగా ఆ ఎన్నారై జంటకు ఉన్న సామర్థ్యంపై ప్రభుత్వం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. బిడ్డను గారాబం చేస్తున్నారని కూడా ఓమారు ఆరోపించింది. బాలికకు మూడు నుంచి ఆరేళ్ల వయసొచ్చాక తల్లిదండ్రుల వద్ద ఉండాలో వద్దో నిర్ణయించుకునే సామర్థ్యం వస్తుందని జర్మనీ అధికారులు చెబుతున్నారు. అప్పటివరకూ ఆ దంపతులు వేచి చూడాలంటున్నారు. అయితే.. తాము జర్మనీలో కొనసాగడం కష్టంగా మారిందని పాప తండ్రి వాపోయారు. తన జాబ్ పోయిందని, ఇప్పటికే 40 లక్షల రూపాయల అప్పుల్లో కూరుకుపోయామన్నారు. పిల్లల పెంపకంలో భారతీయులు, జర్మన్స్ మధ్య కొన్ని తేడాలున్నాయని, వీటిని అక్కడి అధికారులకు అర్థమయ్యేలా చెప్పడం కష్టమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రధాని మోదీ, విదేశాంగ శాఖ మంత్రి జయ్‌శంకర్ కల్పించుకోవాలని తాజాగా మరోమారు విజ్ఞప్తి చేశారు. బిడ్డ తమ చెంతకు చేరేలా సాయం చేయాలని అభ్యర్ధించారు.

Updated Date - 2023-03-10T20:49:54+05:30 IST