నేను బతికే ఉన్నా.. నా డెత్ సర్టిఫికెట్ రద్దు చేయండి.. ఇక్కడ అసలు విషయం ఏంటంటే..
ABN , First Publish Date - 2023-05-16T12:00:02+05:30 IST
చనిపోయాడని అనుకున్న వ్యక్తి 25 ఏళ్ల అనంతరం ఇంటికి తిరిగి రావడంతో కుటుంబసభ్యులు డెత్ సర్టిఫికెట్
ప్యారీస్(చెన్నై): చనిపోయాడని అనుకున్న వ్యక్తి 25 ఏళ్ల అనంతరం ఇంటికి తిరిగి రావడంతో కుటుంబసభ్యులు డెత్ సర్టిఫికెట్ రద్దు చేయాలని పది నెలలుగా పోరాడుతున్నారు. తిరుపత్తూర్ జిల్లా ఆంబూరు సమీపంలో ఉన్న చిన్నమలయంపట్టు గ్రామానికి చెందిన శ్రీరాములు, సావిత్రి దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. అప్పుల బాధ తట్టుకోలేక 1996వ సంవత్సరం కుటుంబ సభ్యులకు చెప్పకుండా శ్రీరాములు(Sriramulu) అదృశ్యమయ్యాడు. ఆయన కోసం పలు ప్రాంతాల్లో గాలించినా జాడ తెలియక పోవడంతో చనిపోయాడనుకున్న కుటుంబసభ్యులు అంత్యక్రియలు కూడా పూర్తిచేశారు. ఈ నేపథ్యంలో, కుమారుల భవిష్యత్ కోసం శ్రీరాములు భార్య సావిత్రి గత 2003వ సంవత్సరం ఆంబూరు మున్సిపాలిటీలో డెత్ సర్టిఫికెట్ పొందారు. దాన్ని భర్త పనిచేసిన కంపెనీలో సమర్పించి వచ్చిన సర్వీసు డబ్బుతో అప్పులు కూడా తీర్చారు. ఇదిలా ఉండగా, 2022 ఏప్రిల్ నెలలో శ్రీరాములు హఠాత్తుగా గ్రామంలో ప్రత్యక్షమయ్యారు. తాను పొరుగూరికి వెళ్లానని వివరించి తనను క్షమించమని ప్రాధేయపడ్డాడు. శ్రీరాములు పేరుతో పొందిన డెత్ సర్టిఫికెట్ రద్దుచేయాలని కోరుతూ ఆయన కుటుంసభ్యులు తహసీల్దార్, కలెక్టర్ తదితర రెవెన్యూ శాఖ అధికారులకు వినతిపత్రం సమర్పించినా ఫలితం కనిపించలేదని తెలిసింది. ఈ కోరికతో గత పది నెలలుగా పోరాడుతున్నట్లు సావిత్రి పేర్కొన్నారు.