Chittoor V. Nagaiah: నాగయ్య విగ్రహాన్ని కాపాడుకుందాం
ABN , First Publish Date - 2023-03-09T11:55:38+05:30 IST
తెలుగుజాతి కోసం పాటుపడిన సినీ దర్శకనిర్మాత, నటుడు, గాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు చిత్తూరు వి.నాగయ్య(Chittoor
- అందరూ కలిసి రండి
- ఏఐటీఎఫ్ పిలుపు
- 11న పానగల్ పార్కులో విగ్రహం పరిశీలన
- ఆ తరువాత ప్రభుత్వానికి నివేదిక
చెన్నై, (ఆంధ్రజ్యోతి): తెలుగుజాతి కోసం పాటుపడిన సినీ దర్శకనిర్మాత, నటుడు, గాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు చిత్తూరు వి.నాగయ్య(Chittoor V. Nagaiah) విగ్రహాన్ని కాపాడుకునేందుకు అందరూ కలిసి రావాలని అఖిల భారత తెలుగు సమాఖ్య (ఏఐటీఎఫ్) అధ్యక్షుడు ఆచార్య సీఎంకే రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక టి.నగర్లో వున్న పానగల్ పార్కులో మెట్రోరైల్వే స్టేషన్(Metro Railway Station) నిర్మితమవుతున్న కారణంగా నాగయ్య విగ్రహం దీనావస్థ గురించి ‘సారీ నాగయ్య గారూ!’ పేరుతో బుధవారం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపట్ల స్పందించిన సీఎంకే రెడ్డి.. ఈ నెల 11వ తేదీన ఉదయం 11.30 గంటలకు విగ్రహాన్ని పరిశీలించనున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం చెన్నై(Chennai)లోని తెలుగు ప్రముఖులంతా తరలిరావాలని పిలుపునిచ్చారు. సంఖ్యాబలం కనిపిస్తేనే మెట్రోరైల్ అధికారులకు గానీ, ప్రభుత్వ యంత్రాంగానికి గాని బలమైన సందేశం వెళ్తుందని పేర్కొన్నారు. తాము అక్కడ ఎలాంటి ధర్నాలు, ఆందోళనలు చేపట్టడం లేదని, కేవలం విగ్రహాన్ని పరిశీలించి, దాని బాగోగుల కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ.. నాగయ్య విగ్రహం దీనావస్థ గురించి వెలుగులోకి తెచ్చిన వైనాన్ని అభినందించారు. తెలుగు ప్రముఖులమంతా కలిసి ఆ విగ్రహాన్ని పరిశీలించిన మీదట, మెట్రోరైల్ అధికారులతోనూ చర్చిస్తామన్నారు. ఏం చేస్తే ఆ విగ్రహాన్ని కాపాడగలమన్న దానిపై చర్చించి రాష్ట్ర ప్రభుత్వానికి, మెట్రోరైల్ అధికారులకు వినతిపత్రం అందిస్తామన్నారు. నాగయ్య విగ్రహాన్ని రక్షించుకోవడం తెలుగువారిగా మన అందరి బాధ్యత అని, ఆ మేరకు తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇందుకోసం తెలుగు ప్రముఖులంతా తరలిరావాలని సీఎంకే రెడ్డి పిలుపునిచ్చారు.

సీఎంఆర్ఎల్ అధికారుల్ని కలిశాం
ద్రావిడదేశం నాగయ్య విగ్రహం దీనావస్థ గురించి గతంలో తమ దృష్టికి రావడంతో ‘చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్’ (సీఎంఆర్ఎల్) అధికారుల్ని కలిశామని ద్రావిడ దేశం అధ్యక్షుడు వి.కృష్ణారావు తెలిపారు. ‘ఆంధ్రజ్యోతి’లో కథనంపై ఆయన స్పందిస్తూ.. చిత్తూరు నాగయ్య విగ్రహాన్ని మళ్లీ అదే ప్రదేశంలో నెలకొల్పాలని సీఎంఆర్ఎల్ అధికారుల్ని కోరగా, మెట్రో స్టేషన్ పనులు పూర్తయ్యాక పరిశీలిస్తామని వారు హామీ ఇచ్చారని తెలిపారు.