Swiggy: భారత్-పాక్ మ్యాచ్.. స్విగ్గీకి కస్టమర్ దిమ్మతిరిగే షాక్..!

ABN , First Publish Date - 2023-09-02T21:57:40+05:30 IST

భారత్ పాక్ మ్యాచ్ సందర్భంగా ఓ కస్టమర్ ఏకంగా 62 ప్యాకెట్ల బిర్యానీ ఆర్డరిచ్చి సంస్థను సర్‌ప్రైజ్ చేశాడు. దీంతో, స్విగ్గీ ఎవరు నాయనా నువ్వూ అంటూ ఎక్స్ వేదికగా స్పందించింది. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Swiggy: భారత్-పాక్ మ్యాచ్.. స్విగ్గీకి కస్టమర్ దిమ్మతిరిగే షాక్..!

ఇంటర్నెట్ డెస్క్: భారత్ పాక్ మ్యాచ్ రేంజ్ ఏంటో అందరికీ తెలిసిందే. దీంతో ఇరు దేశాల్లో తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది! మ్యాచ్ చూసేందుకు ఇరు దేశాల ప్రజలు టీవీలు, ఓటీటీలకు అతుక్కుపోయారు. నరాలు తెగే ఉత్కంఠ ఇది. ఈ టైంలో ఓ కస్టమర్‌ చేసిన పనికి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ కూడా ఆశ్చర్యపోయింది. ‘‘ఎవరూ నాయనా నువ్వు? ఎక్కడుంటావు?..’’అంటూ స్విగ్గీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిందంటే ఆ కస్టమర్ ఏ రేంజ్‌లో ఆశ్చర్యపరిచాడో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.


ఇంతకీ జరిగిందేంటంటే.. బెంగళూరులోని ఓ కస్టమర్ భారత్ పాక్ మ్యాచ్(India Vs Pak Match) జరుగుతున్న టైంలో ఏకంగా 62 ప్యాకెట్ల బిర్యానీ స్విగ్గీలో ఆర్డరిచ్చాడు(Customer orders 62 units of biryani on Swiggy). ఇది చూసి సంస్థ కూడా ఆశ్చర్యపోయింది. ‘‘బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి జస్ట్ ఇప్పుడే 62 ప్యాకెట్ల బిర్యానీ ఆర్డరిచ్చాడు! ఎవరు నాయనా నువ్వు? ఎక్కడ ఉంటావో చెప్పు? ఇండియా పాక్ మ్యాచ్ కోసం ఏదైనా ఫుడ్ పార్టీ ఏర్పాటు చేశావా?’’ అంటూ వరుస ప్రశ్నలతో తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. మరి మేము కూడా రావచ్చా? అంటూ ఓ సరదా ప్రశ్నతో ముగించింది.

ఈ పోస్ట్ పెట్టిన కొద్దిసేపట్లోనే తెగ వైరల్‌ అయిపోయింది. వేలకొద్దీ లైకులు, కామెంట్లు వచ్చి పడ్డాయి. ఇక నెటిజన్లు కూడా ఈ పోస్ట్‌కు వివిధ రకాలుగా స్పందించారు. ‘‘ఇండియా గెలిస్తే నువ్వు నాకు ఫ్రీగా ఫుడ్ పంపించు.. ఒకేనా!?’’ అంటూ ఓ వ్యక్తి రిప్లై ఇచ్చాడు. మరో నెటిజన్ మరింత పదునైన రిప్లై ఇచ్చాడు. ‘‘ఆ కస్టమర్ ఎక్కడ ఉంటాడో నిజంగా తెలీనట్టే ట్వీట్ చేశావే! మరయితే ఆ బిర్యానీని ఎవరికి డెలివరీ చేశావ్?’’ అంటూ పంచ్ ఇచ్చాడు. ఇలా నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్న ఈ పోస్ట్ నెట్టింట ప్రస్తుతం ట్రెండింగ్‌లో(Viral) ఉంది.

Updated Date - 2023-09-02T22:00:59+05:30 IST