UPSC results: ర్యాంకు 184 ఎవరిది?.. ఒకే పేరు.. ఒకే రోల్ నంబర్.. సివిల్స్ రిజల్ట్స్‌లో మిస్టరీ !

ABN , First Publish Date - 2023-05-25T20:40:16+05:30 IST

యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలు రాసిన ఇద్దరు అభ్యర్థులు తాము సెలబ్రేట్ చేసుకోవాలా లేదా నిరాశకు గురవ్వాలా అనే క్లారిటీ లేక ఆందోళన చెందుతున్నారు. 184వ ర్యాంక్ వచ్చిందని ఇద్దరూ భావిస్తున్నారు. కానీ ఒకే ఫస్ట్ నేమ్ (First name), ఒకే రోల్ నంబర్ కారణంగా ర్యాంకు సాధించింది ఎవరనే విషయంలో గందరగోళం నెలకొంది.

UPSC results: ర్యాంకు 184 ఎవరిది?.. ఒకే పేరు.. ఒకే రోల్ నంబర్.. సివిల్స్ రిజల్ట్స్‌లో మిస్టరీ !

భోపాల్‌: భారత్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన పోటీ పరీక్షల్లో యూపీఎస్సీ సివిల్స్ (UPSC Civils) ఒకటి. దేశంలో అత్యంత సంక్లిష్టమైన పరీక్షల్లో ఇదొకటనే పేరుంది. ప్రతి ఏడాది సుమారు 800 పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ జరుగుతుండగా లక్షలాది మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఇటివలే యూపీఎస్సీ -2022 ఫలితాలు వెలువడ్డాయి. ర్యాంకులు సాధించిన అభ్యర్థులు సెలబ్రేట్ చేసుకుంటుండగా.. లక్ష్యాన్ని చేరలేకపోయినవారు నిరాశకు గురయ్యారు. అయితే ఒక ఇద్దరు అభ్యర్థులు తాము సెలబ్రేట్ చేసుకోవాలా లేదా నిరాశకు గురవ్వాలా అనే క్లారిటీ లేక ఆందోళన చెందుతున్నారు. ఒకే ఫస్ట్ నేమ్ (First name), ఒకే రోల్ నంబర్ కారణంగా ర్యాంకు సాధించింది ఎవరనే విషయంలో గందరగోళం నెలకొంది.

మధ్యప్రదేశ్‌లోని దివాస్ జిల్లాకు చెందిన 23 ఏళ్ల ఆయేషా ఫాతిమా, అదే రాష్ట్రంలోని అలిరాజ్‌పూర్ జిల్లాకు చెందిన 26 ఏళ్ల ఆయేషా మక్రాణిలకు ఈ పరిస్థితి ఎదురైంది. యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పోటీ పరీక్షలో 184వ ర్యాంక్ సాధించినట్టు వీరిద్దరూ చెబుతున్నారు. కానీ నిజంగా ఈ ర్యాంకు ఎవరికి వచ్చిందో స్పష్టత లేదు. కేవలం 200 కిలోమీటర్ల దూరంలోనే ఉండే వీరిద్దరూ ఈ ర్యాంకు తనదంటే తనదంటున్నారు. అడ్మిట్ కార్డులను కూడా చూపిస్తున్నారు. ఏదో మోసం జరిగిందని, స్పష్టతనివ్వాలంటూ స్థానిక పోలీస్ స్టేషన్‌తోపాటు యూపీఎస్సీకి కూడా ఫిర్యాదు చేశారు.

ఈ పరిణామంపై ఆయేషా మక్రాణి స్పందిస్తూ... ఈ విజయం కోసం రెండేళ్లపాటు ఎంతోకష్టపడి చదివానని, తన హక్కుని ఎవరో లాక్కుంటూ చూస్తూ ఊరుకోనని ఆమె చెబుతోంది. యూపీఎస్సీ, ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది. ఇక ఆయేషా ఫాతిమా కూడా గట్టిగానే స్పందించింది. తనలాగే ఇంకెవరికో ఒకే రోల్ నంబర్ ఉన్నారని తెలిసి షాక్‌కు గురైనట్టు ఆమె చెప్పింది. ఎలాంటి మోసం జరగకుండా తాను కట్టుబడి ఉంటానని, మెమొరాండమ్ లేదా ఇచ్చిన ఇంకేదైనా పత్రం ఉంటే కచ్చితంగా పరిశీలిస్తానని ఆమె చెబుతోంది.

కాగా వీరిద్దరి అడ్మిట్ కార్డ్స్ పరిశీలించగా కొన్ని వ్యత్యాసాలు కనిపించాయి. మక్రాణి కార్డులో పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ) జరిగిన తేదీ గురువారం 25 ఏప్రిల్ 2023గా ఉంది. ఇక ఫాతిమా కార్డులోనూ అదే రోజు ఇంటర్వ్యూ జరిగినట్టు ఉంది. కానీ రోజు మాత్రం మంగళవారం అని ఉంది. క్యాలెండర్ ప్రకారం 25 ఏప్రిల్ 2023 మంగళవారం వచ్చింది. ఇక ఫాతిమా కార్డుపై యూపీఎస్సీ వాటర్ మార్క్‌తోపాటు క్యూఆర్ కోడ్ ఉంది. కానీ మక్రాణి కార్డు తెల్లటి పేపర్‌పై తీసిన ప్రింటౌట్. దీనిపై ఎలాంటి క్యూఆర్ కోడ్ కూడా లేదు. మరోవైపు అయేషా ఫాతిమానే నిజమైన అభ్యర్థి అని యూపీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి తప్పిదం ఎలా జరిగిందో దర్యాప్తు చేపడతామని అధికారులు చెబుతున్నారు. మరి నిజమైన అభ్యర్థిపై మరింత క్లారిటీ ఎప్పుడొస్తుందో వేచిచూడాలి.

Updated Date - 2023-05-25T20:40:16+05:30 IST