MVV Satyanarayana: జగన్‌పై అందుకే కేసులు.. వైసీపీ ఎంపీ హాట్ కామెంట్స్ వైరల్

ABN , First Publish Date - 2023-08-16T17:54:11+05:30 IST

వైసీపీ ఎంపీ సత్యనారాయణ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బినామీ కంపెనీల పేరుతో జగన్ క్విడ్ ప్రోకోకు పాల్పడి లాభపడ్డారని పరోక్షంగా వైసీపీ ఎంపీ చెప్పడంతో ఆయన వీడియోలు హల్‌చల్ చేస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ క్విడ్ ప్రోకో గురించి ఎంపీ సత్యనారాయణ వ్యా్ఖ్యలు చేయడంపై వైసీపీలో కలవరం మొదలైంది.

MVV Satyanarayana: జగన్‌పై అందుకే కేసులు.. వైసీపీ ఎంపీ హాట్ కామెంట్స్ వైరల్

ఆర్ధిక నేరాలు చేయడంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) మాములోడు కాదని విశాఖ వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ (MVV Satyanarayana) తన మనసులోని మాటను చెప్పకనే చెప్పేశారు. జగన్ క్విడ్ ప్రోకో చేశారని ఇన్‌డైరెక్టుగా సొంత పార్టీ ఎంపీ హాట్ కామెంట్స్ చేయడం ఇప్పుడు వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల ఓ ప్రెస్‌మీట్‌లో తనపై వచ్చిన భూ ఆరోపణలపై వివరణ ఇస్తూ జగన్‌పై ఉన్న కేసుల గురించి వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ స్పందించారు. స్టాంప్ డ్యూటీ కడితే ఎన్ని భూములను అయినా కొనుగోలు చేయవచ్చని.. దానికి ప్రభుత్వం అభ్యంతరం ఏమీ చెప్పదని ఎంవీవీ అన్నారు. దాన్ని క్విడ్ ప్రోకో అని ఎలా అంటారని ఆయన ప్రశ్నించారు. తమ సీఎం జగన్‌పై ఉన్న కేసులన్నీ అలాంటివే కదా అని ఎంపీ సత్యనారాయణ అన్నారు. ఒక పని చేయడం కోసం మరో ఆస్తిని తక్కువగా చూపించడం లేదా షేర్లను తక్కువకు రాయించుకోవడం.. ఇదే కదా జగన్‌పై ఉన్న ఆరోపణలు అని మీడియాను అడిగారు. ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ తన వ్యాపారాలకు సంబంధించి ప్రభుత్వ ఆస్తులను తక్కువ షేర్లకు రాయించారని ఆరోపించారని.. అందులో తప్పు ఏముందని ఎంపీ అభిప్రాయపడ్డారు.

కాగా వైసీపీ ఎంపీ సత్యనారాయణ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బినామీ కంపెనీల పేరుతో జగన్ క్విడ్ ప్రోకోకు పాల్పడి లాభపడ్డారని పరోక్షంగా వైసీపీ ఎంపీ చెప్పడంతో ఆయన వీడియోలు హల్‌చల్ చేస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ క్విడ్ ప్రోకో గురించి ఎంపీ సత్యనారాయణ వ్యా్ఖ్యలు చేయడంపై వైసీపీలో కలవరం మొదలైంది. ఇప్పటికే క్విడ్ ప్రోకో కేసుకు సంబంధించి జగన్ కొన్ని నెలల పాటు జైలులో ఉండాల్సి వచ్చింది. ఇంకా ఈ కేసుపై సీబీఐ కోర్టులో విచారణ జరుగుతూనే ఉంది. ఈ కేసులో ఎ1గా జగన్, ఆయన సన్నిహితుడు, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ కూడా నిందితులుగా ఉన్నారు. తన తండ్రి దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్‌ క్విడ్‌ ప్రోకోకు పాల్పడ్డారని.. ఆయన వ్యాపారాల్లో వివిధ ప్రైవేట్‌ సంస్థలు, వ్యక్తులు కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టారనే ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని జగన్ దుర్వినియోగం చేయడం ద్వారా అక్రమ మార్గాల్లో ఆస్తులు కూడబెట్టారని సీబీఐ ఛార్జిషీట్లు దాఖలు చేసింది. క్విడ్ ప్రోకో కేసుకు సంబంధించి జగన్ ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నారని.. త్వరలో మళ్లీ ఆయన జైలుకు వెళ్తారని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటాయి. తాజాగా ఈ కేసుపై విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ స్పందించడం ప్రతిపక్షాల ఆరోపణలకు మరింత బలం చేకూరిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఇది కూడా చదవండి: AP Politics : ఏపీ మంత్రి అమర్నాథ్‌పై దమ్మున్న ‘ఏబీఎన్’ ప్రశ్నల వర్షం.. సమాధానం చెప్పలేక..!

అటు భూకబ్జాలకు సంబంధించి గతంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణపై పలు ఆరోపణలు వచ్చాయి. అయితే కొందరు కుట్రపూరితంగా తనపై భూకబ్జా ఆరోపణలు చేశారని ఎంపీ ఖండించారు. భూకబ్జా ఆరోపణలపై తాను ఎలాంటి విచారణకు అయినా సిద్ధమని సవాల్ చేశారు. మరోవైపు రెండు నెలల క్రితం ఎంపీ కుటుంబసభ్యులు కిడ్నాప్‌కు గురికావడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు రిషికొండలోని తమ ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులను క్రూరంగా హింసించి డబ్బులు వసూలు చేశారని విశాఖ ఎంపీ ఆరోపించారు.

Updated Date - 2023-08-16T17:56:59+05:30 IST