Governor Tamilisai: కేసీఆర్ సర్కార్‌పై మరోసారి తమిళి‘సై’.. సీఎస్‌‌ను డియర్ అంటూనే..

ABN , First Publish Date - 2023-03-03T12:34:05+05:30 IST

కేసీఆర్ సర్కార్‌కు, తెలంగాణ గవర్నర్ తమిళిసైకి మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. తాజాగా.. తెలంగాణ ప్రభుత్వంపై రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై ఆగ్రహం..

Governor Tamilisai: కేసీఆర్ సర్కార్‌పై మరోసారి తమిళి‘సై’.. సీఎస్‌‌ను డియర్ అంటూనే..

హైదరాబాద్: కేసీఆర్ సర్కార్‌కు, తెలంగాణ గవర్నర్ తమిళిసైకి మధ్య విభేదాలు (CM KCR vs Governor Tamilisai) మరోసారి భగ్గుమన్నాయి. తాజాగా.. తెలంగాణ ప్రభుత్వంపై రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి (Telangana CS Shanti Kumari) వైఖరిపై ట్విటర్ సాక్షిగా గవర్నర్ తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీ కంటే రాజ్‌భవన్‌ దగ్గరుందని, సీఎస్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత శాంతికుమారి రాజ్‌భవన్‌కు రాలేదని.. శాంతికుమారి వైఖరిని తమిళిసై తీవ్రంగా తప్పుబట్టారు.

రాజ్‌భవన్‌ను సందర్శించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దగ్గర సమయం లేదా అని గవర్నర్ బాహాటంగానే శాంతికుమారిని నిలదీసినంత స్థాయిలో ట్వీట్ చేశారు. కనీస మర్యాదగా ఫోన్‌లో కూడా మాట్లాడలేదని, ప్రొటోకాల్ లేదని, పిలిచినా కూడా మర్యాద లేదని సీఎస్‌పై తమిళిసై నిప్పులు చెరిగారు. ‘మళ్లీ గుర్తు చేస్తున్నానని, ఢిల్లీ కంటే రాజ్‌భవనే దగ్గరని, చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని తమిళిసై హితబోధ చేశారు. పెండింగ్ బిల్లుల ఆమోదం కోసం తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకు వెళ్లడంపై గవర్నర్ పరోక్ష విమర్శలు చేయడం గమనార్హం.

గవర్నర్ ఆగ్రహానికి కారణం ఏంటంటే..

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తీరుపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అసెంబ్లీలో ఆమోదించి పంపిన బిల్లులకు గవర్నర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టారంటూ గురువారం పిటిషన్‌ దాఖలు చేసింది. ఇప్పటి వరకూ పది బిల్లులు పెండింగ్‌లో పెట్టారని, గత ఏడాది సెప్టెంబరు నుంచి ఏడు బిల్లులు పెండింగ్‌లో ఉండగా.. ఇటీవలి బడ్జెట్‌ సమావేశాల తర్వాత పంపించిన మూడు బిల్లులకు కూడా గవర్నర్‌ ఆమోదం తెలపలేదని పిటిషన్లో పేర్కొంది. తన పిటిషన్లో ప్రతివాదులుగా గవర్నర్‌ కార్యదర్శిని చేర్చింది. శాసనసభ ఆమోదించిన అనేక బిల్లులకు ఆమోద ముద్ర వేయకపోవడంతో తరచూ రాజ్యాంగ ప్రతిష్టంభన ఏర్పడుతోందని, అందుకే ఆర్టికల్‌ 32 కింద సుప్రీం కోర్టు తన న్యాయ పరిధిని ఉపయోగించాలంటూ న్యాయస్థానం తలుపు తట్టక తప్పలేదని పేర్కొంది.

ఆమోదం తెలపకుండా బిల్లులను వాయిదా వేస్తే హక్కు, ఆలస్యం చేసే హక్కు గవర్నర్‌కు లేదని వివరించింది. గవర్నర్‌ స్వతంత్రంగా వ్యవహరించడానికి వీల్లేదని, రాజ్యాంగంలోని అధికరణ 163 కింద ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రి మండలి సలహా సంప్రదింపుల మేరకే విధులను నిర్వహించాలని, శంషేర్‌ సింగ్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ పంజాబ్‌ కేసులో సుప్రీంకోర్టు ఈ విషయం స్పష్టం చేసిందని గుర్తు చేసింది. పునః పరిశీలించాలంటూ బిల్లును గవర్నర్‌ తిప్పి పంపవచ్చని, కానీ, సవరణ చేసి కానీ చేయకుండా కానీ దానిని తిరిగి అసెంబ్లీ ఆమోదిస్తే ఆ బిల్లును తొక్కిపట్టే అధికారం గవర్నర్‌కు లేదని అధికరణ 200 స్పష్టం చేస్తోందని వివరించింది. ఈ విషయంలో టీటీ కృష్ణమాచారి చేసిన వాదనలను ఉటంకించింది. బిల్లులను ఆమోదించడం రాజ్యాంగబద్ధ విధి అని; రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్‌ వాటిపై ఎటువంటి చర్యలూ తీసుకోకుండా తొక్కిపెట్టడాన్ని అసాధారణం, అక్రమం, రాజ్యాంగ ప్రక్రియకు వ్యతిరేకంగా ప్రకటించాలని సుప్రీం కోర్టును కోరింది. అలాగే, పెండింగులో ఉన్న బిల్లులకు ఆమోదం తెలపాల్సిందిగా గవర్నర్‌ను ఆదేశించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరింది. తన పిటిషన్‌తోపాటు మొత్తం పది బిల్లుల గెజిట్‌లనూ జత చేసింది.

బిల్లులపై పరస్పర ఆరోపణలు

తాము ఎన్నో రకాల ఉద్దేశాలు, లక్ష్యాలతో బిల్లులను ఆమోదించి పంపితే గవర్నర్‌ ఆమోదించకుండా నెలల తరబడి పెండింగ్‌లో పెడుతున్నారని ప్రభుత్వ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అయితే, బిల్లుల్లో స్పష్టత కొరవడిందని, ప్రభుత్వం పూర్తిస్థాయిలో వివరణ ఇవ్వడం లేదని, అందుకే పెండింగ్‌లో పెట్టాల్సి వస్తోందని రాజ్‌భవన్‌ వర్గాలు చెబుతున్నాయి. గత సెప్టెంబరులో జరిగిన శాసన సభ సమావేశాల్లో ప్రభుత్వం ఎనిమిది బిల్లులను ఆమోదించి, అదే నెల 13న గవర్నర్‌ తమిళిసైకి పంపించింది. వాటిలో జీఎస్టీ బిల్లును మాత్రమే గవర్నర్‌ ఆమోదించారు. మిగతా ఏడింటిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇందులో ప్రధానంగా ఆజామాబాద్‌ పారిశ్రామికవాడలోని లీజుదారులకు హక్కులు కల్పించే బిల్లును ఆమోదిస్తే.. ప్రభుత్వానికి దాదాపు రూ.2000 కోట్ల మేర ఆదాయం వచ్చే అవకాశముంది. ఈ బిల్లును ఆమోదించడానికి గవర్నర్‌ విముఖంగా ఉన్నారని సమాచారం. అందుకే, దానిని రాష్ట్రపతి పరిశీలన కోసం పంపినట్లు తెలుస్తోంది. ఇక, యూనివర్సిటీల్లో పోస్టుల భర్తీ కోసం కామన్‌ బోర్డును ఏర్పాటు చేస్తూ రూపొందించిన బిల్లును కూడా ఆమోదించకపోవడంతో 1062 ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేయలేకపోతున్నామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

అయితే, ఈ బిల్లు ద్వారా గవర్నర్‌ పాత్ర లేకుండా చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రాజ్‌భవన్‌ వర్గాలు ఆరోపిస్తున్నాయి. యూనివర్సిటీలు స్వయంప్రతిపత్తి సంస్థలని, బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలను స్వయంగా చేపడుతుంటాయని, యూజీసీ నిబంధనల మేరకు చేపట్టే ఈ నియామకాలపై వర్సిటీల చాన్స్‌లర్‌గా గవర్నర్‌ అజమాయిషీ ఉంటుందని, కానీ, కామన్‌ బోర్డు ఏర్పాటుతో గవర్నర్‌కు ఎటువంటి అజమాయిషీ ఉండదని రాజ్‌భవన్‌ వర్గాలు వివరిస్తున్నాయి. ఈ బిల్లుపై వివరణ ఇవ్వాలంటూ గవర్నర్‌ ఆదేశించడంతో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజ్‌భవన్‌కు వెళ్లి వివరణ ఇచ్చారు కూడా. అలాగే, వైద్య విద్యా సంచాలకుడు, అదనపు సంచాలకుల పదవీ విరమణ వయసును 61 నుంచి 65 ఏళ్లకు పెంచుతూ తీసుకొచ్చిన పబ్లిక్‌ ఎంప్లాయ్‌మెంట్‌ సవరణ బిల్లుపైనా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు రాజ్‌భవన్‌కు వెళ్లి వివరణ ఇచ్చి వచ్చారు. అయినా.. వాటిని గవర్నర్‌ ఆమోదించలేదు. హరితహారం లక్ష్య సాధనకు అడవుల పెంపకానికి సంబంధించి కొత్త కోర్సులను ప్రవేశపెట్టాల్సి ఉందని, అందుకే అటవీ వర్సిటీని ఏర్పాటు చేస్తూ బిల్లును పంపామని, దానిని కూడా గవర్నర్‌ పెండింగ్‌లో పెట్టారని తప్పుబడుతున్నాయి.

Updated Date - 2023-03-03T12:59:32+05:30 IST