AP Politics: వైసీపీలో మంత్రి రోజా ఒంటరి వారయ్యారా? మహిళా మంత్రులు అందుకే మద్దతు ఇవ్వలేదా?

ABN , First Publish Date - 2023-10-05T17:03:16+05:30 IST

. రోజాకు మద్దతుగా మహిళా మంత్రులు, బూతులు మాట్లాడే మంత్రులు ఒక్కరు కూడా స్పందించకపోవడం ఇప్పుడు వైసీపీలోనే చర్చనీయాంశంగా మారింది. మహిళా మంత్రులు విడదల రజినీ, తానేటి వనిత, ఉషశ్రీ చరణ్ స్పందించిన దాఖలాలు లేవు.

AP Politics: వైసీపీలో మంత్రి రోజా ఒంటరి వారయ్యారా? మహిళా మంత్రులు అందుకే మద్దతు ఇవ్వలేదా?

ఏపీ రాజకీయాల్లో మంత్రి రోజా వ్యవహారశైలి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీ నేతలు తనను అసభ్యపదజాలంతో దూషిస్తున్నారని రెండురోజుల కిందట ప్రెస్‌మీట్ పెట్టి మంత్రి రోజా కన్నీటి పర్యంతమయ్యారు. అయితే వైసీపీలో రోజాకు మద్దతిచ్చే నాయకులు కరువయ్యారు. రోజాకు మద్దతుగా మహిళా మంత్రులు, బూతులు మాట్లాడే మంత్రులు ఒక్కరు కూడా స్పందించకపోవడం ఇప్పుడు వైసీపీలోనే చర్చనీయాంశంగా మారింది. మహిళా మంత్రులు విడదల రజినీ, తానేటి వనిత, ఉషశ్రీ చరణ్ స్పందించిన దాఖలాలు లేవు. అటు ఏపీ మహిళా కమిషన్ ఈ అంశంపై టీడీపీ సీనియర్ నేతపై ఫిర్యాదు వచ్చిందన్న ఉద్దేశంతో నోటీసులు ఇచ్చింది తప్ప మీడియాలో ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. దీంతో మంత్రి రోజా వైసీపీలో ఒంటరి వారు అయ్యారంటూ సోషల్ మీడియాలో నెటిజన్‌లు కామెంట్ చేస్తున్నారు.

మంత్రి రోజా కూడా గతంలో ఎన్నోసార్లు ప్రెస్‌మీట్లు పెట్టి టీడీపీ మహిళా నేతలపై అసభ్యపదజాలం వాడుతూ ఆరోపణలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాకుండా అసెంబ్లీ సాక్షిగా అప్పటి మంత్రి పీతల సుజాతను ఉద్దేశించి బాడీషేమింగ్ చేశారు. తమ హయాంలో అసెంబ్లీలో వైసీపీ నేతలు నారా భువనేశ్వరిపై కామెంట్లు చేస్తుంటే మంత్రి రోజా బల్లపై గుద్ది వెకిలి నవ్వులు నవ్వారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కుటుంబసభ్యులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. వైఎస్ వివేకా హత్య కేసుపై మాట్లాడిన ఆయన కుమార్తె వైఎస్ సునీతారెడ్డిపై వైసీపీ నేతలు తప్పుడు కూతలు కూసినప్పుడు మంత్రి రోజా పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు. అంతేకాకుండా ఇటీవల టీడీపీ మహిళా నేతలు వంగలపూడి అనిత, స్వాతిరెడ్డిని ఉద్దేశించి వైసీపీ కార్యకర్తలు వాళ్ల ఫోటోలు మార్ఫింగ్ చేసి బూతులు తిడితే మంత్రి రోజా స్పందించిన పాపాన పోలేదు. మరి ఇప్పుడు ఆమెకు మిగతా మహిళలు ఎలా మద్దతు ఇస్తారని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. సొంత పార్టీ మహిళా నేతలే మంత్రి రోజాను చీదరించుకునే పరిస్థితి ఉందని కామెంట్లు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Cheap Politics: మంత్రి రోజాకో న్యాయం.. మిగతా వాళ్లకో న్యాయమా? ఇదేం విడ్డూరం?

అటు మంత్రి రోజా వ్యవహారశైలిపై టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మద్యం బాటిళ్లను పగలగొట్టిన రోజా రాష్ట్రంలో ఇప్పుడు మద్యం ఏరులై పారుతున్నా ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. రోజాకు రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు అని పేర్కొన్న వంగలపూడి అనిత అలాంటి చంద్రబాబును అరెస్ట్ చేస్తే రోజా సంబరాలు చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. మంత్రి రోజా ఎంత అసభ్యంగా మాట్లాడుతారో అందరికీ తెలుసు అని.. ఆమె పత్తిత్తు మాటలు చెప్పడం మానుకోవాలని వంగలపూడి అనిత హితవు పలికారు.

Updated Date - 2023-10-05T17:03:16+05:30 IST