AP Politics: వైసీపీ అభిమానుల వక్రభాష్యాలు.. ఐటీ ఉద్యోగులు చీరలు కట్టుకోకూడదా?

ABN , First Publish Date - 2023-09-25T14:05:01+05:30 IST

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తున్న ఐటీ ఉద్యోగులను పోలీసులు అడ్డుకోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

AP Politics: వైసీపీ అభిమానుల వక్రభాష్యాలు.. ఐటీ ఉద్యోగులు చీరలు కట్టుకోకూడదా?

టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఐటీ ఉద్యోగులు ఆందోళనలు, ర్యాలీలు చేపడుతున్నారు. ఇక హైదరాబాద్ సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్‌లో ఐటీ రంగం చంద్రబాబు వల్లే అభివృద్ధి చెందిందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు ఆదివారం నాడు భారీ ర్యాలీ చేపట్టారు. చంద్రబాబుకు సంఘీభావంగా హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు కార్లతో ర్యాలీ నిర్వహించారు. గచ్చిబౌలి, ఎల్బీనగర్, ఎస్.ఆర్.నగర్, మాదాపూర్ నుంచి భారీ ఎత్తున ఐటీ ఉద్యోగులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణ సరిహద్దు వద్ద ఏపీ పోలీసులు ఓవరాక్షన్ చేశారు. పలు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ఐటీ ఉద్యోగులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

ముఖ్యంగా కార్లలో వెళ్తున్న ఉద్యోగులను నానారకాల ప్రశ్నలతో పోలీసులు హింసించారు. భారత్-పాకిస్థాన్ బోర్డర్‌ మాదిరిగా ఐటీ ఉద్యోగులకు ఏపీలో ప్రవేశించేందుకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. 144 సెక్షన్ విధించామని.. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. కొందరు అయితే మహిళలను కించపరుస్తూ దుర్భాషలు ఆడినట్లు తెలుస్తోంది. చీరలు కట్టుకున్న మహిళలు ఐటీ ఉద్యోగులు ఎలా అవుతారని పోలీసులు, వైసీపీ కార్యకర్తలు ప్రశ్నించినట్లు సమాచారం. అంతేకాకుండా కొందరు వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఐటీ ఉద్యోగుల ఫోటోలు పోస్ట్ చేసి వీళ్లు అసలు ఉద్యోగులే కాదని.. కర్రీ పాయింట్ నడుపుకునే మహిళలు అంటూ కించపరుస్తున్నారు. ఈ అంశంలో వైసీపీ కార్యకర్తల తీరుపై టీడీపీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతలు ఏదనుకుంటే అదే నిజమంటూ ప్రచారం చేస్తారని.. వాళ్లను ప్రశ్నిస్తే క్యారెక్టర్‌ను కూడా తప్పుపడుతూ కించపరచడం వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య అని మండిపడుతున్నారు. ఐటీ ఉద్యోగులకు ఎక్కడైనా డ్రస్ కోడ్ ఉందా అని ప్రశ్నిస్తున్నారు. ఐటీ ఉద్యోగులు చీరలు కట్టుకోకూడదని రాజ్యాంగంలో రాశారా అని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా వైసీపీ అభిమానుల వక్రభాష్యాలు ఆపాలని.. అధికారంలో తమ పార్టీ ఉందని రెచ్చిపోతున్నారని.. పోలీసులు కూడా వైసీపీ నేతల సేవలోనే తరించడం సిగ్గుచేటు అని ఎద్దేవా చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: CBN Skill Case : సీఐడీ విచారణలో చంద్రబాబుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారా..!?

కాగా పోలీసులు ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా ఐటీ ఉద్యోగులు తట్టుకుని హైదరాబాద్ నుంచి రాజమండ్రి చేరారు. అక్కడ నారా బ్రాహ్మణిని కలిసి చంద్రబాబు అరెస్టుపై సంఘీభావం వ్యక్తం చేశారు. తామంతా చంద్రబాబుకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. అటు ఐటీ ఉద్యోగులను పోలీసులు ఇబ్బంది పెట్టిన అంశంపై నారా బ్రాహ్మణి స్పందించారు. తమకు మద్దతు తెలిపేందుకు హైదరాబాద్ నుంచి వస్తోన్న ఐటీ ఉద్యోగులపై ఆంక్షలు, బెదిరింపులు దారుణమని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ నుంచి వస్తున్న వాహనదారుల ఫోన్‌లు చెక్ చేయడం, వారి చాట్‌లు పరిశీలించడం షాక్‌కు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఏ కారణంతో, హక్కుతో ఉద్యోగుల రాకపై ఆంక్షలు పెట్టారో చెప్పాలని పోలీసులను ప్రశ్నించారు.

Updated Date - 2023-09-25T14:05:01+05:30 IST