Open Heart With RK: ఏసు క్రీస్తు డిసెంబర్ 25న పుట్టలేదా?.. ప్రముఖ రచయిత ముదిగొండ శివప్రసాద్ అభిప్రాయం ఇదే...

ABN , First Publish Date - 2023-05-19T18:19:42+05:30 IST

ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ హోస్ట్‌గా ఏబీఎన్-ఆంధ్రజ్యోతిలో ప్రసారమయ్యే పాపులర్ కార్యక్రమం ‘ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’‌లో ప్రముఖ రచయిత, ప్రొఫెసర్ డాక్టర్ ముదిగొండ శివప్రసాద్‌ పాల్గొన్నారు.

Open Heart With RK: ఏసు క్రీస్తు డిసెంబర్ 25న పుట్టలేదా?.. ప్రముఖ రచయిత ముదిగొండ శివప్రసాద్ అభిప్రాయం ఇదే...

హైదరాబాద్: ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ హోస్ట్‌గా ఏబీఎన్-ఆంధ్రజ్యోతిలో ప్రసారమయ్యే పాపులర్ కార్యక్రమం ‘ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’‌లో (Open Heart With RK) ప్రముఖ రచయిత, ప్రొఫెసర్ డాక్టర్ ముదిగొండ శివప్రసాద్‌ (Mudigonda Siva Prasad) పాల్గొన్నారు. ‘ ఏసు క్రీస్తు డిసెంబర్ 25న పుట్టలేదా?. బైబిల్ చంకలో పెట్టుకునేవారికి అదేంటో తెలుసా?. ఎన్టీఆర్‌కు కులం ఆపాదించి ‘భారతరత్న’ రాకుండా అడ్డుకోవడం తప్పు కాదా?. జగన్, కేసీఆర్‌లకు రైతుల ఉసురు!..’ అనే అంశాలతోపాటు పలు విషయాలపై తన అభిప్రాయలను ఆయన పంచుకున్నారు.

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో శివప్రసాద్ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. బైబుల్ చంకన పెట్టుకొని తిరుగుతున్న వాళ్లకు బైబుల్ తెలవదని వ్యాఖ్యానించారు. డిసెంబర్ 25న ఏసు క్రీస్తు పుట్టాడని ఎవరైనా రుజువు చేస్తే తాను మెడలో శిలువ కట్టుకుంటానని రచయిత ముదిగొండ శివప్రసాద్‌ సవాల్ చేశారు. కలాలకు కులాలు ఏంటి? అని ఆయన ప్రశ్నించారు. ఎన్టీఆర్‌కు కులం ఆపాదించి ఆయనకు భారతరత్న రాకుండా చేశారని మండిపడ్డారు. ఈ భూగోళంపై రాజధాని లేని రాష్ట్రం ఎక్కడన్న ఉందంటే అది తెలుగు వాళ్లదేనన్నారు. రైతులకు కన్నీళ్లు పెట్టిస్తే ఎవరైనా సరే వాళ్ల ఉసురు తగులుతుందని వ్యాఖ్యానించారు.

కాగా 83 ఏళ్ల వయసులోనూ రచనా వ్యాసాన్ని ఆపలేదని శివప్రసాద్‌ చెప్పారు. భారతీయులకు చరిత్ర లేదని ప్రచారం చేశారని, ఆంధ్రులకు అసలు చరిత్ర లేదన్నారని మండిపడ్డారు. భారతీయులు అనాగరికులని ప్రచారం చేశారని గుర్తుచేసుకున్నారు. ఆర్థిక పరమైన ప్రతిఫలం ఆశించి చారిత్రక నవలను రాయలేదని స్పష్టం చేశారు. తాను పెట్టిన ప్రతి హీరోయిన్ పాపులర్ అయ్యిందన్నారు. శ్రావని అని ఒక నవల సృష్టించానని, శ్రావని జ్యూవెలర్స్ షాప్స్ అని వాళ్లు పేర్లు మార్చేసుకున్నారని, అప్పుడు తన జన్మ చరితార్థమైనట్టు అనిపించిందని, నోబెల్ బహుమతి వచ్చినంత సంతోషపడ్డానని శివప్రసాద్ గుర్తుచేసుకున్నారు. ముదిగొండ శివప్రసాద్ పంచుకున్న ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను పూర్తిగా తెలుసుకోవాలంటే ఆదివారం రాత్రి 8:30 గంటలకు ఏబీఎన్-ఆంధ్రజ్యోతిలో ప్రసారమయ్యే ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ కార్యక్రమం వీక్షించాల్సిందే.

Updated Date - 2023-05-19T18:25:35+05:30 IST