Covid-19: కేంద్రం కొత్త రూల్.. ఆ ఆరు దేశాల మీదుగా ఇండియాకు వచ్చే వారు..

ABN , First Publish Date - 2023-01-02T21:24:56+05:30 IST

కరోనా కట్టడి కోసం పలు చర్యలు చేపడుతున్న కేంద్రం తాజాగా.. హైరిస్క్ దేశాల మీదుగా ఇండియాకు వచ్చే వారికి ఆర్‌టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు తప్పనిసరి చేసింది.

Covid-19: కేంద్రం కొత్త రూల్.. ఆ ఆరు దేశాల మీదుగా ఇండియాకు వచ్చే వారు..

ఎన్నారై డెస్క్: చైనాలో ప్రారంభమైన కరోనా సంక్షోభం భారత్‌కు విస్తరించకుండా కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా.. కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న హైరిస్క్ దేశాల(High Risk) మీదుగా ఇండియాకు వచ్చే వారికి ఆర్‌టీపీసీఆర్(RTPCR) నెగెటివ్ రిపోర్టు తప్పనిసరి చేసింది. చైనాతో పాటూ దక్షిణ కొరియా, జపాన్, థాయ్‌ల్యాండ్, హాంకాంగ్, సింగపూర్ దేశాల మీదుగా వచ్చే ప్రయాణికులకు ఈ కొత్త రూల్ వర్తిస్తుంది. అంతర్జాతీయ ప్రయాణికులు తమ ప్రయాణ తేదీకి మునుపు 72 గంటల్లో తీయించుకున్న రిపోర్టును మాత్రమే అధికారులు అనుమతిస్తారు. గతంలో ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు మాత్రమే ఆర్‌టీపీసీఆర్ తప్పనిసరి చేయగా.. ప్రస్తుతం ఆ దేశాల మీదుగా వచ్చే వారికీ ఈ నిబంధన వర్తింపజేసింది.

ప్రస్తుతం దేశంలో రోజు వారి కరోనా కేసులు తక్కువగానే ఉన్నప్పటికీ.. అధికార వర్గాలు అప్రమత్తత పాటిస్తున్నాయి. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రజలు మాస్కులు లేకుండా గుమిగూడకుండా చూడాలంటూ రాష్ట్రాలకు కేంద్రం ఇటీవల సూచించిన విషయం తెలిసిందే. ఇక ఆక్సిజన్ నిల్వలు తగినంత ఉండేలా చర్యలు తీసుకోవాలని కూడా సూచించింది. గత నెలలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ..కొవిడ్-19 ఇంకా ముగిసిపోలేదని వ్యాఖ్యానించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తన మన్‌ కీ బాత్ కార్యక్రమంలోనూ హెచ్చరించారు.

Updated Date - 2023-01-02T21:30:06+05:30 IST