Sankranti: అబుధాబిలో ఆర్యవైశ్యుల సంక్రాంతి సంబరాలు
ABN , First Publish Date - 2023-01-15T07:18:22+05:30 IST
నమస్తే వాసవి దేవి – నమస్తే విశ్వ పావని నమస్తే వ్రత సంబద్దే నమస్తే కౌమారితే నమోనమ: అంటూ శ్రీకన్యకాపరమేశ్వరి పవిత్రనామంతో వైశ్యులు ఇంటా బయట తమకంటూ ఒక విశిష్ఠత కల్గి ఉన్నారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: నమస్తే వాసవి దేవి – నమస్తే విశ్వ పావని నమస్తే వ్రత సంబద్దే నమస్తే కౌమారితే నమోనమ: అంటూ శ్రీకన్యకాపరమేశ్వరి పవిత్రనామంతో వైశ్యులు ఇంటా బయట తమకంటూ ఒక విశిష్ఠత కల్గి ఉన్నారు. కుల మూలపురుషుడు కుబేరడయినా కూడా ఒక్క వర్తక, వాణిజ్య రంగానికి పరిమితం కాకుండా వైశ్యులు దేశవిదేశాలలో ఉద్యోగాలు చేస్తూ తమ ప్రతిభను చాటుతున్నారు. గల్ఫ్ దేశాలలో కూడా మిగిలిన వారితో పాటు ప్రత్యేకించి వైశ్యులు తమ తమ వృత్తులలో రాణిస్తున్నారు. ఇక దుబాయిలో ఈ సారి ప్రపంచ ఆర్యవైశ్య మహాసభలను కూడా నిర్వహించడానికి కసరత్తు చేస్తున్నారు. విదేశీ గడ్డపై పండుగల సందర్భాలలో తమ సంస్కృతి, సంస్కారాలను చాటిచెబుతూ నవతరాలకు కూడా నేర్పిస్తున్నారు. పెనుగొండ అసలు కోమట్ల మూలలుగా ఉన్నట్లుగా భావించే ప్రొద్దుటూరు మరియు రాయలసీమ వైశ్య ప్రవాసీయులు ఈ దిశగా ముందు వరుసలో ఉన్నారు.

ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ (వామ్) యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్లో సంక్రాంతి సందర్భంగా శనివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించింది. వామ్ గౌరవ అధ్యక్షులు మరియు రాజ్యసభ సభ్యుడు టి.జి.వెంకటేశ్ ముఖ్య అతిథిగా మరియు వామ్ అంతర్జాతీయ అధ్యక్షులు టంగుటూరి రామకృష్ణా ప్రత్యేక అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమం ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన రాజేశ్ బైసాని నేతృత్వంలోని వామ్ బృందం అధ్వర్యంలో అబుధాబిలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా దుబాయిలో నిర్వహించనున్న అంతర్జాతీయ వైశ్య సమ్మేళనం గూర్చి టి.జి. వెంకటేశ్, రామకృష్ణాలు అతిథులకు వివరించారు. ఈ సమ్మేళనం ఇప్పటి వరకు తిరుపతి, విజయవాడ మరియు హైద్రాబాద్లలో జరిగింది. కరోనా కారణాన గత రెండు సమ్మేళనాలు జరుగలేదు. ఈ సంవత్సరం దుబాయిలో నిర్వహించడానికి కసరత్తు జరుగుతుంది.

చిన్నారులకు భోగి సంప్రదాయం గూర్చి విశదీకరిస్తూ వివరించిన తీరు అందర్ని ఆకట్టుకొంది. ఈ సందర్భంగా చిన్నారులకు క్విజ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులందరికి బోగిపళ్ళు, చెరుకు ముక్కలు, చాకెట్లు మరియు పువ్వులతో పాటు రూపాయాల నోట్లను కూడా కుటుంబ పెద్ద తరహా టి.జి. వెంకటేశ్ అందిస్తూ ఆశ్వీరదించారు. వాసవీ కిరణాల పేరిట 2023 నూతన సంవత్సర క్యాలెండర్ను కూడా వెంకటేశ్, రామకృష్ణా అవిష్కరించారు. వామ్ గ్లోబల్ ప్రతినిధులైన దుబాయిలోని న్యాయవాది ఒబిలిశెట్టి అనురాధ, సురేశ్ సభికులలో ఉత్సాహాన్ని నింపారు. వామ్ దుబాయి అధ్యక్షుడు సాయి ప్రకాశ్ కూడా తన ప్రశంసంతో ఉత్తేజపరిచారు. కార్యక్రమాన్ని వామ్ అబుధాబి సభ్యులు గంగాధర్, హరీష్, విజయ కొత్తమాను, సాయికృష్ణ నిమ్మగడ్డ, వి. నాగపవన్, భాస్కర్ గుప్త కందుల, ఫణిలతో పాటు మహిళ విభాగం పక్షాన సింధూరీ, శృతి, అనూశ, రుతిక, కవిత, కళ్యాణి సమన్వయం చేశారు.