NRI: సముద్రమార్గంలో అక్రమంగా బ్రిటన్‌లోకి ప్రవేశిస్తున్న భారతీయులు.. వార్తా కథనం వైరల్

ABN , First Publish Date - 2023-02-04T21:37:41+05:30 IST

భారతీయులు సముద్ర మార్గంలో అక్రమంగా బ్రిటన్‌లోకి చొరబడుతున్నారని బ్రిటన్ హోం శాఖ వర్గాలు పేర్కొన్నట్టు ‘ది టైమ్స్ పత్రిక’ తాజాగా ఓ కథనాన్ని ప్రచురించింది.

NRI: సముద్రమార్గంలో అక్రమంగా బ్రిటన్‌లోకి ప్రవేశిస్తున్న భారతీయులు.. వార్తా కథనం వైరల్

ఎన్నారై డెస్క్: భారతీయులు సముద్ర మార్గంలో అక్రమంగా బ్రిటన్‌లోకి చొరబడుతున్నారని(Illegal Indian Immigrants) బ్రిటన్ హోం శాఖ వర్గాలు పేర్కొన్నట్టు ‘ది టైమ్స్ పత్రిక’ తాజాగా ఓ కథనాన్ని ప్రచురించింది. భద్రతా వ్యవస్థలేవీ లేని చిన్న బోట్లల్లో వారు ఇంగ్లిష్ ఛానల్‌(English Channel) దాటి దేశంలోకి కాలుపెడుతున్నట్టు వెల్లడించింది. బ్రిటన్‌లో(UK) అక్రమంగా కాలుపెట్టిన వలసదారుల్లో భారతీయులు సంఖ్యా పరంగా మూడో స్థానంలో ఉన్నట్టు వివరించింది. తొలి రెండు స్థానాల్లో వరుసగా ఆఫ్ఘానీలు, సిరియా వాసులు ఉన్నారు. ఆ పత్రిక కథనం ప్రకారం.. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ 250 మంది భారతీయులు బ్రిటన్‌లోకి అక్రమంగా ప్రవేశించారు.

సిరియాలో(Syria) భారతీయులకు వీసా రహిత ప్రవేశానికి(Visa free entry) అవకాశం ఉండటంతో యూరోప్‌లో కాలుపెట్టేందుకు వారికి మార్గం సుగమమై ఉండొచ్చని ‘ది టైమ్స్’ పేర్కొంది. గతంలో భారతీయులు వీసా లేకుండానే సెర్బియాలో ప్రవేశించే అవకాశం ఉండేది. ఈ ఏడాది జనవరి 1తోనే ఆ అవకాశం ముగిసింది. ఇక బ్రిటన్ హోం శాఖ గణాంకాల ప్రకారం.. 2022 తొలి ఆరు నెలల్లో ఇంగ్లిష్ ఛానల్ ద్వారా బ్రిటన్‌లోకి ప్రవేశించిన అక్రమవలసదారుల్లో ఆల్బేనియన్లు, అఫ్ఘాన్లు, ఇరాన్ దేశస్తులు ఉన్నారు. ఈ జాబితాలో భారతీయుల ప్రస్తావన లేదు. భారతీయులు బ్రిటన్‌లోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారన్న వార్త ఆందోళనకరమని భారత విద్యార్థుల యూనియన్ ఎన్‌‌ఎస్ఐయూ చైర్‌పర్సన్ సనమ్ అరోరా వ్యాఖ్యానించారు. అరుదుగా మాత్రం జరిగే ఘటనలు బ్రిటన్‌లో యావత్ భారతీయ సమాజంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని చెప్పారు.

Updated Date - 2023-02-05T15:21:56+05:30 IST