NRI: కోర్టులో కాలుపెట్టగానే అతడిని చూసి కుప్పకూలిపోయిన ఎన్నారై మహిళ..

ABN , First Publish Date - 2023-01-21T20:27:22+05:30 IST

సింగపూర్‌లో బుధవారం కోర్టులో విచారణకు హాజరైన ఓ ఎన్నారై మహిళ అకస్మాత్తుగా కూలబడిపోయారు.

NRI: కోర్టులో కాలుపెట్టగానే అతడిని చూసి కుప్పకూలిపోయిన ఎన్నారై మహిళ..

సింగపూర్: సింగపూర్‌(Singapore) కోర్టులో విచారణకు హాజరైన ఓ ఎన్నారై మహిళ అకస్మాత్తుగా కూలబడిపోయారు. తనపై దాడి చేసిన వ్యక్తిని చూడగానే తీవ్ర భావోద్వేగానికి లోనైన ఆమె మళ్లీ తేరుకునే వరకూ న్యాయమూర్తి విచారణను కొద్ది సేపు వాయిదా వేశారు. అనంతరం.. ప్రతివాది ఆమెకు కనపడకుండా ఓ తెర కూడా ఏర్పాటు చేశారు. బుధవారం జరిగిన ఈ ఘటన తాలూకు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 2021 మే 7న వాంగ్ అనే వ్యక్తి మాస్క్ పెట్టుకోలేదన్న కారణంతో తనపై దాడి చేశాడని భారత సంతతికి(Indian Origin) చెందిన హిందోచా నీతా విష్ణూభాయ్ అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై జాత్యాహంకార పూరిత వ్యాఖ్యలు(Racist Slur) చేశాడని ఆరోపించారు. తాను బ్రిస్క్ వాకింగ్ చేస్తున్న కారణంగా అప్పట్లో మాస్క్ పెట్టుకోలేదని చెప్పుకొచ్చారు. వ్యాయామం చేసే తీరిక తనకు లేకపోవడంతో సాధారణంగా ఆఫీసు వెళ్లేటప్పుడు వేగంగా నడుస్తుంటానని చెప్పారు. ఆ సమయంలోనే తనకు ఎదురు పడ్డ వాంగ్ తనపై దాడి చేశాడన్నారు. మాస్క్ పెట్టుకోలేదన్న కారణంగా తనను ఎగిరి గుండెలపై తన్నాడని కూడా ఆరోపించారు.

వాంగ్ తన్నడంతో కిందపడి గాయాలపాలైనా తనను పట్టించుకోకుండా అతడు తన దారిన తాను వెళ్లిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. అటుగా వెళుతున్న మరో మహిళ ప్రాథమిక చికిత్స అందించిందని, గాయాలకు కట్టుగట్టిందని పేర్కొన్నారు. ఆ తరువాత..జరిగిన విషయాన్ని ఆఫీసులో మేనేజర్‌కు చెప్పినట్టు తెలిపారు. అనంతరం.. తన భర్త సలహా మేరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది జాత్యాహంకార ప్రేరేపిత దాడిగా ఆమె అభివర్ణించారు. అయితే.. వాంగ్ తరపు న్యాయవాది మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను ఫిబ్రవరి మొదటి వారానికి వాయిదా వేశారు. ఇక సింగపూర్ చట్టాల ప్రకారం.. ఇటువంటి కేసుల్లో నిందితులకు గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష లేదా 5 వేల డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉంది.

Updated Date - 2023-01-21T20:39:48+05:30 IST