NRI: మాట రాక ఏడాదికి పైగా ఆసుపత్రిలో తెలుగు రోగి...ఆత్మీయుల చెంతకు చేర్చిన భారతీయ ఎంబసీ

ABN , First Publish Date - 2023-02-10T20:19:13+05:30 IST

నోటమాట రాక ఏడాదిగా సౌదీ అరేబియా ఆస్పత్రిలో ఓ తెలుగు వ్యక్తిని భారతీయ ఎంబసీ ఆత్మీయుల చెంతకు చేర్చింది.

NRI: మాట రాక ఏడాదికి పైగా ఆసుపత్రిలో తెలుగు రోగి...ఆత్మీయుల చెంతకు చేర్చిన భారతీయ ఎంబసీ

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: కన్నవారికి, కట్టుకున్న వారికి దూరంగా సుదూర ఎడారి ప్రాంతంలో ఆసుపత్రిలో సంవత్సరం పైగా అచేతనంగా పడి ఉండి కనీసం తన పేరు, సొంతదేశం పేరు చెప్పలేని స్థితిలో కన్నీరు మున్నీరయ్యే ఆ రోగిని చూస్తూ ఆసుపత్రి సిబ్బంది జాలిపడ్డారు.

రాజధాని రియాధ్ నగరం నుంచి 1500 కిలో మీటర్ల దూరంలో ఉన్న నారియా అనే ఎడారి ప్రాంతంలోని ఒక ఆసుపత్రిలో 2021 నవంబర్‌లో ఈ రోగికు చేర్పించారు. అతను ఏం చెప్పాలనుకోంటున్నాడో తెలుసుకోవడానికి ఆసుపత్రిలో పని చేసే స్నేహా, అనూ అనే మలయాళీ నర్సులు ఎంత కష్టపడ్డా ఫలితం లేకపోయింది. ఎప్పటికీ కోలుకోలేని ఈ రోగి తన వాళ్ళ వద్దకు చేరుకోవాలని ఆ ఇద్దరు నర్సులు దేవుడ్ని ప్రార్ధించే వారు.

ఆసుపత్రిలోని ప్రతి రోగి వద్దకు ఎవరో ఒకరు వచ్చే వారు కానీ ఈ రోగి వద్దకు ఎవరు వచ్చే వాళ్లు కాదు. సంవత్సరం పైగా ఆసుపత్రిలో పడి ఉన్న ఈ రోగి అఖమా (వీసా), పాస్ పోర్టు గడువు కూడా ముగియడంతో ఇతని వివరాలు తెలుసుకోవడంలో మరింత ఆలస్యమవుతుంది.

2.jpg మరో వైపు భారతదేశంలో ఉంటున్న ఒక పేద కుటుంబం తమ తండ్రి నుండి ఫోన్ రాక చాల కాలమైందని అతని కుటుంబం ఎదురు చూస్తోంది. సరైన పని లేక అప్పుల ఊబిలో ఉన్న తమ తండ్రి గూర్చి తెలియకపోవడంతో క్రమేణా వారిలోనూ ఆందోళన పెరిగిపోతుంది. కానీ తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతుంది.

సౌదీ ఆసుపత్రి ఈ రోగిను ఎందుకు డిశ్చార్జి చేయడం లేదంటూ అధికారులు విచారిస్తున్నారు.

రోగి పేరు, 55 ఏళ్ళ శేఖ్ దస్తీగీర్, శ్రీ అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణానికి చెందిన ఆతను సుదీర్ఘ కాలంగా సౌదీ అరేబియా పని చేస్తున్నా ఎడారి జీవితంలో సవాలక్ష ఒడిదుడుకులు ఎదుర్కోంటూ అప్పుల ఊబిలో ఇరుక్కున్నాడు. చాలా ఏళ్ళు ప్రవాసంలో ఉన్నా జేబులో చిల్లర రూపాయి లేని దారిద్ర్యంలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాడు. ఆందోళనతో మెదడు రక్త నాళాలు చిట్లిపోయి ఒకసారి రోడ్డుపై కుప్పకూలడంతో అత్యవసర బృందాలు అతన్ని 2021లో ఆసుపత్రికు తరలించగా అప్పటి నుండి అతనికి అక్కడే వైద్య చికిత్సలు అందించాయి.

దస్తగీర్ గూర్చి వైద్య శాఖ ఉన్నతాధికారులు విచారించగా అతని పాస్‌పోర్టు, వీసా గడువు ముగిసిందని, ఇతనికు సంబంధించిన వారెవరో కూడా ఇప్పటి వరకు తెలియయపోవడంతో వారు ఇతని దయనీయ స్థితి గూర్చి సౌదీ అరేబియా రాజ కుటుంబ ప్రతినిధి అయిన గవర్నర్ కార్యాలయానికి తెలియజేశారు. దీంతో గవర్నర్ కార్యాలయం సౌదీ అరేబియా విదేశాంగ శాఖ ద్వారా భారతీయ ఎంబసీకు తెలియజేసింది.

ఈ లోపు ఒక ఒంటెల కాపరి గాయపడి చికిత్స పొందుతున్న విషయం తెలుసుకోవడానికి రియాధ్‌లోని తెలుగు సామాజిక కార్యకర్త ముజ్జమ్మీల్ అనుకోకుండా ఆసుపత్రిలో విచారించగా దస్తగీర్ విషాధ గాథ గూర్చి తెలిసింది.

1.jpg భారతీయ ఎంబసీ అధికారుల సహాయంతో దస్తగీర్ కేసు గూర్చి తెలుసుకోన్న ముజ్జమ్మీల్ రోగులను మెడికల్ రిపాట్రియెషన్ విధానంలో స్వదేశానికి పంపించడానికి అనేక నిబంధనలను పాటించవల్సి ఉంటుందని తెలుసుకుని వాటిని ఏపీఎన్నార్టీ సంస్థ సహాయంతో పూర్తి చేసారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఏపీఎన్నార్టీ అధికారులు మేడపాటి వెంకట్, బి.హెచ్. ఇల్యాస్ ఈ విషయంలో తనకు పూర్తిగా సహకరించినట్లుగా ఆయన చెప్పారు.

రోగిని 1500 కిలో మీటర్ల దూరం నుంచి రియాధ్ నగరానికి తీసుకోవరావడంలో కేరళకు చెందిన సామాజిక సేవకులు అన్సారీ, మహబూబ్, సిద్దీఖ్ తువూరులు కష్టపడ్డారు. రోగి వెంట విమానంలో మహెబూబ్ వెళ్ళారు. సంవత్సరంపైగా మంచంపైనే ఉన్న రోగిని తీసుకువచ్చి విమానంలో కూర్చోబెట్టడానికి విమాన సిబ్బంది కష్టపడ్డారు.

రోగికి అవసరమైన పాస్‌పోర్టును, విమాన టిక్కేటు ఖర్చును భారతీయ ఎంబసీ భరించగా బెంగళూరు నుండి స్వస్థలానికి చేరుకోవడానికి అంబులెన్సును ఏపీఎన్నార్టీ సమకూర్చింది. ఈ కేసులో రియాధ్‌లోని భారతీయ ఎంబసీ మానవత దృక్ఫథంలో వ్యవహారించి అన్ని విధాలుగా అండగా నిలిచింది.

Updated Date - 2023-02-10T20:19:14+05:30 IST