ఏం మాట్లాడుతున్నారు.. వారితో మీకు పోలికా?
ABN , First Publish Date - 2023-03-09T11:36:33+05:30 IST
మాజీ ముఖ్యమంత్రులు జయలలిత, కరుణానిధి(Jayalalithaa, Karunanidhi) లాగే తాను కూడా ఓ పార్టీకి అధ్యక్షుడినంటూ బీజేపీ నేత అన్నా
పెరంబూర్(చెన్నై): మాజీ ముఖ్యమంత్రులు జయలలిత, కరుణానిధి(Jayalalithaa, Karunanidhi) లాగే తాను కూడా ఓ పార్టీకి అధ్యక్షుడినంటూ బీజేపీ నేత అన్నామలై చేసిన వ్యాఖ్యలపై అన్నాడీఎంకేకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డి.జయకుమార్(Former Minister D. Jayakumar) స్పందించారు. జయతో అన్నామలైకి పోలికేంటని ప్రశ్నించారు. ఆయన బీజేపీకి అధ్యక్షుడు ఎలా అయ్యాడో తాను చెప్పదలచుకోలేదని నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తూ జయలాంటి నాయకురాలు మరొకరు జన్మించబోరన్నారు. బుధవారం ఆయన చెన్నైలో మీడియాతో మాట్లాడారు. పలువురు బీజేపీ నేతలు అన్నాడీఎంకేలో చేరడంపై స్పందిస్తూ.. అన్నాడీఎంకే మహాసముద్రమని, ఇందులో ఎవరైనా కలవవచ్చని వ్యాఖ్యానించారు. రాయి వేస్తే పగిలిపోయేందుకు అన్నాడీఎంకే అద్దం కాదన్నారు. ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలో అన్నాడీఎంకే(AIADMK) బలోపేతమవుతుండడం పలువురు తమ పార్టీలో చేరుతున్నారన్నారు. ఇలాంటి వాటిని ఆమోదించే రాజకీయ పరిపక్వత రాజకీయ పార్టీల నేతలకు ఉండాలని, అన్నామలైకి కూడా అలాంటిది చాలా అవసరమని ఎద్దేవా చేశారు. ఎడప్పాడి పళనిస్వామి దిష్టిబొమ్మలను దహనం చేసే బీజేపీ కార్యకర్తలను అన్నామలై నియంత్రించాలన్నారు. అన్నాడీఎంకేలో ఉన్న కోటిన్నరమంది కార్యకర్తలు కూడా ఆగ్రహిస్తే ఏమవుతుందో అన్నామలై గ్రహిస్తే మంచిదన్నారు. అన్నాడీఎంకే-బీజేపీ కూటమి కొనసాగుతుందని పళనిస్వామి, అన్నామలై ఇప్పటికే స్పష్టం చేశారని గుర్తు చేస్తూ.. కూటమి ధర్మాన్ని అన్ని పార్టీలు పాటించాలని జయకుమార్ సూచించారు.