Rahul Disqualification: వినాశ కాలే విపరీత బుద్ధి... కేంద్రానికి 'షాట్‌గన్' చురక

ABN , First Publish Date - 2023-03-26T17:37:16+05:30 IST

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడంపై తృణమూల్ కాంగ్రెస్..

Rahul Disqualification: వినాశ కాలే విపరీత బుద్ధి... కేంద్రానికి 'షాట్‌గన్' చురక

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు (Disqualification) వేయడంపై తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ శత్రుఘ్నసిన్హా (Shatrughan Sinha) ఘాటుగా స్పందించారు. ఇందుకు గాను ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానని, 'వినాస కాలే విపరీత బుద్ధి' అనడానికి ఇదొక మంచి ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. ఇందువల్ల ప్రజాస్వామ్య పరిరక్షణ జరగడంతో పాటు రాహుల్ గాంధీకి, 100కి పైగా సీట్లలో విపక్షాలకు అడ్వాంటేజ్ అవుతుందని అన్నారు.

మాజా ప్రధాని దివగంత అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన శత్రుఘ్నసిన్హా ఆ తర్వాత కాలంలో పార్టీకి దూరమవుతూ వచ్చారు. అనంతరం మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీలో చేరారు. పశ్చిమబెంగాల్‌లోని అసోంసోల్ నుంచి ఇటీవల లోక్‌సభకు ఆయన పోటీ చేసి గెలుపొందారు. రాహుల్‌పై అనర్హత వేటును టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సైతం ఖండించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కొత్త ఇండియా ఇలా ఉందని విమర్శించారు. నేర చరిత్ర ఉన్న బీజేపీ నేతలను క్యాబినెట్‌లోకి తీసుకుంటున్నారని, విపక్ష నేతలపై అనర్హత వేటు వేస్తున్నారని అన్నారు. రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో ఇప్పుడు మరింత దిగజారామని ఆమె వ్యాఖ్యానించారు. నాలుగు సార్లు ఎంపీగా ఉన్న రాహుల్‌కు పరువునష్టం కేసులో సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పిన కొద్ది గంటల్లోనే ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. దిగువ కోర్టు తీర్పును పైకోర్టులో సవాలు చేసేందుకు రాహుల్‌కు కోర్టు 30 రోజులు గడువు కల్పించినప్పటికీ కేంద్రం హడావిడిగా రాహుల్‌పై అనర్హత వేటు వేయడాన్ని విపక్ష పార్టీలు ఖండిస్తున్నాయి.

మరోవైపు, రాహుల్‌ లోక్‌సభ సభ్యత్వం రద్దుకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆదివారంనాడు సత్యాగ్రహ నిరసనలు జరుగుతున్నాయి. ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద కాంగ్రెస్ జరిపిన సత్యాగ్రహ నిరసనలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, పి.చిదంబరం, సల్మా్న్ ఖుర్షీద్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-26T17:38:30+05:30 IST