Share News

Uttarakhand: ఉత్తరకాశీ టన్నెల్ ఘటన.. కార్మికులకు ఆహారం పంపే మార్గం సుగమం

ABN , First Publish Date - 2023-11-20T18:37:40+05:30 IST

క్షణ క్షణం ఆందోళన, ఉత్కంఠకు గురి చేస్తున్న ఉత్తర కాశీ టన్నెల్(Uttarkashi rescue) ఘటనలో ఊరటనిచ్చే విషయం చెప్పారు అధికారులు. కార్మికులకు ఫుడ్ సప్లై చేసేందుకు ఏర్పాటు చేసిన 6 అంగుళాల పొడవైన పైపు వారు ఉన్న లోకేషన్ కి చేరుకుంది.

Uttarakhand: ఉత్తరకాశీ టన్నెల్ ఘటన.. కార్మికులకు ఆహారం పంపే మార్గం సుగమం

డెహ్రడూన్: క్షణ క్షణం ఆందోళన, ఉత్కంఠకు గురి చేస్తున్న ఉత్తర కాశీ టన్నెల్(Uttarkashi rescue) ఘటనలో ఊరటనిచ్చే విషయం చెప్పారు అధికారులు. కార్మికులకు ఫుడ్ సప్లై చేసేందుకు ఏర్పాటు చేసిన 6 అంగుళాల పొడవైన పైపు వారు ఉన్న లోకేషన్ కి చేరుకుంది. పైపు గుండా కార్మికులకు కావాల్సిన పోషకాహారాలను ప్లాస్టిక్ బాటిళ్లలో పంపనున్నారు. వారికి అందించాల్సిన ఆహారం విషయమై ప్రత్యేక వైద్య నిపుణుల బృందం ఇప్పటికే అధికారులకు సూచనలు చేసింది. నవంబర్ 12 నుండి ఉత్తరాఖండ్(Uttarakhand)లోని ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న సొరంగం కూలి 41 మంది కార్మికులు చిక్కుకున్న విషయం విదితమే. కార్మికులు టన్నెల్(Uttarakashi Tunnel Collapse)లో ఉండి నేటితో 9 రోజులు గడుస్తోంది.

ఇవాళ వారికి మూంగ్ కిచ్డీ సరఫరా చేయనున్నట్లు అధికారులు తెలిపారు. చిక్కుకున్న వ్యక్తులను కాపాడటానికి రెస్క్యూ ఆపరేషన్ ని దశల వారీగా అమలు చేస్తున్నారు. పైపు గుండ పండ్లతోపాటు తేలికపాటి భోజనం సరఫరా చేయనున్నారు. వారితో ఫోన్ లో సంప్రదించడానికి ఛార్జర్, ఫోన్ ను అధికారులు పంపనున్నారు. నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHIDCL) ఆధ్వర్యంలో ఈ సొరంగం నిర్మాణం జరుగుతోంది.


కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక చార్ ధామ్ ఆల్-వెదర్ రోడ్ ప్రాజెక్ట్‌లో భాగంగా దీన్ని నిర్మిస్తున్నారు. టన్నెల్ లో చిక్కుకున్న 41 మంది కార్మికులు సజీవంగా ఉండేందుకు మల్టీవిటమిన్లు, యాంటిడిప్రెసెంట్స్, డ్రై ఫ్రూట్స్ పంపుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి అనురాగ్ జైన్ ఇవాళ తెలిపారు. యూఎస్ కి చెందిన ఆగర్ యంత్రం, డ్రిల్ చేస్తూ శిథిలాల గుండా పైపులను నెడుతోంది. కార్మికులు బయటపడేందుకు మరో మార్గాన్ని సిద్ధం చేస్తోంది. శుక్రవారం డ్రిల్లింగ్ నిలిపేసే సమయానికి ఆగర్ యంత్రం 40 మీటర్ల శిథిలాల ద్వారా డ్రిల్లింగ్ చేసి.. సొరంగం లోపల 60 మీటర్ల విస్తీర్ణంలో వ్యాపించింది. ఆరు అంగుళాల వ్యాసం కలిగిన పైపు ఇంకా కార్మికులకు చేరలేదు, ఇది వారికి సరైన ఆహారాన్ని అందజేస్తుంది.

కార్మికులను రక్షించేందుకు జరుగుతున్న సహాయక చర్యల గురించి ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీతో ఫోన్‌లో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో వారిని సేఫ్ గా బయటకి తీసుకొస్తామని ప్రధాని అన్నారు. కార్మికులకు ధైర్యాన్ని అందించాలని కోరారు. కేంద్ర ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యల్ని ముమ్మరం చేశామని ధామీ చెప్పారు. అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుల బృందం సోమవారం ఘటనాస్థలికి చేరుకుంది.

రెస్క్యూ ఆపరేషన్ తొమ్మిదవ రోజుకు చేరుకోగా, ఇంటర్నేషనల్ టన్నెలింగ్, అండర్‌గ్రౌండ్ స్పేస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్నాల్డ్ డిక్స్ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు. "కార్మికులను క్షేమంగా బయటకి తీసుకురావాలని నిర్విరామంగా పని చేస్తున్నాం. ప్రపంచం మొత్తం ఈ ఆపరేషన్ నిర్వహించడానికి సాయం చేస్తోంది. ఇక్కడి సహాయక సిబ్బంది అద్భుతంగా పని చేస్తోంది. కార్మికులకు ఆహారం, మందులు సరఫరా చేస్తున్నాం. దానికి సమాంతరంగా టన్నెల్ ని జాగ్రత్తగా తవ్వడానికి ప్రయత్నిస్తున్నాం" అని ఆయన అన్నారు.

Updated Date - 2023-11-20T18:37:41+05:30 IST