Tokens: రూ.1,000 పథకం.. ఇంటింటికీ టోకెన్లు, దరఖాస్తులు
ABN , First Publish Date - 2023-07-21T08:29:06+05:30 IST
బియ్యం రేషన్కార్డు కలిగిన గృహిణులకు ప్రతినెలా రూ.1,000ల చొప్పున వారి బ్యాంక్ ఖాతాలలో చెల్లించే ‘కలైంజర్ మహిళా సాధికారిక పథకం’
ప్యారీస్(చెన్నై): బియ్యం రేషన్కార్డు కలిగిన గృహిణులకు ప్రతినెలా రూ.1,000ల చొప్పున వారి బ్యాంక్ ఖాతాలలో చెల్లించే ‘కలైంజర్ మహిళా సాధికారిక పథకం’ అమలులో భాగంగా గురువారం ఉదయం అర్హులైన వారిని ఎంపిక చేసే నిమిత్తం ఇంటింటికీ టోకెన్లు, దరఖాస్తుల పంపిణీ ప్రారంభమైంది. ఈ పథకాన్ని మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై జయంతి రోజైన సెప్టెంబరు 15 నుంచి అమలుచేయనున్నట్లు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు కోటికి పైగా గృహిణులకు ఆర్ధికసాయం అందించేందుకు ప్రభుత్వం రూ.7 వేల కోట్లు కేటాయించింది. ఈ నేపథ్యంలో, అర్హులైన మహిళలకు నెలకు రూ.1,000 ఆర్ధికసాయం అందించే చర్యలను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ పథకానికి సంబంధించిన టోకెన్లు, దరఖాస్తులను ఇంటింటికి వెళ్లిన పౌరసరఫరాల శాఖ ఉద్యోగులు గృహిణులకు దరఖాస్తులు అందజేశారు. నగరంలో రెండు విడతలుగా నిర్వహించనున్న ఈ పనుల్లో సుమారు 3,400 మంది పాల్గొంటున్నారు. మొత్తం ఉన్న 1,428 రేషన్ దుకాణాల్లో శనివారం వరకు దరఖాస్తుల వినియోగం కొనసాగుతుంది. ఆ తర్వాత ప్రత్యేక శిబిరాల ద్వారా పూర్తిచేసిన దరఖాస్తులను ఈ నెల 24వ తేది నుంచి ఆగస్టు 4వ తేది వరకు స్వీకరిస్తారు.
