Share News

Tamilnadu: అక్రమాస్తుల కేసులో మంత్రికి 3 ఏళ్ల జైలు శిక్ష.. రూ.50 లక్షల జరిమానా విధించిన కోర్టు

ABN , Publish Date - Dec 21 , 2023 | 11:51 AM

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎంకే నేత, తమిళనాడు మంత్రి కె పొన్ముడి(Ponmudy)కి మద్రాస్ హైకోర్టు(Madras High Court) మూడేళ్ల జైలుశిక్ష, రూ.50 లక్షల జరిమానా విధిస్తూ గురువారం తీర్పునిచ్చింది.

Tamilnadu: అక్రమాస్తుల కేసులో మంత్రికి 3 ఏళ్ల జైలు శిక్ష..  రూ.50 లక్షల జరిమానా విధించిన కోర్టు

చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎంకే నేత, తమిళనాడు మంత్రి కె పొన్ముడి(Ponmudy)కి మద్రాస్ హైకోర్టు(Madras High Court) మూడేళ్ల జైలుశిక్ష, రూ.50 లక్షల జరిమానా విధిస్తూ గురువారం తీర్పునిచ్చింది. రూ.1.75 కోట్లు అక్రమంగా కూడబెట్టారన్న కేసులో తమిళనాడు(Tamilnadu) ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి ఆయన భార్య విశాలాక్షిని మద్రాస్‌ హైకోర్టు దోషులుగా తేల్చుతూ బుధవారం తీర్పునిచ్చింది.

డిసెంబర్‌ 21న కోర్టులో లొంగిపోవాలని, అనంతరం శిక్షపై తీర్పు వెల్లడిస్తామని పేర్కొంది. ఈ క్రమంలో గురువారం మళ్లీ విచారణ చేపట్టిన న్యాయస్థానం మంత్రికి శిక్ష ఖరారు చేసింది. ఆయన భార్యకు కూడా రూ.50 లక్షల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.


అక్రమ ఆస్తులు..

పొన్ముడి ఆయన భార్యపై డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ (DVAC) కేసు 2002లో నమోదైంది. ఇందులో వీరిద్దరి ఆదాయం రూ.1.4 కోట్లుగా తేలింది. లెక్కకు మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలతో కోర్టు విచారణ చేపట్టింది. సుదీర్ఘ విచారణల అనంతరం దంపతులిద్దర్ని దోషులుగా చేర్చింది. 1996-2001 మధ్య కాలంలో మంత్రిగా పనిచేసిన సమయంలో పొన్ముడి అక్రమ సంపదను కూడబెట్టారని డీవీఏసీ ఆరోపించింది.

తగిన సాక్ష్యాధారాలను సమర్పించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని పేర్కొంటూ జూన్ 28న వెల్లూరులోని ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు పొన్ముడి దంపతులను నిర్దోషులుగా తేల్చింది. ఈ కోర్టు తీర్పును సవాలు చేస్తూ డీవీఏసీ మద్రాస్ హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. విచారించిన న్యాయస్థానం తీర్పు వెలువరించింది. పొన్ముడిని మంత్రివర్గం నుంచి తొలగించాలని సీఎం స్టాలిన్‌ ప్రభుత్వాన్ని గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ఇటీవల డిమాండ్ చేశారు.

"మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి"

Updated Date - Dec 21 , 2023 | 11:52 AM