Sanjay Raut: లోక్‌సభ ఎన్నికల్లో రౌత్ పోటీ..?

ABN , First Publish Date - 2023-08-21T11:46:58+05:30 IST

శివసేన ఉద్ధవ్ బాల్ థాకరే నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు తాజా సమాచారం. ముంబై నార్త్ ఈస్ట్ లోక్‌సభ సీటుకు పోటీ చేయాలని పార్టీ కోరినట్టు తెలుస్తోంది. రౌత్ ప్రస్తుతం నాలుగోసారి రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు.

Sanjay Raut: లోక్‌సభ ఎన్నికల్లో రౌత్ పోటీ..?

ముంబై: శివసేన ఉద్ధవ్ బాల్ థాకరే (UBT) నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు తాజా సమాచారం. ముంబై నార్త్ ఈస్ట్ లోక్‌సభ సీటుకు పోటీ చేయాలని పార్టీ కోరినట్టు తెలుస్తోంది. రౌత్ ప్రస్తుతం నాలుగోసారి రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. ముంబై నార్త్ ఈస్ట్ లోక్‌సభ సీటుకు ప్రస్తుతం బీజేపీ నేత మనోజ్ కోటక్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.


బీజేపీ సవాల్

ముంబై నార్త్ ఈస్ట్ నుంచి రౌత్ పోటీ చేయనున్నారనే ఊహాగానాల నేపథ్యంలో బీజేపీ నేత నితీష్ రాణే సవాలు విసిరారు. రత్నగిరి, సింధుదుర్గ్ నుంచి ఆయన పోటీ చేయాలని అన్నారు. ''ముంబై నుంచి రౌత్ లోక్‌సభకు నిరభ్యంతరంగా పోటీ చేయవచ్చు. ఆయన పోటీకి దిగాలనుకుంటే సింధుదుర్గ్ నుంచి కానీ, రత్నగిరి నుంచి పోటీకి ఆహ్వానిస్తున్నాను. ఇక్కడ మీకు డిపాజిట్ కూడా దక్కదు. సంజయ్ రౌత్‌కు ఎంత గౌరవం ఉందో మహారాష్ట్ర మొత్తానికి తెలుసు. మీకు ధైర్యం ఉంటే ముంబైకి బదులు రత్నగిరి, సింధుదుర్గ్‌లో నిలబడండి'' అని రాణే సవాలు విసిరారు.


ఉద్ధవ్ కుడిభుజం సంజయ్ రౌత్

ఉద్ధవ్ థాకరేకు కుడిభుజమైన సంజయ్ రౌత్ 2022లో ఏక్‌నాథ్ షిండే శివసేనను చీల్చిన క్లిష్ట సమయంలోనూ ఆయనకు అండగా నిలిచారు. రాష్ట్ర రాజకీయాలపైనే కాకుండా, దేశ రాజకీయాలపై మంచి అవగాహన కలిగిన నేత. మహారాష్ట్ర నుంచి తొలిసారి 2004లో రాజ్యసభకు ఆయన ఎన్నికయ్యారు. అప్పటి నుంచి నాలుగు సార్లు పెద్దలసభలో ఎంపీగా కొనసాగుతున్నారు. శివసేన యూబీటీ పత్రికగా ఉన్న 'సామ్నా'కు సంపాదకుడిగా కూడా ఉన్నారు. పాట్రా ఛావ్లా డవలప్‌మెంట్ ప్రాజెక్టుకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో గత ఏడాది ఆగస్టు 1న రౌత్‌ను ఈడీ అరెస్టు చేసింది. ముంబై ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో అదే ఏడాది నవంబర్ 9న ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. ఒత్తిడులకు తలవొంచిన పోరాట యోధుడుగా రౌత్ తనను తాను అభివర్ణించుకుంటారు.

Updated Date - 2023-08-21T11:46:58+05:30 IST