Share News

Pinarayi Vijayan: కేరళలో అనుమతించబోమంటూ బీజేపీకి ఝలక్ ఇచ్చిన సీఎం పినరయి

ABN , First Publish Date - 2023-10-30T21:29:14+05:30 IST

ఇటీవల జరిగిన ఇస్లామిక్ గ్రూప్ కార్యక్రమంలో ఒక హమాస్ నాయకుడు వర్చువల్ ప్రసంగం చేశాడన్న అంశం కేరళలో వివాదాస్పదంగా మారింది. దీనిపై బీజేపీ అక్కడ నానా రాద్ధంతం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలోనే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్...

Pinarayi Vijayan: కేరళలో అనుమతించబోమంటూ బీజేపీకి ఝలక్ ఇచ్చిన సీఎం పినరయి

ఇటీవల జరిగిన ఇస్లామిక్ గ్రూప్ కార్యక్రమంలో ఒక హమాస్ నాయకుడు వర్చువల్ ప్రసంగం చేశాడన్న అంశం కేరళలో వివాదాస్పదంగా మారింది. దీనిపై బీజేపీ అక్కడ నానా రాద్ధంతం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలోనే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ విషయంపై స్పందించారు. అక్టోబర్ 30వ తేదీన ఆయన మాట్లాడుతూ.. ఇస్లామిక్ గ్రూప్ కార్యక్రమంలో హమాస్ నాయకుడు చేసిన వర్చువల్ ప్రసంగంపై పోలీసులు దర్యాప్తు చేస్తారని, ఏదైనా తప్పు జరిగితే తగిన చర్యలు తీసుకుంటామని స్పస్టం చేశారు. అనంతరం బీజేపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ.. పాలస్తీనాకు మద్దతిస్తున్న వారిని తప్పుడు కేసుల్లో ఇరికించడమే బీజేపీ లక్ష్యమని ఆరోపించారు. అయితే.. దీనిని తాము కేరళలో ఏమాత్రం అనుమతించబోమని తేల్చి చెప్పారు. పాలస్తీనాకు దేశం ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుందని.. కానీ ఇప్పుడు కేంద్రం వైఖరి మారిందని పేర్కొన్నారు.


అసలు తన వర్చువల్ ప్రసంగంలో హమాస్ నాయకుడు ఏం చెప్పాడో మనం చూడాలని.. ప్రసంగాన్ని రికార్డ్ చేసినట్లు తెలుస్తోందని విజయన్ అన్నారు. ఆ సమస్యను మనం సరిగ్గా అర్థం చేసుకున్న తర్వాతే తదుపరి చర్యలు తీసుకోగలమని చెప్పారు. జమాతే ఇస్లామీ లేదా మరే ఇతర సంస్థ.. ఏదైనా కార్యక్రమానికి అనుమతి కోసం పోలీసులను ఆశ్రయిస్తే, దాన్ని నిరాకరించలేమని తెలిపారు. ప్రస్తుత వ్యవహారంలోనూ అదే జరిగిందని, ఇందులో తప్పులేమైనా దొర్లి ఉంటే పోలీసులు విచారణ జరిపి చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. ఈ సమస్యని వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పాలస్తీనాకు మద్దతిస్తున్న వారిపై కేసులు నమోదు చేసేందుకు చంద్రశేఖర్, ఆయన స్నేహితులు ప్రయత్నిస్తున్నారని సీఎం ఆరోపించారు. పాలస్తీనా మద్దతుదారులను తప్పుడు కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని.. అయితే కేరళలో అలా జరగనివ్వమని ఉద్ఘాటించారు.

ఇదిలావుండగా.. హమాస్ నాయకుడి వర్చువల్ ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు చేశారు. అతడు తన సంస్థ గురించి బహిరంగంగా మాట్లాడానని, వామపక్ష ప్రభుత్వం ఈ చోద్యాన్ని మౌన ప్రేక్షకుడిలా చూస్తూ ఊరికే ఉందని ఆరోపించారు. కేరళను ఈ ప్రభుత్వం అవమానపరుస్తోందని పేర్కొన్నారు. అటు.. కేంద్ర సహాయ మంత్రి చంద్రశేఖర్ కూడా ఈ ప్రసంగం వ్యవహారంలో కేరళ ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం లేదా పోలీసులు ఎందుకు ఎలాంటి జోక్యం చేసుకోలేదని ప్రశ్నించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన యువకులను తీవ్రవాదం దిశగా ప్రేరేపించే అవకాశం హమాస్ చీఫ్‌కు లభించిందని వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-10-30T21:29:14+05:30 IST