Assam: అస్సాంలో బాల్య వివాహాలు.. రెండో దశలో భారీ అరెస్టులు.. ఏకంగా 800!

ABN , First Publish Date - 2023-10-03T21:35:59+05:30 IST

సాంకేతిక పరంగా ప్రపంచ దేశాలకు గట్టి పోటీనిస్తున్న ఈరోజుల్లోనూ మన దేశంలో బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. తమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు అందించాల్సిన తల్లిదండ్రులే డబ్బులకు అమ్ముడుపోయి, మేజర్ కాకముందే..

Assam: అస్సాంలో బాల్య వివాహాలు.. రెండో దశలో భారీ అరెస్టులు.. ఏకంగా 800!

సాంకేతిక పరంగా ప్రపంచ దేశాలకు గట్టి పోటీనిస్తున్న ఈరోజుల్లోనూ మన దేశంలో బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. తమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు అందించాల్సిన తల్లిదండ్రులే డబ్బులకు అమ్ముడుపోయి, మేజర్ కాకముందే చిన్న పిల్లలకు పెళ్లిళ్లు చేసేస్తున్నారు. ముఖ్యంగా.. అస్సాం రాష్ట్రంలో బాల్య వివాహాలు ఎక్కువ మోతాదులో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అస్సాం ప్రభుత్వం ఈ బాల్య వివాహాలపై ఉక్కుపాదం మోపింది. సమాజంలో మార్పు తీసుకొచ్చి, అమ్మాయిలకు మంచి భవిష్యత్తు అందించాలన్న ఉద్దేశంతో.. చైల్డ్ మ్యారేజ్‌ని తగ్గించేందుకు ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. బాల్య వివాహాలు చేసుకున్న, అందుకు సహకరించిన వారిపై కొరడా ఝుళపిస్తోంది.


ఇప్పటికే తొలి విడదలో భాగంగా అస్సాం ప్రభుత్వం వేలాదిమందిని అరెస్ట్ చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో తొలి రౌండ్ నిర్వహించి, పట్టుబడిన వారిని జైలుకు పంపించింది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన రెండో విడతలో భాగంగా 800 మందికి పైగా అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా అస్సాం పోలీసులు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగా 800 మంది నిందితులను అరెస్ట్ చేశారని ట్విటర్ మాధ్యమంగా పేర్కొన్నారు. ఈ అరెస్టుల సంఖ్య మరింత పెరగొచ్చని అన్నారు.

ఇదిలావుండగా.. అస్సాంలో బాల్య వివాహాలు, మాతా శిశు మరణాలను తగ్గించేందుకు అస్సాం కేబినెట్ ఒక నిర్ణయం తీసుకున్నారు. 14 నుంచి 18 ఏళ్ల లోపు బాలికలను వివాహం చేసుకున్నవారిని బాల్య వివాహాల నిరోధక చట్టం కింద.. అలాగే 14 ఏళ్ల లోపు వారిని పెళ్లి చేసుకుంటే పోక్సో చట్టం కింద అరెస్టు చేయాలని నిర్ణయించింది. గత ఐదేళ్లలో బాల్య వివాహాలకు సంబంధించిన కేసుల్లో మొత్తం 3,907 మందిని అరెస్టు చేసినట్లు సెప్టెంబర్ 11వ తేదీన హిమంత బిశ్వ శర్మ తెలిపారు. ఈ అరెస్టు ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని ఆయన ప్రకటించారు.

Updated Date - 2023-10-03T21:35:59+05:30 IST