Amit Shah: సూదిమొనంత స్థలం కూడా ఎవరూ ఆక్రమించలేరు.. గర్జించిన అమిత్‌షా

ABN , First Publish Date - 2023-04-10T19:08:50+05:30 IST

భారతదేశానికి చెందిన సూదిమొనంత భూభాగాన్ని కూడా ఎవరూ ఆక్రమించుకోలేరని, దేశంపై చెడు దృష్టి సారించే సాహసం..

Amit Shah: సూదిమొనంత స్థలం కూడా ఎవరూ ఆక్రమించలేరు.. గర్జించిన అమిత్‌షా

కిబితూ: భారతదేశానికి చెందిన సూదిమొనంత (Pin's tip Worth) భూభాగాన్ని కూడా ఎవరూ ఆక్రమించుకోలేరని, దేశంపై చెడు దృష్టి సారించే సాహసం కూడా ఎవరూ చేయలేరని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) అన్నారు. అరుణాచల్ ప్రదేశ్‌ (Arunachal Pradesh)లోని కిబితూ (kibithoo)లో ''వైబ్రంట్ విలేజెస్ ప్రోగ్రాం'' (VVP)ను సోమవారంనాడు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సరిహద్దులను ఇండో-టిబిటన్ సరిహద్దు పోలీసులు, భారత ఆర్మీ కంటికిరెప్పలా చూసుకుంటున్నాయని, ఈ పరిస్థితిల్లో భారత్‌పై చెడుకన్ను వేసే సాహసం ఎవరూ చేయలేరని అన్నారు.

''దేశ ప్రజలందరూ ఇవాళ ప్రశాంతంగా ఇళ్లలో నిద్రిస్తున్నారంటే అందుకు మన సరిహద్దుల్లో రేయింబవళ్లు పహారా కాస్తున్న మన ఐటీబీపీ జవాన్లు, ఆర్మీనే కారణం. దుష్టపన్నాగంతో మన భూభాగంపై కన్నేసే సాహసం ఎవరూ చేయలేరు. ఈ విషయాన్ని మనం ఇవాళ చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. జవాన్ల త్యాగాలకు నేను సెల్యూట్ చేస్తున్నారు. 1962లో ఇక్కడ భూమిని ఆక్రమించుకునేందుకు వచ్చిన వారెవరైతే ఉన్నారో వారు ఇవాళ మీ దేశభక్తి కారణంగా వెనక్కి వెళ్లిపోయారు'' అని చైనాను పరోక్షంగా ఉద్దేశించి అమిత్‌షా అన్నారు.

మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన ''లుక్ ఈస్ట్ పాలసీ''తో ఈశాన్య రాష్ట్రాల్లో ప్రగతిపథంలో దూసుకెళ్తున్నాయని, ఇప్పుడు ఆ ప్రాంతాలు దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నాయని హోం మంత్రి అన్నారు. 2014కు ముందు ఈశాన్య ప్రాంతమంతా కల్లోపిత ప్రాంతంగా ఉండేదని, గత 9 ఏళ్లలో మోదీ తీసుకువచ్చిన లూక్ ఈస్ట్ పాలసీతో అభివృద్ధి కొత్తపుంతలు తొక్కుతోందని చెప్పారు.

వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రాంలో కిబితూ మొదటి గ్రామమని ఆయన అభివర్ణించారు. ఇది చిట్టచివరి గ్రామం ఎంతమాత్రం కాదని ఆయన స్పష్టం చేశారు. గతంలో తాను ఇక్కడికి వచ్చినప్పుడు దేశంలోని చివరి గ్రామాన్ని దర్శిస్తు్న్నారని తనతో అనేవారని, అయితే ఇవాళ తాను ఒక విషయం చెప్పదలచుకున్నానని, కిబితూ ఎంతమాత్రం చివరి గ్రామం కాదని, మొదటి గ్రామమని అన్నారు. 2022-23 నుండి 2025-26 ఆర్థిక సంవత్సరాలకు రూ.4,800 ఆర్థిక కేటాయింపులతో కేంద్ర ప్రాయోజిత పథకమైన “వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్” (VVP)కు మోదీ సారథ్యంలోని కేంద్రం ఆమోదం తెలిపిందని చెప్పారు. గుర్తించబడిన సరిహద్దు గ్రామాలలో నివసించే ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడం, ఉత్తర సరిహద్దులోని బ్లాకుల గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేయడం ఈ పథకం లక్ష్యమని చెప్పారు. తొలి విడతగా 662 గ్రామాలను గుర్తించామని, అందులో 455 గ్రామాలు అరుణాచల్ ప్రదేశ్‌లో ఉన్నాయని తెలిపారు.

Updated Date - 2023-04-10T19:22:08+05:30 IST