Nirmala Sitharaman: ఏటీఎంలలో రూ.2,000 నోటుపై నిర్మలా సీతారామన్ ఏమన్నారంటే..!

ABN , First Publish Date - 2023-03-20T20:00:57+05:30 IST

పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత కేంద్రం కొత్తగా విడుదల చేసిన రూ.500, రూ.2,000 నోట్లలో రూ.2,000 నోట్లు..

Nirmala Sitharaman: ఏటీఎంలలో రూ.2,000 నోటుపై నిర్మలా సీతారామన్ ఏమన్నారంటే..!

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత కేంద్రం కొత్తగా విడుదల చేసిన రూ.500, రూ.2,000 నోట్లలో రూ.2,000 నోట్లు (రూ.2,000 Notes) కొద్దికాలంగా ఏటీఎంలలో అంతగా కనిపించడం లేదు. ఈ క్రమంలో ఏటీఎంలలో రూ.2000 నోట్ల లభ్యతపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) లోక్‌‍సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సోమవారంనాడు లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఏటీఎంలలో నోట్లను ఉంచమని కానీ, ఉంచవద్దని కానీ తాము బ్యాంకులకు సూచించలేదని అన్నారు. ఏటీఎం కేంద్రాల్లో ఏ నోట్లను లోడ్ చేయాలనేది వెండర్ల సొంత నిర్ణయమని చెప్పారు. ఖాతాదారుల అవసరాలకు అనుగుణంగా, కాలానికి అనుగుణంగా నోట్లను జమచేస్తుంటారని తెలిపారు.

రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా (RBI) వార్షిక నివేదికల ప్రకారం, 2017 మార్చి నాటికి చలామణిలో ఉన్న రూ.500, రూ.2,000 నోట్ల విలువ రూ.9.152 లక్షల కోట్లని, 2022 నాటికి ఈ మొత్తం రూ.27.057 లక్షల కోట్లకు పెరిగిందని చెప్పారు. మరో ప్రశ్నకు సమాధానమిస్తూ, కేంద్ర ప్రభుత్వ అప్పులు 2023 మార్చి 31 నాటికి రూ.155.8 లక్షకు కోట్లకు చేరుకుంటుందనే అంచనా వేశామని అన్నారు. దేశ జీడీపీలో ఇది 77.3 శాతం ఉంటుందని అంచనా వేశామని చెప్పారు. ఎక్స్‌టర్నల్ డెబ్ట్ విలువ కరెంట్ ఎక్స్చేంజి రేటుతో చూసుకున్నట్లయితే రూ.7.03 లక్షల కోట్లుగా ఉంటుందని తెలిపారు. అది జీడీపీలో 2.6 శాతమని చెప్పారు. మొత్తం అప్పుల్లో విదేశాల నుంచి తీసుకుంది కేవలం 4.5 శాతమేనని, జీడీపీలో 3 శాతం లోపేనన్నారు. అలాగే భారత ఎగుమతులను ప్రోత్సహించడం, గ్లోబల్ ట్రేడింగ్ కమ్యూనిటీని భారత రూపాయిలో వ్యాపారం కొనసాగించేందుకు తీసుకుంటున్న చర్యలను సైతం ఆర్థిక మంత్రి వివరించారు.

Updated Date - 2023-03-20T20:03:01+05:30 IST