PM MODI: చేతి వృత్తులకు చేయూత
ABN , First Publish Date - 2023-09-18T02:22:09+05:30 IST
దేశంలోని చేతివృత్తిదారులు సహా వివిధ హస్తకళాకారులకు చేయూతనందించేలా కేంద్రప్రభుత్వం ‘పీఎం విశ్వకర్మ’ పథకానికి శ్రీకారం చుట్టింది...

‘పీఎం విశ్వకర్మ’ పథకం ప్రారంభం.. రూ.13 వేల కోట్లు కేటాయింపు
ఐదేళ్లలో 30 లక్షల కుటుంబాలకు లబ్ధి
న్యూఢిల్లీ, సెప్టెంబరు 17: దేశంలోని చేతివృత్తిదారులు సహా వివిధ హస్తకళాకారులకు చేయూతనందించేలా కేంద్రప్రభుత్వం ‘పీఎం విశ్వకర్మ’ పథకానికి శ్రీకారం చుట్టింది. వాస్తుశిల్పి విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని ప్రధాని మోదీ ఆదివారం ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద 13 వేల కోట్ల రూపాయలను కేటాయించారు. ఈ నిధులను ఐదేళ్లపాటు చేతివృత్తిదారులు, కళాకారులకు ఖర్చు చేయనున్నారు. మొత్తంగా ఈ పథకం కింద 30 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని కేంద్రం పేర్కొంది. చేతివృత్తులు, హస్తకళాకారుల నైపుణ్యాన్ని మరింత మెరుగు పరిచి, నాణ్యమైన ఉత్పత్తులను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఈ పథకానికి శ్రీకారం చుట్టినట్టు కేంద్రం పేర్కొంది. ‘పీఎం విశ్వకర్మ’ పథకం కింద చేనేత, స్వర్ణకారులు, కమ్మరి, కుమ్మరి, లాండ్రీ, బార్బర్, శిల్పులు, తాపీమేస్ర్తీలు, బొమ్మల తయారీదారులు, దర్జీలు(టైలర్) సహా 18 రకాల వృత్తుల వారికి స్వల్ప వడ్డీకే రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు రుణాలు అందించనున్నట్టు తెలిపింది. చేతి వృత్తులవారు తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకునేలా రూ.లక్ష రుణాన్ని అందించనున్నారు. ఈ రుణాలకు సంబంధించి లబ్ధిదారులు 5ు వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. కేంద్ర సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల శాఖ మరో 8ు వడ్డీని రాయితీగా చెల్లించనుంది. క్రెడిట్ గ్యారెంటీ ఫీజులను కేంద్ర ప్రభుత్వమే చెల్లించనుంది. అయితే, ప్రాథమికంగా రూ.లక్ష రుణం ఇస్తారు. తర్వాత అర్హతను బట్టి రూ.3 లక్షల వరకు ఇస్తారు. ఇక, ఈ పథకం కింద చేతివృత్తిదారులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయడంతోపాటు 15 రోజుల పాటు నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణా కాలంలో రోజుకు రూ.500 చొప్పున స్టయిపెండ్ ఇస్తారు. చేతివృత్తులవారు తమకు అవసరమైన వస్తువులు కొనుగోలు చేసుకునేలా రూ.15 వేలను ప్రోత్సాహకంగా ఇవ్వనున్నారు. ఈ పథకంలో చేరేందుకు కనీస వయసును 18 ఏళ్లుగా నిర్దేశించారు. పీఎం విశ్వకర్మ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ కావాలి.
యశోభూమి కన్వెన్షన్సెంటర్ ప్రారంభం
ప్రపంచస్థాయి సౌకర్యాలతో ఢిల్లీలో నిర్మించిన ‘యశోభూమి’ కన్వెన్షన్ సెంటర్ తొలిదశ నిర్మాణాన్ని ప్రధాని మోదీ ఆదివారం తన పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మన స్థానిక ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్ను ఎందుకు చేరుకోకూడదు? దీనికి ముందుగా మీరు(ప్రజలు) స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించండి. ఈ పండుగల సీజన్లో స్థానిక ఉత్పత్తులనే కొనుగోలు చేయండి. చిన్నదైనా పెద్దదైనా ‘విశ్వకర్మ’ అని ట్యాగ్ ఉన్న ఉత్పత్తులను కూడా కొనండి’’ అని అన్నారు.
మోదీ బర్త్ డే.. శుభాకాంక్షల వెల్లువ
ప్రధాని మోదీ 73వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఆదివారం ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని బీజేపీ శ్రేణులు, అభిమానులు దేశవ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. మోదీకి రాష్ట్రపతి, కేంద్రమంత్రులు, పలువురు సీఎంలు, రాజకీయ నేతలు, పలు రంగాల ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మోదీ దూరదృష్టి, బలమైన నాయకత్వంలో ప్రతిరంగంలో దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను’’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్వీట్ చేశారు. ‘‘మోదీ నవభారత రూపశిల్పి. అలాంటి విశిష్ట నాయకుడి నేతృత్వంలో పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నా’’ అని కేంద్రహోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు.