Minister: ఆ సినిమా తీయడం లేదు..
ABN , First Publish Date - 2023-03-21T10:56:06+05:30 IST
టిప్పు సుల్తాన్ను హతమార్చినట్టుగా చెబుతున్న ఒక్కలిగ సామాజిక వర్గానికి చెందిన ఉరిగౌడ నంజేగౌడ(Urigowda Nanjegowda) పోరాటానికి సంబంధించి
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): టిప్పు సుల్తాన్ను హతమార్చినట్టుగా చెబుతున్న ఒక్కలిగ సామాజిక వర్గానికి చెందిన ఉరిగౌడ నంజేగౌడ(Urigowda Nanjegowda) పోరాటానికి సంబంధించి సినిమా తీసే విషయమై గందరగోళానికి తెరపడింది. ఏకంగా షూటింగ్ జరిపేందుకు ముహూర్తం ఖరారు చేసుకుని వాయిదా వేసిన విషయం తెలిసిందే. సినిమా నిర్మాణం ద్వారా రాష్ట్రంలో ఒక్కలిగలు, ముస్లింల మధ్య విభేదాలు కలిగించినట్టు అవుతుందని కాంగ్రెస్, జేడీఎస్తోపాటు అధికార బీజేపీకి చెందిన నేతలు విమర్శించారు. ఈ నేపథ్యంలో ఆదిచుంచనగిరి మఠాధిపతి నిర్మలానందనాథస్వామిజీ(Nirmalanandanathaswamyji)ని సోమవారం మంత్రి, నిర్మాత మునిరత్న భేటీ అయ్యారు. సమగ్రమైన సమాచారం లేకుండా సినిమా నిర్మించి వర్గాల మధ్య విభేదాలు తీసుకురాకూడదని స్వామిజీ సూచించారు. దీంతో సినిమా నిర్మించే విషయాన్ని మునిరత్న వదులుకున్నారు. స్వామిజీ భేటీ తర్వాత మంత్రి మునిరత్న(Minister Muniratna) మీడియాతో మాట్లాడుతూ సినిమా నిర్మించేందుకు ఎన్నో కథలు లభిస్తాయని, పాన్ ఇండియా సినిమా తన ఆశయమన్నారు. ఏ వ్యక్తినీ నొప్పించేలా సినిమా నిర్మించే ఆలోచన లేదన్నారు. ప్రస్తుతానికి సినిమా చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఉరిగౌడ నంజేగౌడ సినిమా విషయమై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై(Chief Minister Basavaraj Bommai) మాట్లాడుతూ ఆదిచుంచనగిరి మఠాధిపతి నిర్మలానందనాథస్వామిజీ సూచనలు, సలహాలు పాటించాల్సిందేనని, ఇందులో ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేశారు.
